ఎమ్మెల్యేల సారథ్యంలో ఘనంగా వేడుకలు
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్ల భాగస్వామ్యం
నేడు నియోజకవర్గ కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు
తెలంగాణ రాష్ట్ర సాధకుడు, అభివృద్ధి స్వాప్నికుడు
నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి15(నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఉమ్మడి జిల్లా అంతటా ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడ్రోజుల వేడుకల్లో తొలిరోజు మంగళవారం పెద్దఎత్తున అన్నదానాలు, వితరణలు, పండ్ల పంపిణీ వంటివి చేపట్టారు. మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి మార్గదర్శనంలో నియోజకవర్గాలవారీగా ఎమ్మెల్యేల సారథ్యంలో పెద్దఎత్తున వేడుకలు నిర్వహించారు. జిల్లాల వారీగా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు భాగస్వాములై కార్యక్రమాలు చేపట్టారు. అంతటా సీఎం కేసీఆర్ బర్త్ డే కేక్లు కట్ చేసి నోరు తీపి చేసుకున్నారు. కొన్నిచోట్ల
మొక్కలు నాటారు. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ముఖ్యమంత్రి కేసీఆర్పై అభిమానాన్ని చాటుకున్నారు. సూర్యాపేటలో న్యాయవాదులు అన్నదానం చేశారు. బుధవారం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రక్తదాన శిబిరాల నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. టీఆర్ఎస్ శ్రేణులు, ముఖ్యంగా యువత పెద్దసంఖ్యలో హాజరయ్యేలా కార్యాచరణ సిద్ధం చేశారు.
సీఎం కేసీఆర్ బర్త్డే మొదటి రోజు వేడుకలను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, యువనేత కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు జిల్లావ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు జన్మదిన వేడుకల్లో భాగస్వాములయ్యాయి. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ముందుండి పలు కార్యక్రమాలు నిర్వహించారు. నల్లగొండ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. జడ్పీ చైర్మన్ బండానరేందర్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే కేక్కట్ చేసిన అనంతరం అన్నదానం ప్రారంభించారు. ఆస్పత్రిలోని రోగులు, వారి బంధువులు పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి తరలివచ్చారు. నల్లగొండలోని లెప్రసీ హెల్త్ సెంటర్ ఆవరణలో గుత్తా వెంకట్రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు.
ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి, జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డితో కలిసి కార్య క్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి కేక్ కేట్కట్ చేశారు. మిర్యాలగూడలోని వృద్ధ, అనాథ, మానసిక వికలాంగుల పాఠశాల, మదర్సాలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు ఆధ్వర్యంలో అన్నదానం, పండ్లు, స్వీట్లు, దుప్పట్ల పంపిణీ చేశారు. అన్ని కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొని కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. నకిరేకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో బర్త్డే వేడుకలు జరిగాయి. నకిరేకల్, రామన్నపేటలో ఎమ్మెల్యే చిరుమర్తి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా పెద్ద సంఖ్యలో జనం భాగస్వాములయ్యారు. దేవరకొండ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ నేతృత్వంలో దేవరకొండలోని వృద్ధాశ్రమం, ప్రభుత్వ ఆస్పత్రిలో అన్నదానం, పండ్ల పంపిణీ చేపట్టారు. వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని హాలియా మున్సిపాలిటీ ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నోముల భగత్ ప్రారంభించారు. నాగార్జునసాగర్, పెద్దవూరలో పండ్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి హాలియా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. మునుగోడు నియోజవర్గంలోని మండల కేంద్రాల్లో పార్టీ నేతలు అన్నదానాలు నిర్వహించారు.
సూర్యాపేటలో వాడవాడలా….
సూర్యాపేటలో మంత్రి జగదీశ్రెడ్డి మార్గదర్శనంలో టీఆర్ఎస్ శ్రేణులు పట్టణంలోని పలు ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాయి. వృద్ధ, అనాథాశ్రమాలు, బధిరుల పాఠశాలతో పాటు పలుకూడళ్లల్లో అన్నదానాలు ఏర్పాటు చేశారు. రాజీవ్నగర్ చౌరస్తా, ఏరియా ఆస్పత్రి, మున్సిపల్ కార్యాలయం, తెలంగాణతల్లి విగ్రహం, నెహ్రూనగర్, కోర్టు చౌరస్తాలో పేదలకు అన్నదానం చేశారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ బర్త్డే సందర్భంగా మైనార్టీ స్కూల్లో అన్నదానం ఏర్పాటు చేశారు. అంతకుముందు వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మొక్కలు నాటి పండ్లు పంపిణీ చేశారు. కోదాడ నియోజకవర్గంలోని నడిగూడెం మండలం శ్రీరంగాపురంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ కేక్కట్ చేసి అన్నదానం నిర్వహించారు. మహిళలకు చీరలకు, పేదలకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. వల్లభాపురంలో ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు సర్వమత ప్రార్థనలు చేశారు. తుంగుతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ మార్గదర్శనంలో అన్ని మండలాల్లో కేసీఆర్ బర్త్డే వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు అన్నదానాలు, పండ్లు పంపిణీ చేశారు. ర్యాలీలు నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లగిరి గ్రామంలోని మానసిక వికలాంగుల ఆశ్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
నేడు రక్తదాన శిబిరాలు
కేసీఆర్ బర్త్డే వేడుకల్లో భాగంగా బుధవారం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నారు. అందుకోసం ఇప్పటికే స్థానికంగా ఉన్న బ్లడ్ బ్యాంకులతో సమన్వయం చేసుకుంటూ దాతలను సిద్ధం చేశారు. పెద్ద ఎత్తున శిబిరాలు నిర్వహించడం వల్ల ఆపద సమయాల్లో రక్తం అందుబాటులోకి రానున్నది.