కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నది. రోజుకో నిబంధన తీసుకొచ్చి పనులు జరుగకుండా ఇబ్బంది పెడుతున్నది. గతంలో 40 నుంచి 50 పనులు చేసే వెసులుబాటు ఉండగా కొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చి 20 పనులు మాత్రమే చేసేలా కట్టడి చేసింది. పనిచేసిన కూలీలకు సైతం సకాలంలో డబ్బులు చెల్లించడం లేదు. గతంలో 15 రోజులకోసారి డబ్బులు ఇవ్వగా ప్రస్తుతం రెండు నెలలు దాటినా రావడం లేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 9,940 మంది ఉపాధి హామీ కూలీలకు రూ. 2.29 కోట్లు రావాల్సి ఉన్నది. పలు కారణాలు చెబుతూ బీజేపీ సర్కారు నిధుల విడుదలలో జాప్యం చేస్తున్నది. దాంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మా కుటుంబం ఎట్ల గడువాలెరోజూ కూలి పని చేస్తేనే మా కుటుంబం గడుస్తుంది. ఎనిమిది వారాలు ఉపాధి పనులకు వెళ్లిన. ఇప్పటివరకు ఒక్కపైసా ఇయ్యలె. డబ్బులు లేక శానా ఇబ్బంది పడుతున్నాం. కూలి డబ్బులు రాకపోవడంతో ఉపాధి పనులు బంద్ జేసిన. వ్యవసాయ పనులకు వెళ్తున్నా. ఏరోజు పైసలు ఆరోజు ఇస్తేనే మాలాంటి కుటుంబాలు బతుకుతాయి. రెండు నెలలైనా ఇయ్యకపోవడం బాగలేదు.
– ముక్కెర కిష్టమ్మ, ఉపాధి కూలీ, జాల, రాజాపేట మండలం
ఉపాధి హామీ కూలీలపై కేంద్ర ప్రభుత్వం కక్షగట్టింది. ఏవేవో కారణాలు చెబుతూ
నిధుల విడుదలలో జాప్యం చేస్తున్నది. కూలీల వేతనాలు చెల్లించకుండా ఆలస్యం
చేస్తున్నది. ఫలితంగా ఉమ్మడి జిల్లాలో ఉపాధి హామీ కూలీలకు డబ్బులు ఇవ్వడం లేదు.
రెండు నెలలుగా ఇదే తంతు కొనసాగుతున్నా కేంద్రంలోని బీజేపీ సర్కారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది. ఈ క్రమంలో కూలి డబ్బులు రాకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే కేంద్ర సర్కారు రోజుకో కొత్త నిబంధన తీసుకొచ్చి ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్న విషయం తెలిసిందే.
రెండు నెలలుగా చెల్లింపులు బంద్
గ్రామాల్లో ఉపాధి హామీ పథకంలో వివిధ రకాల పనులు చేపడుతుంటారు. ఈ పనులు రైతులు, స్థానికులకు ఎంతగానో ఉపయోగపడుతుంటాయి. ఏటా గ్రామ సభలు నిర్వహించి అవసరమయ్యే పనులు, దాని ఖర్చును ముందుగానే అంచనా వేస్తారు. ఆయా గ్రామాల్లోని ఉపాధి హామీ కూలీలు పనులు చేస్తుండగా.. రోజుకు రూ.150 వరకు కూలి చెల్లిస్తారు. ఇందుకు అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు విడుదలవుతాయి. 15 రోజులకోసారి కూలీల అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి. అయితే.. రెండు నెలలుగా కేంద్రం నిధులు విడుదల చేయకుండా జాప్యం చేస్తున్నది. చెల్లింపులు చేయకుండా పూర్తిగా ఆపేసింది. దాంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు రూ.2.29కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఇందులో యాదాద్రి జిల్లాకు రూ.12.24లక్షలు, నల్లగొండకు రూ.88లక్షలు, సూర్యాపేట జిల్లాకు 1.29కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 9,940 మంది కూలీలు పనిచేస్తున్నారు. ఇందులో యాదాద్రి భువనగిరిలో 3,700మంది, నల్లగొండలో 3,200, సూర్యాపేట జిల్లాలో 3,040మంది ఉన్నారు.
కేంద్రం కుంటి సాకులు..
