చండూరు : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో బీసీలను( BCs ) అణగదొక్కు తున్నారని కల్లుగీత కార్మిక ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ ( Palle Ravi ) ఆరోపించారు. ఆదివారం చండూరు పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారెంటీలు ( Six Guarantees ) అమలు చేయకుండా బీసీలను నిర్లక్ష్యం చేస్తూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని విమర్శించారు. మోసాలకు, అబద్ధాలకు పెట్టిన పేరు కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు.
2024- 25 బడ్జెట్లో బీసీలకు రూ. 9 వేల కోట్లు కేటాయిస్తే కేవలం రూ. 3 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని వివరించారు. 2026- 27 బడ్జెట్లో రూ. 12వేల కోట్లు కేటాయించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం బీసీలకు బడ్జెట్లో రూ. 20వేల కోట్లు కేటాయిస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో రాహుల్ గాంధీ పేర్కొన్నారని గుర్తు చేశారు. బీసీలను మోసం చేసి, దగా చేసి కాంగ్రెస్ పార్టీ రాజ్యమేలుతుందని అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని భారత దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా అన్ని రంగాలలో అగ్రగామిగా నిలిపారని, రాష్ట్ర ఆదాయాన్ని రెండున్నర లక్షల కోట్లకు పెంచిన ఘనత కేసీఆర్దేనని వెల్లడించారు. ఐదు సార్లు రైతు భరోసా ఎగ్గొట్టిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందని విమర్శించారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయలన్న ఏకైక లక్ష్యంతో కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ నిలిపేశారని, , రైతుబంధుతోపాటు, రైతుబీమాను ఎగ్గొట్టుతున్నారని మండిపడ్డారు.
విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి, ఆ శాఖకు కూడా భారీగా బడ్జెట్లో కోతపెట్టడం క్షమించరాని నేరమని పేర్కొన్నారు. సమావేశంలో చండూరు మాజీ ఎంపీపీ తోకల వెంకన్న, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి బొడ్డు సతీష్ గౌడ్, మాజీ మండల అధ్యక్షులు పెద్దగోని వెంకన్న గౌడ్, కౌన్సిలర్లు సామ సుజాత యాదవ రెడ్డి, కొండ్రెడ్డి మధు, బోడ శ్రీకాంత్, ఇరిగి రామన్న, చొప్పరి దశరథ, పాలకూరి రాములు,ఇడికూడా నాగరాజు, రాపోలు జగదీష్, బోయపల్లి రమేష్, గండూరి జనార్ధన్, కర్నాటి మల్లేష్, వీరమల్ల స్వామి, బోడ మోహన్ ,కట్కూరి సత్తయ్య, వర్కాల శ్రవణ్ రేవల్లి నరేష్, అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు.