ఫిబ్రవరి 8 తర్వాత ఏ క్షణమైనా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావచ్చన్న సంకేతాల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కసరత్తును మరింత ముమ్మరం చేశాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూనే లోక్సభ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నట్లు స్పష్టం అవుతున్నది. ఉమ్మడి జిల్లా పరిధిలోని రెండు లోక్సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలను రచిస్తున్నాయి. రానున్న కాలంలో పట్టిష్టమైన కార్యాచరణతో ముందుకు సాగేందుకు సన్నద్ధమవుతున్నాయి.
గతంలో పోలిస్తే లోక్సభ ఎన్నికలు అడ్వాన్స్గా రావచ్చని వార్తలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ఓటర్ల సవరణ కార్యక్రమంలో భాగంగా వచ్చే నెల 8న కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో తుది జాబితా వెలువడిన అనంతరం ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ రావచ్చని సమాచారం. దాంతో అన్ని రాజకీయ పార్టీలు తమ కార్యాచరణను వేగవంతం చేశాయి. ఇందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే భువనగిరి, నల్లగొండ లోక్సభ నియోజకవర్గాల వారీగా ప్రత్యేకంగా సమీక్ష సమావేశాలు కూడా పూర్తి చేసింది.
నియోజకవర్గ పరిధిలోని కీలకమైన ప్రజాప్రతినిధులు, నేతలంతా ఇందులో భాగస్వాములయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు పార్టీ శ్రేణులంతా ఎన్నికలకు సమాయత్తం అయ్యేలా దిశానిర్దేశం చేశారు. ఇక త్వరలోనే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కూడా సమావేశాల నిర్వహణకు సిద్ధమవుతున్నారు. ఇదే విధంగా క్షేత్రస్థాయి వరకు పార్టీ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో ఎన్నికలకు రెడీ చేసేలా చర్యలు చేపడుతున్నారు. మరోవైపు ఎంపీ అభ్యర్థుల ఎంపికపైనా పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటికే కసరత్తు చేస్తున్నట్లు చర్చ సాగుతున్నది. అందరికీ ఆమోదయోగ్యంగా బలమైన అభ్యర్థులను త్వరలోనే ఖరారు చేస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఫలితాల ఊపుతో కాంగ్రెస్ పార్టీ కూడా లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించింది. ఇప్పటికే భువనగిరికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, నల్లగొండకు మరో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిని ఇన్చార్జీలుగా ప్రకటించిన విషయం తెలిసిందే. వీరి సారథ్యంలోనే పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. అందులో భాగంగా గురువారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో బూత్ లెవల్ కార్యకర్తల సమ్మేళనానికి ఏర్పాట్లు చేసింది. దీనికి బూత్ కమిటీల నుంచి మొదలుకుని అన్ని స్థాయిల్లోని ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలను ఆహ్వానించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.
అనంతరం దశలవారీగా ఎన్నికల వ్యూహ రచనతో ముందుకు సాగనున్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. కాగా భువనగిరి నుంచి చామల కిరణ్కుమార్రెడ్డికి లేదా కోమటిరెడ్డి కుటుంబంలో నుంచి ఒకరు అభ్యర్థిగా ఉండనున్నట్లు సమాచారం. నల్లగొండ నుంచి కుందూరు రఘువీర్రెడ్డి లేదా పటేల్ రమేశ్రెడ్డిలో ఒకరు అభ్యర్థిగా బరిలో ఉంటారన్న చర్చ సాగుతున్నది. బీజేపీ సైతం లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా తమ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే రెండు నియోజకవర్గాల పరిధిలో కేంద్ర మంత్రుల పర్యటనలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర పార్టీ నేతలు కూడా పార్టీ శ్రేణులతో భేటీ అవుతున్నారు.
ఇటీవలే మూడు జిల్లాలకు కొత్త అధ్యక్షులను ప్రకటించారు. ఇక అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఆధారంగా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫిబ్రవరి రెండో వారంలో జిల్లా పరిధిలో ప్రధాని మోదీతో బహిరంగసభకు కూడా సన్నాహకాలు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. వీటన్నింటి ఆధారంగా ఉమ్మడి జిల్లా పరిధిలో గెలిచే అవకాశాలు లేకపోయినా బీజేపీ ఓటింగ్ శాతం పెంచుకుని ఉనికి చాటాలన్న లక్ష్యంతో కనిపిస్తున్నది. ఇక జిల్లాలో ఒకప్పుడు గెలుపోటముల్లో కీలకమైన సీపీఎం, సీపీఐ ఈ సారి పోటీ చేసే అవకాశాలు కనిపించడం లేదు. ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్కు మద్దతు ప్రకటించనున్నట్లు సమాచారం.