టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు ప్రారంభించగా, గవర్నర్ హోదాలో తమిళిసై అడ్డుకునే కుట్రలు చేస్తున్నారంటూ ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు భగ్గుమన్నారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లును ఆమోదించే దృఢ సంకల్పంతో రూపొందించిన ఆర్టీసీ విలీన ముసాయిదా బిల్లును అడ్డుకునేందుకు గవర్నర్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఈ శనివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని డిపోల ఎదుట ఆందోళనలకు దిగారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. యూనియన్లకు అతీతంగా అందరూ దాదాపు రెండు గంటల పాటు విధులను బహిష్కరించి గవర్నర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల పట్ల గవర్నర్ తీరు మార్చుకుని బిల్లుకు ఆమోదం తెలుపాలని డిమాండ్ చేశారు. వేలాది కుటుంబాలకు మేలు జరిగే బిల్లుపై రాజకీయాలు చేసి తమ బతుకులతో ఆడుకోవద్దని కోరారు. అనంతరం పెద్దసంఖ్యలో రాజ్భవన్ ముట్టడికి తరలివెళ్లారు. ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళనతో బస్టాండ్లన్నీ కొద్దిగంటలపాటు నిర్మానుష్యంగా మారాయి.
– నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ)
మిర్యాలగూడ టౌన్, ఆగస్టు 5 : ఆర్టీసీ బిల్లుకు తక్షణమే ఆమోదం తెలుపాలని ఆ సంస్థ ఉద్యోగులు శనివారం మిర్యాలగూడ డిపో ఎదుట నల్లబాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పరిమి రామావతారం, ప్రధాన కార్యదర్శి అయితరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని, ఇలాంటి చారిత్రక నిర్ణయంపై గవర్నర్ ఆమోదం తెలుపకపోవడం బాధాకరమని అన్నారు. ఆ ఫైల్కు తక్షణమే ఆమోదం తెలిపి తమ కుటుంబాల్లో వెలుగులు నింపాలని గవర్నర్ను కోరారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగుల సంఘం మిర్యాలగూడ డిపో అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే ఇక్బాల్, హనుమంతు, నాయకులు కళ్యాణ్కుమార్, టీఎస్ రెడ్డి, గోపయ్య, రాములయ్య, ఉద్యోగులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో 42వేల పైచిలుకు కుటుంబాలకు లబ్ధి చేకూర్చేందుకు సీఎం కేసీఆర్ చేపట్టిన ఆర్టీసీ విలీన నిర్ణయానికి గవర్నర్ అడ్డుపడే యత్నాలపై ఉమ్మడి జిల్లా అంతటా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే ఆర్టీసీ బిల్లును ఆమోదించాలన్న దృఢ సంకల్పంతో ప్రభుత్వం పావులు కదిపింది. అందులో భాగంగా విలీన ముసాయిదా బిల్లును రూపొందించి వెంటనే రాజ్భవన్కు పంపింది. అయితే.. రెండ్రోజుల అనంతరం గవర్నర్ దానిపై న్యాయ సలహా పేరిట మోకాలడ్డే ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. దీంతో శుక్రవారం సాయంత్రం ఈ విషయం తెలిసిన ఆర్టీసీ కార్మికులు ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుత ప్రభుత్వ కాలంలో ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు కావడంతో ఇప్పుడు బిల్లు ఓకే కాకపోతే మళ్లీ సుదీర్ఘ నిరీక్షణ తప్పుదు. అందుకే ఆర్టీసీ కార్మికులు వెంటనే ఆందోళనలకు సిద్ధమయ్యారు. వివిధ ఆర్టీసీ కార్మిక సంఘాల పిలుపు మేరకు శనివారం కార్మికులు నిరసనలకు దిగారు. నల్లగొండ రీజియన్ పరిధిలోని ఏడు డిపోల్లో ఆందోళనలు జరిగాయి. ఉదయం 6నుంచి 8 గంటల వరకు అన్ని డిపోల్లో కార్మికులు విధులు బహిష్కరించి నిరసనలు చేపట్టారు. నల్లబ్యాడ్జీలు ధరించి డిపో గేట్ల ఎదుట బైఠాయించారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకుని ఆందోళన చేపట్టారు. గవర్నర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్లగొండలో పెద్ద సంఖ్యలో కార్మికులు విధులు బహిష్కరించి డిపో ప్రధాన గేటు ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో రెండు గంటలపాటు బస్సులు బయటకు రాకపోవడంతో బస్టాండ్ నిర్మానుష్యంగా మారింది.
