‘కృష్ణా జలాల్లో హక్కుల కోసం నల్లగొండ జిల్లా ప్రజలు ఎప్పటికప్పుడు పోరాటానికి సిద్ధంగా ఉండాలి. యాక్షన్ కార్యక్రమాలకు ఎప్పుడు పిలుపునిచ్చినా.. ప్రభుత్వ దమన నీతిని ఎండగట్టాలని కోరినా.. మీరు సిద్ధంగా ఉండాలి. కాంగ్రెస్ దుర్మార్గాలపై కొట్లడుదాం.. పోరాడుదాం.. మన హక్కుల కోసం నిలబడుదాం.’ అంటూ సాగిన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రసంగం ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపింది. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ప్రతికూల ఫలితాల నుంచి క్యాడర్ తేరుకుని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరుకు సమాయత్తం చేసేలా చలో నల్లగొండ సభ సాగింది.
అధినేత కేసీఆర్ నోట ఉద్యమ కాలం నాటి పంచ్ డైలాగ్లు బుల్లెట్లలా దూసుకు వస్తుంటే పార్టీ నేతలు, కార్యకర్తలు కేరింతలు కొట్టారు. రానున్న కాలంలో సర్కార్పై కొట్లాడుదామా.. పోరాటం చేద్దామా? అని ప్రశ్నిస్తే చేద్దామంటూ బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజల నుంచి మద్దతు లభించింది. డబుల్ స్పీడ్తో అధికారంలోకి వస్తాం.. అప్పుడు అన్నీ చేసుకుందామంటూ కేసీఆర్ చెప్పిన మాటలు తమ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందన్న అభిప్రాయాన్ని పార్టీ శ్రేణులు వ్యక్త పరిచాయి.
కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతపై గర్జిస్తూ మంగళవారం జరిగిన చలో నల్లగొండ బహిరంగ సభ బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా వచ్చిన ప్రతికూల ఫలితాలను కేడర్లో కొంత నిస్తేజాన్ని కలిగించింది. మరోవైపు కొత్తగా గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, వాళ్ల అనుచరులు బీఆర్ఎస్ పార్టీ వాళ్లకు ఇబ్బందులు సృష్టించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అదిరింపులు బెదిరింపులతో పార్టీ శ్రేణులను లొంగదీసుకుని బలహీనపర్చాలన్న కుయుక్తులకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే వేధింపులకు గురిచేస్తున్నారు.
ఇలాంటి తరుణంలో కృష్ణా నదీ జలాల్లో హక్కుల కోసం కేసీఆర్ పోరుబాటకు పిలుపునివ్వడం, అందుకు నల్లగొండను వేదికగా చేసుకోవడంతో ఉమ్మడి జిల్లా పార్టీకి కలిసొచ్చే అంశంగా మారింది. దీంతో ఈ బహిరంగ సభ ద్వారా ప్రజలతోపాటు పార్టీ క్యాడర్ యావత్తు కదలివచ్చేలా ప్రణాళికతో వ్యవహరించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలంతా రంగంలోకి దిగి సభకు పెద్ద సంఖ్యలో తరలివచ్చేలా చర్యలు చేపట్టారు. పార్టీ శ్రేణులతో ముందుగా సన్నాహక సమావేశాలు నిర్వహించి సమయాత్తం చేయడంతో సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనుకున్న దాని కంటే ఎక్కువగా జనం, పార్టీ శ్రేణులు తరలిరావడంతో నాయకత్వంలోనూ మంచి ఊపు కనిపించింది. తరలివచ్చిన వారిలోనూ భారీ ఎత్తున యువత ఉండడం, వారు చేసిన సందడితో సభ మరింత ఉత్సాహంగా సాగింది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన పార్టీలోని అన్ని స్థాయిల్లోని ప్రజాప్రతినిధులు, నేతలు, క్యాడర్ ఈ సభకు తరలివచ్చారు. క్రియాశీలక సభ్యులంతా సభలో ఉత్సాహంగా పాల్గొన్నారు. చాలా వరకు తమ సొంత వాహనాల్లో సభకు చేరుకున్నారు. దీంతో సభ ఆద్యంతం ఉత్తేజభరితంగా సాగింది. వచ్చిన వారందరూ సభా ప్రాంగణానికి చేరుకుని అభిమాన నేత కేసీఆర్ రాక కోసం ఎదురుచూశారు.
నెత్తిన ఎండ దంచుతున్నా వేచి చూశారు. కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలిక్యాప్టర్ కనిపించగానే అందరూ ఒక్కసారిగా లేచి అభివాదం చేస్తూ తమ అభిమానాన్ని చాటారు. కేసీఆర్ చేతికర్ర సహాయంతో సభా వేదిక మీదకు వస్తుంటే ఆయన్ను చూసేందుకు అమితాసక్తిని చూపించారు. సీఎం సీఎం అంటూ యువత చేసిన నినాదాలతో సభా ప్రాంగణం దద్దరిల్లింది. దీంతో నల్లగొండకు తరలివచ్చిన ప్రతి ఒక్కరిలో కేసీఆర్ సభ స్ఫూర్తి నింపిందనడంలో సందేహం లేదు.
ఇక కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను, సీఎం, ఇతర మంత్రులు చేస్తున్న అడ్డగోలు ఆరోపణలను కేసీఆర్ సుతిమెత్తగా తిప్పికొడుతూ చేసిన ప్రసంగం హైలెట్గా నిలిచింది. దీంతోపాటు ప్రజలు అధికారం ఇచ్చారు.. ఐదేండ్లు పాలన చేయుండ్రి.. మంచి పనులు చేయుండ్రి అని హితవు పలుకడం ఆలోచింపజేసింది. తన కట్టె కాలే వరకు తెలంగాణకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోను.. ఇది లేచిన తెలంగాణ.. టైగర్ తెలంగాణ వంటి మాటలు క్యాడర్లో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేశాయి.
కొట్లాడుదాం, నిద్ర కూడా పోనివ్వం.. గర్జిద్దాం, నిలదీద్దాం.. ఎక్కడికక్కడ నిలబెడదాం అని పిలుపునిచ్చారు. ‘అందరం కొట్లాడుదాం.. పోరాటం చేద్దామా.. అంటూ దిశానిర్దేశం చేసేలా ముగిసిన కేసీఆర్ ప్రసంగం అందరనీ ఆకట్టుకుంది. పార్టీ శ్రేణులన్నీ రానున్న కాలంలో ఏ పోరాటానికి పిలుపునిచ్చినా సిద్ధమేననేలా కేసీఆర్ సభ కొనసాగడం విశేషం. దీంతోపాటు వచ్చే పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికలకు సైతం పార్టీ క్యాడర్ సమాయత్తం అయ్యేలా కేసీఆర్ ప్రసంగం కొనసాగింది.