జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రులు కడుపు కోతలకు తెగబడుతున్నాయి. అడ్డగోలు దోపిడీతో మళ్లీ సిజేరియన్లు చేసేస్తున్నాయి. మాఫియాగా మారి డబ్బులకు కక్కుర్తి పడి నార్మల్ డెలివరీలు చేయకుండా ఆపరేషన్లకే మొగ్గు చూపుతున్నాయి. అవసరం లేకున్నా రోగులను భయపెట్టి అందినకాడికి దోచుకుంటున్నాయి. కొన్ని చోట్ల సర్కారు ఆస్పత్రి డాక్టర్లు, స్టాఫ్తో కుమ్మక్కై దందా చేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాంతో సామాన్య ప్రజల ఆరోగ్యంతోపాటు డబ్బులను కూడా నష్టపోతున్నారు.
– యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ)
జిల్లాలో 225 ప్రైవేట్ ఆస్పత్రులు ఉన్నాయి. దాదాపు అన్నింటిలోనూ సిజేరియన్లు చేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఎప్పుడో ఒకసారి నార్మల్ డెలివరీ చేస్తూ.. మిగతా రోజుల్లో సీజేరియన్లు చేస్తున్నారు. మంచి ముహూర్తాల కోసం ఎవరో ఒకరు మాత్రమే సిజేరియన్ చేయించుకుంటుండగా, మిగతా అందరికీ పైసల కోసం అడ్డగోలుగా కోసేస్తున్నారు. జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఈ ఏడాది మార్చి వరకు 124 సాధారణ ప్రసవాలు జరుగగా, 421 సిజేరియర్లు చేశారు. ప్రతి పది ప్రసవాల్లో ఏడుగిరికి సిజేరియన్ చేస్తున్నారు. ఇక 2023 సంవత్సరంలో 68శాతం సిజేరియన్లు అయ్యాయి. 8,734 కాన్పులకు 1,100 మాత్రమే సాధారణ ప్రసవాలు జరిగాయి. సాధారణ ప్రసవాలే చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నా ఆస్పత్రుల నిర్వాహకులు మాత్రం పట్టించుకోవడంలేదు.
ఇక ప్రభుత్వ హాస్పిటల్లో మాత్రం సాధారణ ప్రసవాలే జరుగుతున్నాయి. జిల్లాలో మార్చి వరకు గణాంకాలు పరిశీలిస్తే.. 534 సాధారణ ప్రసవాలు చేశారు. ఈ ఏడాది మూడు నెలల్లో 454 సిజేరియన్లు జరిగాయి. అంటే ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిజేరియన్ కంటే నార్మల్ డెలివరీలే ఎక్కువగా జరుగుతున్నాయి. సాధారణ ప్రసవాలే జరుగాలని గత బీఆర్ఎస్ సర్కారు కఠిన ఆదేశాలు జారీ చేసింది. అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు సైతం ఎప్పటికప్పుడు చర్యలకు ఉపక్రమించారు. ప్రజల్లో అవగాహన క్యాంప్లు ఏర్పాటు చేశారు. ఆస్పత్రుల్లో అన్ని రకాల వసతులు కల్పించారు. 24గంటలూ వైద్యులను అందుబాటులో ఉంచారు. నిరంతరం రోగులను పర్యవేక్షించారు. సాధారణ ప్రసవాల బెంచ్మార్క్ దాటిన డాక్టర్లు, స్టాఫ్కు కూడా ప్రోత్సాహకాలు ప్రకటించారు. కానీ ఇటీవల మళ్లీ సిజేరియన్లు సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది.
ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిజేరియన్లు చేస్తుండటంతో తల్లి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. సీజేరియన్ అంటే తప్పకుండా కడుపు కోయక తప్పదు. అది మాని, సాధారణ స్థితికి రావడానికి కనీసం నెల నుంచి రెండు నెలల సమయం పడుతుంది. ట్యాబ్లెట్స్, ఇంజెన్లు వాడాలి. దీని ఎఫెక్ట్ పుట్టిన పాపపై కూడా ఉంటుంది. తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. రెండోసారి కాన్పు కూడా ఆపరేషన్ చేస్తే తల్లికి మరింత ఇబ్బంది తప్పదు. అంతేకాకుండా రూ. వేలకు వేలు డబ్బులు ముట్టజెప్పాల్సిందే. సాధారణ ప్రసవాలతో పోలిస్తే సిజేరియన్లకు డబుల్ వసూలు చేస్తారు. సాధారణ ప్రసవానికి రూ. 30వేలు ఉంటే.. సిజేరియన్కు రూ. 70వేల దాకా దండుకుంటున్నారు
జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో కొద్ది మేర సిజేరియన్లు ఉన్నాయి. వీటిపై దృష్టి పెట్టాం. అలాంటి ఆస్పత్రులపై త్వరలోనే స్పెషల్ డ్రైవ్ చేపడుతాం. విచారణలో తప్పని తేలితే చర్యలు తీసుకుంటాం. గతంలో వరుసగా డ్రైవ్ చేపట్టి, షోకాజ్ నోటీసులు ఇచ్చాం. ఆస్పత్రులను సీజ్ చేశాం. అవసరమైతేనే సిజేరియన్లు చేయాలి. నిబంధనలు కచ్చితగా పాటించాల్సిందే.
-పాపారావు, డీఎంహెచ్ఓ
గతంలో అధిక శాతం నార్మల్ డెలివరీస్ మాత్రమే జరిగేవి. కానీ రానురాను పరిస్థితి మారుతూ వస్తున్నది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. ప్రైవేట్ ఆస్పత్రుల సంఖ్య పెరిగిపోయాయి. డబ్బుల అత్యాశతో ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు వికృత బుద్ధిని ప్రదర్శిస్తున్నారు. డెలివరీ సమయంలో ఆస్పత్రికి వస్తే రోగులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. బ్లడ్ తక్కువగా ఉందని, పాప సరిగా లేదని, అడ్డంగా తిరిగారని, సీరియస్గా ఉందని చెప్పి భయపెడుతున్నారు. నార్మల్కు చాన్స్ లేదని, అలా చేస్తే తల్లీబిడ్డ ఇద్దరి ప్రాణానికి ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. సీజేరియన్ అయితే ప్రమాదం తప్పి బయట పడొచ్చని సలహాలు ఇస్తున్నారు. దాంతో కుటుంబ సభ్యులు సైతం ఆపరేషన్లకు ఓకే చెబుతున్నారు. కాగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో నార్మల్ డెలివరీస్ అయినప్పుడు ప్రైవేట్లో ఎందుకు అవ్వవని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిజేరియన్లు జరుగడానికి డాక్టర్లు, స్టాఫ్, ఆశ కార్యకర్తలే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా కేంద్రంతోపాటు మండల కేంద్రాల్లో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల చుట్టూ ప్రైవేట్ హాస్పిటల్స్ వెలిశాయి. వీటిల్లో అధిక శాతం ఆస్పత్రుల్లో ఉండే డాక్టర్లే పనిచేస్తున్నారు. కొంత మంది ఏకంగా హాస్పిటల్స్ నడిపిస్తున్నారు. పీహెచ్సీల్లో పనిచేస్తే తమకేం లాభమని, రెఫర్ చేస్తే ఎంతో కొంత మిగులుతుందనే భావనలో ఉన్నారు.
దాంతో పీహెచ్సీలకు వచ్చిన రోగులకు ఏదో ఒక సాకు చెప్పి.. పక్కనే ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్కు రెఫర్ చేస్తున్నారు. ఇలా రెఫర్ చేసినందుకు కమీషన్ తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆశ కార్యకర్తలు సైతం ప్రైవేట్ ఆస్పత్రులతో ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఒక్కో రోగిని రెఫర్ చేసినందుకు రూ. 2వేల నుంచి రూ. 4వేల వరకు కమీషన్ తీసుకుంటున్నారు.