మిర్యాలగూడలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ సిబ్బంది, ఇతర కార్మికులు ఉదయం విధులకు దూరంగా ఉన్నారు. డిపో గేటు ఎదుట నిరసన తెలిపారు. దేవరకొండ, నార్కట్పల్లి డిపోల్లోనూ యూనియన్లకు అతీతంగా నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు. కోదాడ డిపో ప్రధాన గేటు ఎదుట బైఠాయించి గవర్నర్ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. సూర్యాపేట డిపోలో పెద్ద సంఖ్యలో కార్మికులు ఆందోళనకు దిగారు. ఏండ్ల తరబడి ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం కోసం ఎదురుచూస్తుంటే సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తాము ఎంతో సంతోషపడ్డామని కార్మికులు వ్యాఖ్యానించారు. గవర్నర్ ఈ బిల్లును అడ్డుకోవాలనుకోవడం తీవ్ర నిరాశ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది కుటుంబాలకు మేలు జరిగే బిల్లుపై గవర్నర్ తన తీరు మార్చుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు. యాదగిరిగుట్ట డిపో వద్దకు తెల్లవారుజామునే పెద్ద సంఖ్యలో డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర కార్మికులు తరలివచ్చారు. రెండు గంటల పాటు విధులను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. దీంతో బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడి బస్టాండ్ ఖాళీగా దర్శనమిచ్చింది. అనంతరం ఆయా డిపోల నుంచి పలువురు నేతలు, కార్మికులు హైదరాబాద్కు తరలివెళ్లారు.
ఆర్టీసీ ఉద్యోగుల నిరసన
సూర్యాపేట అర్బన్, ఆగస్టు 5 : ఆర్టీసీ బిల్లును ఆమోదించాలని ఆ సంస్థ ఉద్యోగులు శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగుల సంఘం డిపో కార్యదర్శి ఎం.నర్సయ్య మాట్లాడుతూ 43వేల మంది కార్మికులు ఉన్న ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపేందుకు తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్ ఆపడం సమంజసం కాదన్నారు. ఈ నిర్ణయంతో ఎంతో మంది పేద, మధ్య తరగతి కార్మికుల జీవితాలు ఆధారపడి ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఎండీ ఘని, చెల్కపల్లి వెంకన్న, ధరావత్ భాను, భూపతి రమేశ్, మాచర్ల భాస్కర్, జానీ, సావిత్రి, మాధవి, యల్లమ్మ, రవీందర్, శ్రీనివాస్, నర్సయ్య పాల్గొన్నారు.
నార్కట్పల్లిలో బస్సులు నిలిపివేత
నార్కట్పల్లి, ఆగస్టు 5 : ఆర్టీసీ బిల్లును గవర్నర్ ఆమోదించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) ఆధ్వర్యంలో శనివారం నార్కట్పల్లి డిపో ఎదుట రెండు గంటలపాటు నిరసన తెలిపారు. ఉదయం 6నుంచి 8గంటల వరకు బస్సులను నిలిపివేశారు. అనంతరం టీఎంయూ నాయకులు హైదరాబాద్ రాజ్భవన్ వద్ద నిరసన ప్రదర్శనకు వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తుంటే గవర్నర్ ఆపడం సరికాదని టీఎంయూ డిపో సెక్రటరీ యాసిన్ అలీ అన్నారు.
ఆర్టీసీ బిల్లును ఆమోదించాలని ధర్నా
దేవరకొండ, ఆగస్టు 5 : ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును ఆమోదించకుండా కాలయాపన చేస్తున్న గవర్నర్ తీరుకు నిరసనగా శనివారం దేవరకొండ డిపో వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ కార్మికుల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారన్నారు. గవర్నర్ వెంటనే బిల్లును ఆమోదించాలని కోరారు. కార్యక్రమంలో ఉద్యోగ సంఘం నాయకులు ఓరుగంటి రమేశ్, రాజేందర్, దీప్లాల్, సమద్, నారాయణ పాల్గొన్నారు.
