నకిరేకల్/చందంపేట(దేవరకొండ), మే 24 : ప్రజలు మరోసారి కాంగ్రెస్ మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని, కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి తులం బంగారం కాదు కదా.. తులం ఇనుము కూడా ఇవ్వరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. నకిరేకల్, దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల పట్టభద్రులు, బీఆర్ఎస్ శ్రేణులతో శుక్రవారం ఆయన మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డితో కలిసి నకిరేకల్, చౌటుప్పల్, దేవరకొండలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ ఆరు గ్యారెంటీల్లో ఒక హామీ అమలు చేసి, ఐదు చేసినట్లు కాంగ్రెస్ నాయకులు ప్రగల్భాలు పలుకుతున్నారని మండిపడ్డారు. ఫ్రీ బస్సుల్లో సీట్ల కోసం మహిళలు, టికెట్ల కోసం పురుషులు కొట్లాడుకుంటున్నారని చెప్పారు. డిసెంబర్ 9న రుణమాఫీ ఫైల్పై సంతకం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు రుణమాఫీ ఊసేలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 95శాతం రైతులు దొడ్డు వడ్లు పండిస్తారని, సన్న బియ్యానికే బోనస్ అని బోగస్ మాటలు చెబుతున్నారని విమర్శించారు.
నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఇప్పటిదాకా ఒక్క నోటిఫికేషన్ కూడా వేయలేదన్నారు. రేవంత్ రెడ్డి లాంటి ఇంద్రజాలికుడిని ఎక్కడా చూడలేదన్నారు. నోటిఫికేషన్లు లేవు, రాత పరీక్షలు లేవని, కానీ 30వేల ఉద్యోగాలు ఇచ్చామని దొంగ మాటలు చెబుతున్నారని విమర్శించారు. అరచేతిలో వైకుంఠం సినిమా చూపిస్తూ అన్నీ వర్గాల ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు ఎట్లుండే.. ఇప్పుడు ఎట్లుంటున్నదో కూడా ఆలోచించాలన్నారు.
కానీ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలిస్తే… ఆయన సొంతం కోసం ఫైరవీలు, దందాలు, బ్లాక్మెయిలింగ్స్ తప్పా ప్రజలకు ఒరిగేదేమి ఉండదన్నారు. అందుకే గోల్డ్ మెడిలిస్ట్ అయిన రాకేశ్రెడ్డి కావాలా? తెల్లారి లేస్తే బూతులు తిడుతూ సొంత దందాలు చేసుకునే తీన్మార్ మల్లన్న కావాలో పట్టభద్రులైన ఓటర్లంతా ఆలోచించాలని కోరారు. బీఆర్ఎస్ హయాంలో ప్రశాంత తెలంగాణను చూసిన మనం నేడు కాంగ్రెస్ హయాంలో హత్యా రాజకీయాలు చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేవరకొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ హయాంలో అనేక అభివృద్ధి పనులు జరిగాయని గుర్తు చేశారు. తొమ్మిదిన్నరేండ్ల నిజం, 6నెలల అబద్ధం మీ ముందున్నదని, పట్టభద్రులు ఆలోచన చేయాలని కోరారు.
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఎన్ని పార్టీలు మారిండో, సీఎం రేవంత్ రెడ్డి ఆయన ఎలా తిట్టుకున్నారో అందరికీ తెలుసన్నారు. ఎన్నో ఏండ్ల నుంచి ఉన్న ఫ్లోరైడ్ను తరిమికొట్టిన ఘనత బీఆర్ఎస్ సర్కారుదని, చౌటుప్పల్లో పైలాన్ పార్కును ఏర్పాటు చేసి మిషన్ భగీరథ ద్వారా కృష్ణా నీటిని అందించి మహానుభావుడు కేసీఆర్ అని గుర్తు చేశారు. వెయ్యేండ్లు గుర్తుండి పోయేలా యాదాద్రి దేవాలయాన్ని కేసీఆర్ నిర్మించించారని చెప్పారు. దండు మల్కాపురంలో ఐటీ పార్కు తీసుకొచ్చామని, చౌటుప్పల్ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ పెరుగడానికి ఇది ఎంతో దోహద పడిందని అన్నారు.
