సూర్యాపేట, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : కస్టం మిల్లింగ్ రైస్ తనిఖీల్లో భాగంగా మరో ఫార్ బాయిల్డ్ రైస్ మిల్లులో కోట్ల రూపాయల అక్రమాలు వెలుగు చూశాయి. నాగారం మండలం ఈటూరు వద్ద గల రఘురామ ఫార్బాయిల్డ్ రైస్మిల్లులో అధికారులు తనిఖీలు చేసి ధాన్యం తక్కువ ఉన్నట్లు నిర్ధారించారు. ఈ మేరకు సివిల్ సప్లయ్ శాఖ అధికారుల ఫిర్యాదుల మేరకు ఇమ్మడి సోమనర్సయ్య, సోమయ్య, అంజయ్యపై కేసులు నమోదు చేశారు.
ఇప్పటికే తిరుమలగిరి మండల కేంద్రంలోని సంతోష్ రైస్ మిల్లులో రూ.90 కోట్లు, కోదాడ శ్రీవెంకటేశ్వర్ రైస్ ఇండస్ట్రీస్లో రూ.64 కోట్ల ధాన్యాన్ని పక్కదారి పట్టించడంతో ఆయా యాజమాన్యాలపై కేసులు నమోదు కాగా, తాజాగా రఘురామ మిల్లులో రూ.94 కోట్లు కలిపి రూ.248 కోట్ల ధాన్యం పక్కదారి పట్టిందంటే అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో అర్థం చేసుకోవచ్చు.
గత రెండు సీజన్లలో కోట్లాది రూపాయల ధాన్యం తీసుకొని ఒక్క కిలో బియ్యం కూడా పెట్టని తొమ్మిది మిల్లుల నుంచి ప్రభుత్వానికి అందాల్సిన కస్టం మిల్లింగ్ రైస్ సుమారు రూ.520 కోట్ల విలువ చేసే 4,500 ఏసీకేలు అందాల్సి ఉంది. వీటిలో నేరేడుచర్ల, దిర్శించర్ల, కోదాడల్లో ఒక్కో మిల్లు ఉండగా తిరుమలగిరిలో ఆరు మిల్లుల నుంచి 289 కోట్ల విలువ చేసే బియ్యం అందాల్సి ఉంది. విచిత్రమేంటంటే దాదాపు 30 కోట్ల విలువ చేసే బియ్యం ఇవ్వాల్సిన కొన్ని మిల్లుల అడ్రస్ ఎక్కడ ఉందో ఎవరికీ అంతుపట్టడం లేదు.