నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర వ్యాప్తంగా ఇతర పార్టీల్లోని నేతలను పిలిచి మరీ కండువాలు కప్పుతున్న కాంగ్రెస్ పార్టీ పెద్దలకు మునుగోడులో పరిస్థితి భిన్నంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన చలమల్ల కృష్ణారెడ్డి ఆ పార్టీని వీడి మాతృసంస్థ కాంగ్రెస్ కండువా కప్పుకోవడం వివాదాస్పదంగా మారింది. చల్లమల కృష్ణారెడ్డి చేరికను స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తుండడం చర్చనీ యాంశంగా మారింది. ఆయన చేరిక చెల్లదని డీసీసీ అధ్యక్షులు ప్రకటనలు చేస్తుంటే తాను కాంగ్రెస్లోనే ఉన్నానంటూ చలమల్ల స్పష్టం చేస్తుండడంతో మునుగోడు కాంగ్రెస్ రాజకీయం రసవత్తంగా మారింది.
మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో చలమల్ల కృష్ణారెడ్డి చేరిక రచ్చకు దారి తీసింది. సంస్థాన్ నారాయణపురం మండలం మల్లారెడ్డిగూడేనికి చెందిన కాంట్రాక్టర్ చల్లమళ్ల కృష్ణారెడ్డి ఆది నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో రాజగోపాల్రెడ్డి తన పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో అప్పటీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సహకారంతో చలమల్ల కృష్ణారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రచారంలోకి వచ్చారు. చివరకు పాల్వాయి స్రవంతిని కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించినా రేవంత్రెడ్డ ఆదేశాల మేరకు చలమల్ల కృష్ణారెడ్డి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేశారు. ఆ తర్వాత నుంచి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చలమల్ల కృష్ణారెడ్డి తనకే కాంగ్రెస్ టికెట్టు అని బలంగా విశ్వసించారు.
తీరా నామినేషన్లకు కొద్దిరోజుల ముందు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తిరిగి బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి రావడం, ఆ వెంటనే అభ్యర్థిగా ప్రకటించడంతో చలమల్ల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. దాంతో చివరి నిమిషంలో చలమల్ల కృష్ణారెడ్డి బీజేపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఇక తాజా పరిస్థితుల్లో భాగంగా చలమల్ల కృష్ణారెడ్డి బీజేపీని వీడాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్లో తనకున్న నెట్వర్క్తో పాటు సీఎం రేవంత్రెడ్డి గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో హస్తం పార్టీలో చేరారు. ఈ నెల 16న గాంధీభవన్లో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీప్దాస్మున్షీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. ఇది తెలిసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వెంటనే చలమల్ల చేరికపై అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. పార్టీకి ద్రోహం చేసి వెళ్లిన చలమల్ల కృష్ణారెడ్డిని ఎలా చేర్చుకుంటారంటూ పార్టీ పెద్దలను ప్రశ్నించారు.
అంతటితో ఆగకుండా నల్లగొండ, యాదాద్రి జిల్లాల డీసీసీ అధ్యక్షులతోనూ ప్రకటనలు చేయించారు. అదే రోజు సాయంత్రం నల్లగొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడు శంకర్నాయక్ స్పందిస్తూ చలమల్ల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరలేదంటూ.. చేరాలనే ఆసక్తిని మాత్రమే తెలిపారంటూ పేర్కొన్నారు. ఈ నెల 18న యాదాద్రి డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి తీవ్రంగా స్పందిస్తూ చలమల్ల కృష్ణారెడ్డి చేరిక చెల్లదని స్పష్టం చేశారు. ‘ఆయన చేరిక చెల్లదు.. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పట్టించుకోవద్దు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే సమయంలో తన స్వలాభం కోసం పార్టీని వీడి బీజేపీలో చేరాడు. తిరిగి ఏ ముఖం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకొంటాడు.
ఆయన బ్లాక్ దందాను కొనసాగించేందుకు, అక్రమ సంపాదనను కాపాడుకునేందుకే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాడు’ అని ప్రకటన చేశారు. చలమల్ల కృష్ణారెడ్డి కూడా దీనిపై సీరియస్గా రియాక్ట్ అయ్యారు. తాను కాంగ్రెస్లోనే కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ పెద్దలు పిలిస్తేనే గాంధీభవన్లో జాయిన్ అయ్యా.. నాకు కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం.. పార్టీ పెద్దలనే కాదూ, రాజగోపాల్రెడ్డిని కూడా నేను ఏమీ అనలేదు. ఎంపీ టికెట్ ఇస్తే పోటీకి సిద్ధం.. త్వరలోనే అంతా సెట్ అవుతుందని భావిస్తున్నా.
నా చేరిక చెల్లుతుందా.. లేదా అన్నది గాంధీభవన్ పెద్దలు చూసుకుంటారు’ అంటూ ఘాటుగానే స్పందించారు. చలమల్ల ఆది నుంచి కాంగ్రెస్లో పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి వర్గంగా ముద్ర వేసుకున్నారు. ఆయన అనుమతితోనే తిరిగి కాంగ్రెస్లో చేరినట్లుగా చలమల్ల వర్గీయులు పేర్కొంటున్నారు. దాంతో ఓ వైపు సీఎం రేవంత్రెడ్డి గ్రీన్సిగ్న ల్ ఇస్తే, మరోవైపు రాజగోపాల్రెడ్డి అడ్డుకుంటుండ డం ఆసక్తికరంగా మారింది. ఈ వ్యవహారం రాను న్న కాలంలో రాష్ట్ర కాంగ్రెస్లో మరిన్ని ఆసక్తికర పరిణామాలకు దారితీయొచ్చన్న చర్చ మొదలైంది.