గవర్నర్ తీరుపై నిరసన
యాదగిరిగుట్ట, ఆగస్టు 5 : ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న గవర్నర్ తమిళిసై తీరును వ్యతిరేకిస్తూ యాదగిరిగుట్ట డిపోలో ఆ సంస్థ కార్మికులు ధర్నా నిర్వహించి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. శనివారం ఉదయం రెండు గంటల పాటు డిపో ఎదుట ఆందోళన నిర్వహించారు. దీంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. గవర్నర్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వం పంపిన ఆర్టీసీ ముసాయిదా బిల్లుకు అనుమతి ఇవ్వకుండా న్యాయ సలహా పేరుతో జాప్యం చేయడం తగదని పేర్కొన్నారు.
కోదాడలో బస్సులు బంద్
కోదాడ టౌన్, ఆగస్టు 5 : ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలుపకుండా కొంత సమయం కావాలని కోరడంపై కోదాడ డిపోకు చెందిన ఆర్టీసీ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం 6నుంచి 8గంటల వరకు బస్సులు బంద్ చేసి నిరసన తెలిపారు. ప్రభుత్వం పంపిన బిల్లును వెంటనే ఆమోదించి తమకు న్యాయం చేయాలని గవర్నర్ను కోరారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.
గవర్నర్ తీరుపై వెల్లువెత్తిన నిరసనలు
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లును ఆమోదించకుండా జాప్యం చేస్తున్న గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ తీరుపై ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లును తక్షణమే ఆమోదించాలని డిమాండ్ చేస్తూ శనివారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని డిపోల వద్ద ఆందోళన చేపట్టారు. ఉదయం 6నుంచి 8గంటల వరకు ఏడు డిపోల వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. డిపోల నుంచి బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. గవర్నర్ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ బిల్లును వెంటనే ఆమోదించి తమ జీవితాల్లో వెలుగులు నింపాలని కోరారు.
– నల్లగొండ సిటీ, ఆగస్టు 5
బిల్లును గవర్నర్ వెంటనే ఆమోదించాలి
ప్రభుత్వం తీర్మానం చేసి గవర్నర్కు పంపిన ఆర్టీసీ బిల్లును వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేస్తున్నాం. సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయించారు. కానీ.. బీజేపీకి అనుకూలంగా ఉన్న గవర్నర్ రాజ్యాంగబద్ధంగా పని చేయకుండా కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు నడుచుకుంటున్నారు. ఆ చర్యలతో వేల కుటుంబాల భవిష్యత్ ఆగమ్యగోచరంగా మారే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా ఆర్టీసీ సిబ్బంది కోరిక మేరకు బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలుపాలని కోరుతున్నాం. లేకుంటే నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తాం.
– మధుసూదన్రావు, తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ సూర్యాపేట డిపో సెక్రటరీ
43వేల మంది జీవితాలతో ఆటలా..
దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించడు అన్న చందంగా ఉంది మా ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చేస్తూ పంపిన బిల్లును ఆమోదించకుండా గవర్నర్ వివిధ అంశాలపై వివరణ సాకుతో ఆపివేయడం తగదు. ఈ చర్యలతో ఆర్టీసీలో ఉన్న సుమారు 43వేల మంది ఉద్యోగులు, వారి మీద ఆధారపడి జీవిస్తున్న వారి జీవితాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా రాజకీయ కక్షలకు పోకుండా అందరికీ ఉపయోగపడే బిల్లును వెంటనే ఆమోదించాలని కోరుతున్నాం. గతంలో 50 రోజులకు పైగా సమ్మె చేసినం. ఇప్పుడూ చేసేందుకు వెనుకాడేది లేదు.
– ఏకాంబరం, కండక్టర్, సూర్యాపేట డిపో
సీఎం కేసీఆర్ సంకల్పించినా గవర్నర్ ఆమోదించడం లేదు
ఆర్టీసీ ఉద్యోగులకు న్యాయం చేకూర్చాలనే గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టారు. ఆ బిల్లును గవర్నర్కు పంపితే ఆమోదించకుండా జాప్యం చేయడం సరైన నిర్ణయం కాదు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్ ఆమోదించి మా బతుకులు మార్చాలని కోరుతున్నాం.
– షేక్ అబ్దుల్ రహీం, కండక్టర్, కోదాడ డిపో