ఉమ్మడి జిల్లాలో 65 ఏండ్ల నుంచి మెడికల్ కాలేజీలు లేవని, మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో మూడు కాలేజీలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సమావేశాల్లో యాదాద్రి జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్, ఎన్నికల ఇన్చార్జి, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశ్, చెరుకు సుధాకర్, సందినేని వెంకటేశ్వర్రావు, కంకణాల వెంకట్రెడ్డి, వడ్త్య రమేశ్నాయక్, నేనావత్ కిషన్నాయక్, జర్పుల లోక్యనాయక్, నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, జడ్పీటీసీలు మాద ధనలక్ష్మీనగేశ్,
తరాల బలరాం, బొప్పని స్వర్ణలతాసురేశ్, బీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు నవీన్రావు, సైదిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ పల్లా ప్రవీణ్రెడ్డి, డిండి ఎంపీపీ సునీతాజనార్దన్రావు, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు టీఎన్ రెడ్డి, దస్రూనాయక్, వల్లపురెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, వెంకటేశ్వర్రావు, తిరుపతయ్య, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాశ్, నాయకులు శంకర్నాయక్, శ్రీనివాస్గౌడ్, రాజవర్ధన్రెడ్డి, సత్యనారాయణ, వేముల రాజు, కృష్ణ, పీఏసీఎస్ మాజీ చైర్మన్ బాలయ్య, ఆరెకంటి రాములు, వెంకటయ్య, కౌన్సిలర్లు, ఎంపీటీసీ, మాజీ సర్పంచులు, పాల్గొన్నారు.
కాంగ్రెస్ అనేక ఆశలు కల్పించి ప్రజలను మోసం చేసింది. అధికారంలోకి వచ్చి ఐదు నెలలవుతున్నా హామీలు అమలు చేయడం లేదు. నిరుద్యోగ యువతకు ఇచ్చిన జాబ్ క్యాలెండర్, 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, విద్యార్థులకు రూ.5 లక్షల కార్డులు, అమ్మాయిలకు స్కూటీ ఇవన్నీ ఏమయ్యాయి. కాంగ్రెస్ పాలనలో కరెంట్ లేక సెల్ఫోన్ లైట్లతో ఆపరేషన్లు చేస్తున్న దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. ఇది చేతగాని, పనిచేయలేని, మోసకారి ప్రభుత్వం అని ప్రజలకు అర్థమైంది. ఈ విషయాలపై ప్రభుత్వంపై ప్రశ్నించగలిగిన వారిని శాసనమండలికి పంపించాల్సిన బాధ్యత, పట్టభద్రుల ముందున్న కర్తవ్యం.
కేసీఆర్, కేటీఆర్ ఒక మంచి విద్యావంతుడు ఏనుగుల రాకేశ్రెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టారు. రైతు కుటుంబం నుంచి వచ్చి సొంతంగా ఎదిగి విదేశాల్లో స్థిరపడే అవకాశం ఉన్నా వదులుకొని తెలంగాణ ఉద్యమకాలంలో వచ్చిన వ్యక్తి రాకేశ్రెడ్డి. ప్రజల కోసం పనిచేసే వ్యక్తి, అన్ని విషయాలపై అవగాహన ఉన్న నాయకుడు. పట్టభద్రుల సమస్యలపై శాసనమండలిలో గళం విప్పుతాడు. అవసరమైతే వివిధ వర్గాల సమస్యల పరిష్కారం కోసం కొట్లాడే వ్యక్తి కావాలి.
అలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తి రాకేశ్రెడ్డి. ప్రశ్నించే గొంతు అని చెప్పుకుంటున్న తీన్మార్ మల్లన్న వల్ల కోమటిరెడ్డి బ్రదర్స్కు కొత్త భయం పట్టుకుంది. వీడు వస్తే నా మంత్రి పదవి పీకుతాడా అని వెంకట్రెడ్డి, లేకుంటే నా మంత్రి పదవి లాక్కుంటడా అని రాజ్గోపాల్రెడ్డి భయపడుతున్నరు. గతంలో ఇద్దరిని యూట్యూబ్ చానల్లో ఇరుకున పెట్టిన చర్రిత కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నది. అలాంటి దుర్మార్గుడి చేతికి ఆయుధమిస్తే సమాజానికి ప్రమాదం. అందుకే నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఏనుగుల రాకేశ్రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి.
