నీలగిరి, ఏప్రిల్1 : నల్లగొండ పర్యటనలో భాగంగా సోమవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండలంలోని ముషంపల్లిలో పర్యటించి బోర్ల రాంరెడ్డిగా పేరొందిన బైరెడ్డి రాంరెడ్డి కుటుంబ సభ్యులను కలిశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రాంరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఫొటోలు దిగారు.
అనంతరం రాంరెడ్డి ఇంటి ఎదురుగా ఉన్న దొడ్డిలో ఇటీవల వేసిన బోరును పరిశీలించారు. ఇప్పటివరకు ఎన్ని బోర్లు వేశారని అడిగి తెలుసుకున్నారు. ఎన్ని ఫీట్లు వేశారు, నీళ్లు వచ్చాయా? అని రాంరెడ్డిని అడుగగా.. గత పదేండ్లలో ఒక్కబోరు వేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నాలుగైదు బోర్లు వేశానని, అందులో ఒక్కటి కూడా సక్సెస్ కాలేదని చెప్పారు. రాంరెడ్డిని ఓదార్చిన కేటీఆర్ ధైర్యంగా ఉండాలని, భవిష్యత్లో మంచిరోజులు వస్తాయని తెలిపారు.
నీలగిరి : కాలిగాయం కారణంగా ఇంటి వద్దే ఉండి విశ్రాంతి తీసుకుంటున్న జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డిని సోమవారం ఆయన నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. నల్లగొండలో మీటింగ్ అనంతరం నరేందర్రెడ్డి నివాసానికి వెళ్లి ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు.
ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఆయన వెంట మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, బీఆర్ఎస్ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, రమావత్ రవీంద్రకుమార్, గాదరి కిశోర్, నల్లబోతు భాస్కర్రావు, నోముల భగత్, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.