– పాత అలైన్మెంట్ ప్రకారమే నిర్ణయం తీసుకోవాలి
– అఖిలపక్ష నేతలు
కోదాడ, ఆగస్టు 24 : కోదాడ మీదుగా హైదరాబాద్.. అమరావతి.. చెన్నై ప్రతిపాదిత హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ కొనసాగాలి, తొలుత ప్రతిపాదన ప్రకారమే కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని.. ఎట్టి పరిస్థితిలోనూ చౌటుప్పల్- సూర్యాపేట- కోదాడ మీదుగా బుల్లెట్ ట్రైన్ వెళ్లాల్సిందేనని అఖిలపక్ష నేతలు స్పష్టం చేశారు. సోమవారం కోదాడ పబ్లిక్ క్లబ్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన సామూహిక సన్నాహక సమావేశంలో ఈ మేరకు వారు తమ నిర్ణయం వెలువరించారు. సమావేశం ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భావితరాల ప్రయోజనాల కోసం హైదరాబాద్ నుండి సూర్యాపేట కోదాడ మీదుగా రైల్వే లైన్ అవసరమన్నారు. 65వ జాతీయ రహదారిపై ట్రాఫిక్ రద్దీతో ప్రమాదాలు సంభవించి వందల మంది ప్రాణాలు కోల్పోయారని, ట్రైన్ సౌకర్యంతో ఈ ఇబ్బంది తొలగుతుందని, దీంతోపాటు పారిశ్రామికంగా వ్యాపార, వర్తక, వాణిజ్య, వైద్య రంగాలు అభివృద్ధి చెందేందుకు రైల్వే లైన్ ఉపకరిస్తుందన్నారు. దినదినం అభివృద్ధి చెందుతున్న కోదాడ నుండి రైలు రాకపోకలు అవసరమన్నారు. ఇక్కడి ప్రజల ఉన్నత భవిష్యత్ కోసం రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఇది కోదాడ ప్రాంత ప్రజల అభిప్రాయం తెలిపారు.
బుల్లెట్ ట్రైన్ సాధన కోసం కలిసి వస్తున్న రాజకీయ పార్టీలను, నాయకులకు, వ్యాపార, ఉద్యోగ, స్వచ్ఛంద సంస్థల బాధ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రజా చైతన్య వేదిక కన్వీనర్ రాయపూడి చిన్ని, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, బిజెపి, ఎమ్మార్పీఎస్ నాయకులు ములకలపల్లి రాములు, బెజవాడ వెంకటేశ్వర్లు, మేకల శ్రీనివాస్, వెంపటి వెంకటేశ్వరరావు, చింతలపాటి శ్రీనివాసరావు, కనగాల నారాయణ, ఎమ్మార్పీఎస్ నాయకుడు ఏపూరి రాజు మాట్లాడుతూ.. ట్రైన్ సాధనకు దశల వారి ఉద్యమాలు నిర్వహించేందుకు సన్నద్ధంగా ఉన్నామన్నారు. రాబోయే తరాలకు ఉపాధి పరిశ్రమలు, వ్యాపార రంగాల అభివృద్ధికి రైలు సౌకర్యం అవసరమన్నారు. ఐక్య ఉద్యమాలతోనే సాధ్యమని సమిష్టిగా కలిసి వస్తామని వారు పేర్కొన్నారు. ఈ సమావేశంలో నాయకులు సత్య బాబు, పిల్లుట్ల శ్రీనివాస్, కరీముల్లా, బాబా, ముత్యాలు, హుస్సేన్, రామ నరసయ్య, కోటయ్య, నరసింహారావు, ఉద్యోగ, ఉపాధ్యాయ, స్వచ్ఛంద సంస్థలు, కుల సంఘాల బాధ్యులు, పట్టణ పౌరులు పాల్గొన్నారు.