-గుంటకండ్ల జగదీశ్రెడ్డి, మాజీ మంత్రి
కాంగ్రెస్ పార్టీ హామీలతో మోసం చేస్తున్నదని, మరోసారి మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. బీఆర్ఎస్ హయాంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయి. ప్రజలు సంతోషంగా జీవనం సాగించారు. నిరుద్యోగులు, విద్యార్థులతోపాటు ప్రజా సమస్యల పరిష్కారానికి, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి.
– రమావత్ రవీంద్రకుమార్, మాజీ ఎమ్మెల్యే
కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థుల గుణగణాలు, మంచి చెడులు చూసి పట్టభద్రులు నిర్ణయం తీసుకోవాలి. యూట్యూబ్ చానల్ అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ దందాలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు పట్టభద్రులే బుద్ధి చెప్తారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. సొంతంగా ఎదిగి బిట్స్ బిలానీలో గోల్డ్ మెడల్ సాధించి విదేశాల్లో ఉద్యోగం పొందినా సొంత ఊరికి ఏమైనా చేయాలనే సంకల్పంతో తెలంగాణకు వచ్చారు. పట్టభద్రుల, నిరుద్యోగుల సమస్యలు తెలిసిన వ్యక్తి రాకేశ్రెడ్డిని గెలిపించుకుంటే శాసన మండలిలో తన గళం విప్పి కాంగ్రెస్ ప్రభుత్వంపై కొట్లాడి హక్కులను సాధిస్తాడు.
– చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్ చేసిన కేసులో ఇరుక్కున్న వ్యక్తి. న్యాయం చేస్తామంటూ యూట్యూబ్ చానల్ స్టూడియోకు పిలిపించి బెదిరించి కోట్ల రూపాయలు దండుకున్న ఒక బ్లాక్ మెయిలర్. 56 క్రిమినల్ కేసుల్లో ఇరుక్కున్న తీన్మార్ మల్లను ఓడించేందుకు ఆ పార్టీలో ఉన్నవాళ్లే నిర్ణయం తీసుకున్నరు.
ఇటువంటి వ్యక్తులను ప్రొత్సహిస్తే రాజకీయాలు కలుషితమైతయని పట్టభద్రులు కూడా ఓడించాలని కంకణం కట్టుకున్నరు. గత నాలుగు పర్యాయాలు బీఆర్ఎస్ అభ్యర్థులే పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇప్పడు ఉన్నత విద్యావంతుడు, బిట్స్ బిలానీలో గోల్డ్ మెడల్ సాధించిన వ్యక్తి, విద్యా సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.
– బండ నరేందర్రెడ్డి, నల్లగొండ జడ్పీ చైర్మన్
420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 6 నెలలవుతున్నా హామీలు అమలు చేయడంలేదు. అన్ని పేపర్లు, చానళ్లలో చూస్తున్నాం. సెల్ ఫోన్ లైట్లతో భువనగిరి ఆస్పత్రిలో రోగి ఆపరేషన్ చేసిన దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది. 2014 ముందు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అవే మళ్లీ పునరావృతమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పారదోలే వరకు, మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చే వరకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు విశ్రమించకుండా పనిచేయాలి.
-బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎంపీ
గులాబీ సైనికులు భయపడాల్సిన అవసరం లేదు. ఏ కార్యకర్తకు కష్టమొచ్చినా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందుంటారు. కేటీఆర్ నాయకత్వంలో లీగల్ సెల్ ఏర్పాటు చేశారని, కార్యకర్తలను ఇబ్బంది పెట్టినా లీగల్గా ఎదుర్కొందాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 164 రోజులు కావొస్తున్నది. ఇప్పటికీ నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. రైతులకు బోనస్ ఇవ్వడం చేతకాదు? మహిళలకు చేయూత కింద రూ.2.500 ఇవ్వడం చేతకాదు? మోసకారి ప్రభుత్వాన్ని ఎండగట్టాలంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి.
-దూదిమెట్ల బాలరాజు, గొర్రెల, మేకల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్