Online Games | భువనగిరి మండలంలోని బండ సోమారం గ్రామానికి చెందిన చెరుకూరి ప్రసాద్ ఆన్లైన్ గేమ్స్కు అడిక్ట్ అయ్యాడు. బిజినెస్ కోసం అత్తగారిచ్చిన ఎకరం భూమిని రూ.32 లక్షలకు అమ్మాడు. ఆ డబ్బులతో అత్యాశకు పోయి ఆన్లైన్ గేమ్ ఆడాడు. తొలుత రూ.5లక్షల వరకు పోగొట్టుకున్నాడు. తన వద్ద ఉన్న మరో రూ.17లక్షలతో ఓపెన్ ప్లాట్ కొని.. ఆ తర్వాత ప్లాట్ పేపర్లు తాకట్టు పెట్టి రూ.15లక్షల అప్పు తెచ్చాడు. ఆ డబ్బంతా ఆన్ లైన్ గేమ్లో పోవడంతో కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సెల్ఫీ వీడియో తీసి ఫోన్ స్విచ్ఛాప్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లాడు. రెండు రోజుల తర్వాత తిరిగి ఇంటికి చేరడంతో కథ సుఖాంతమైంది. ఇదీ ఇటీవల బయటకు వచ్చిన కేసు. బహిర్గతం కాని ఇలాంటి కేసులు మరెన్నో ఉన్నాయి.
యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : ఆన్లైన్ గేమ్స్తో జనం ఆగమవుతున్నారు. విద్యార్థుల నుంచి పెద్దల వరకు పైసలు పోగొట్టుకుంటూ జేబులు గుల్ల చేసుకుంటున్నారు. గేమ్లకు బానిసవుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.అప్పులు చేసి మరీ గేమ్స్ ఆడుతూ కుటుంబాలను వీధిన పడేస్తున్నారు. కరోనా తర్వాత చిన్నా, పెద్ద స్మార్ట్ఫోన్ను విపరీతంగా ఉపయోగిస్తున్నారు. కాలక్షేపం పేరుతో యాప్స్ను వాడుతున్నారు. ఇదే క్రమంలో ఆన్లైన్ గేమ్స్కు బానిసలవుతున్నారు. చిన్న పిల్లలు తెలియక బాధితులు అవుతుండగా, పెద్దలు మాత్రం డబ్బుల అత్యాశతో ఈ జూదంలోకి దిగుతున్నారు.
విద్యార్థులు, యువతతోపాటు పెద్దలు, ఉద్యోగులు సైతం ఆన్లైన్ జూదం బాటపట్టి రమ్మీ ఆడుతున్నారు.
ఫోన్లో నెట్ సౌకర్యం, బ్యాంకు అకౌంట్లో డబ్బులు ఉంటే చాలు ఎకడి నుంచైనా రమ్మీ ఆడొచ్చు. ఆన్లైన్లో పేకాటకు సంబంధించి 20కి పైగా యాప్స్ అందుబాటులో ఉన్నాయి. చాలామంది ఆన్లైన్లో జంగల్ రమ్మీ, క్లాసిక్ రమ్మీ, ప్లే రమ్మీ, ఏసీ ఈ టూ త్రీ డాట్ కామ్, ఫస్ట్ గేమ్స్ డాట్ కాం, డకన్ రమ్మీ డాట్ కాం తదితర వెబ్సైట్లో పేకాట ఆడుతూ జేబుకు చిల్లు పెట్టుకుంటున్నారు.
ఆన్లైన్ గేమ్స్కు అలవాటు పడిన వారు అప్పుల కోసం ప్రయత్నిన్నారు. స్మార్ట్ ఫోన్లో పలు రకాల ప్రైవేట్ లోన్ యాప్స్లో అప్పులు తీసుకొని మరీ గేమ్ ఆడుతున్నారు. తరువాత అవి తీర్చలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంకొంత మంది గేమ్లో డబ్బులు పోవడంతో బండ్లు, ఫోన్లు తాకట్టు పెడుతుండగా, మరికొంత మంది అమ్ముకుంటున్నారు. అనేక మంది బయట వడ్డీలకు తీసుకుంటున్నారు. తిరిగి ఇవి కట్టలేక ఆస్తులు తాకట్టు పెట్టడంతో పాటు గత్యంతరం లేక అమ్ముకుంటున్నారు. దాంతో కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి.