కేంద్ర ప్రభుత్వ విధానాలతో దేశానికి తీవ్ర నష్టం
వాటిని ఎండగట్టినందుకే సీఎం కేసీఆర్పై విమర్శలు
ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్
మోత్కూరు, మే 17: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సంపదనంతా ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నదని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. మంగళవారం మోత్కూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గుజరాత్ వ్యాపార వేత్తలైన గౌతమ్ ఆదానీ, అంబానీ గ్రూఫు సంస్థలకు దేశంలోని సిమెంట్, పోర్టులు, ఎయిర్ పోర్టులు, రోడ్లు, రైళ్లు, బొగ్గు వంటి సంపదను కట్టాబెట్టారన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని సీఎం కేసీఆర్ ఎండగట్టడాన్ని ఆపార్టీ నేతలు జీర్ణించుకోలేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని సంక్షేమ పథకాలు, అభివృద్ధి తెలంగాణలో జరుగుతుండడం చూసి అద్భుతంగా ఉన్నాయని పొగిడిన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు ఇప్పుడు విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ఐటీ రంగంలో హైదరాబాద్ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 24 గంటల విద్యుత్, రైతు బీమా, రైత బంధు వంటి సంక్షేమ పథకాలు ఇతర రాష్ర్టాల ప్రజల కూడా కోరుకుంటున్నారన్నారు. రాష్ట్ర ప్రజలు అభివృద్ధి వెంటే ఉండడంతో వారిని మభ్య పెట్టేందుకు ఒక్క చాన్స్ అంటూ బీజేపీ నాయకులు వేడుకుంటున్నారని విమర్శించారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్షా, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లాంటి వారు రాష్ట్రంలో పర్యటించడం వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ప్రజాశ్రేయస్సు పట్ల బీజేపీకి ఆసక్తి లేదని, అధికారం, పదవుల కోసం ఆ పార్టీ ఎంతకైనా తెగిస్తుందని పేర్కొన్నారు. ఆయన వెంట టీఆర్ఎస్ జిల్లా నాయకుడు తీపిరెడ్డి మేఘారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిప్పలపల్లి మహేందర్నాథ్, మర్రి అనిల్ కుమార్ ఉన్నారు.