పని చేసిన కూలీలకు 15రోజులకోసారి వేతనాలు వారి అకౌంట్లో జమ చేయాలని చట్టం చెబుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నది. ఏవేవో కారణాలు చెబుతూ కాలం వెల్లదీస్తున్నది. కొత్త సాఫ్ట్వేర్లో తెలంగాణ చేరాలని కేంద్రం ఒత్తిడి తీసుకురాగా.. రాష్ట్ర ప్రభుత్వం అందులోనూ చేరింది. అయినప్పటికీ కొన్ని చోట్ల ఒకే అకౌంట్తో పాత, కొత్త గ్రామపంచాయతీల్లో రెండు జాబ్ కార్డులు ఉన్నాయని, మళ్లీ అకౌంట్లు ఓపెన్ చేయాలని అడ్డుపుల్ల వేసింది. ఇప్పటికే ఖాతాల ఓపెన్ తుది దశకు చేరింది. ఇలా ఏవేవో సాకులు చెబుతూ డబ్బులు విడుదల చేయడంలేదు.
తీవ్ర ఇబ్బందుల్లో కూలీలు
ఉపాధి హామీలో పని చేసేదంతా గ్రామీణ నిరుపేదలే. వారికి రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. అలాంటిది పని చేసి రెండు నెలలైనా పైసలు రావడంలేదు. వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబ పోషణ భారంగా మారుతున్నదని.. బియ్యం, ఉప్పు, పప్పు కొనేందుకూ కష్టమవుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది ఇతర పనులు చూసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటికే కూలీల ఉపాధికి గండి ఉపాధి హామీ చట్టంలో కేంద్ర ప్రభుత్వం రోజుకో కొర్రీ తీసుకొస్తూ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నది. గతంలో గ్రామాల్లో 40 నుంచి 50 పనులు చేసే వెసులుబాటుకు కేంద్ర సర్కారు మంగళం పాడింది. దీనికి అనుగుణంగా కొత్త సాఫ్ట్వేర్ను రూపొందించింది. ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఒక్కో గ్రామంలో కేవలం 20 పనులు మాత్రమే చేసేలా కట్టడి చేసింది. ఈ పనులకే బిల్లులు మంజూరవుతున్నాయి. అదనంగా చేయాలంటే సాఫ్ట్వేర్ తీసుకోదు. 20 పనుల్లో నాలుగు ముగిశాకే.. మరో నాలుగింటికి అవకాశం ఉంది. అనివార్య కారణాలతో మధ్యలో ఏదైనా పని ఆగిపోతే ఇబ్బందే. అది పూర్తయ్యా దాకా 20 పనుల లెక్కలోనే ఉంటుంది. దీని ప్రభావం గ్రామాల్లోని ఇతర పనులపై పడుతున్నది. ఈ నిబంధనతో ఉపాధి హామీ పనులు కూడా తగ్గిపోతున్నాయి. కూలీల ఉపాధికి గండి పడుతున్నది. చేసిన పనులకు కూడా పైసలు ఇవ్వకపోవడంతో కూలీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రెండు నెలలుగా కూలి డబ్బులు రావడం లేదు
నిత్యం ఉపాధి హామీ పనికి పోయినా డబ్బులు సరిగా రావడంలేదు. ఆగస్టు నుంచి కూలి డబ్బులు ఇవ్వడం లేదు. పోస్టాఫీసులో జమ కాలేదు. రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు మావి. రెండు నెలలుగా చేసిన పనికి కూలి చెల్లిచకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం కూలీలకు సకాలంలో నగదు చెల్లింపులు చేపట్టాలి.
– జిట్ట నాగమ్మ, ఉపాధిహామీ కూలీ, వడాయిగూడెం
ఏ వారం పైసలు ఆ వారమే ఇవ్వాలి
కూలి డబ్బులతోనే పూట గడిచే మాకు చేసిన పనికి రెండు నెలలుగా పైసలియ్యకపోతే ఎట్టా? ఊరికొచ్చిన ఆఫీసర్కు కూలి డబ్బుల కోసం ఎన్నో సార్లు మొర పెట్టుకున్నా వినిపించుకోవడం లేదు. గతంలో వారానికోసారి పైసలు ఇచ్చేది. ఇప్పుడు ఎనిమిది వారాలు గడిచింది. రేపు, మాపు అంటున్నారు. ఉపాధి హామీ పైసలు వస్తయని ఇతరుల వద్ద అప్పు చేసి ఖర్చులు వెళ్లదీసుకున్నం. ఇంకా ఇవ్వడం లేదు. ఏ వారం పైసలు ఆ వారం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి.
– రాంపాక లింగయ్య, రాగిబావి, మోత్కూరు మండలం