సూర్యాపేట, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ప్రజలకు అన్నీ సమస్యలుగానే ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లా తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఎంతో మారింది. వేల కోట్ల రూపాయల అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పల్లెలు, పట్టణాలు కొత్త రూపు సంతరించుకున్నాయి. ఉపాధి అవకాశాలు మెరుగుపడి, సంపద గణనీయంగా పెరిగింది. దశాబ్దాల తరబడి నల్లగొండను పట్టి పీడించిన ఫ్లోరైడ్ రక్కసి మిషన్ భగీరథ పథకంతో పూర్తిగా కనుమరుగైంది. కాళేశ్వరం జలాలతో బీడు భూములు సస్యశ్యామలమయ్యాయి. నాగార్జున సాగర్, మూసీ ప్రాజెక్టుల ఆధునీకరణతో ప్రతియేటా రెండు పంటలకు నీటి విడుదల జరిగింది.
ఉమ్మడి జిల్లాలో 2014కు ముందు 13 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం ఉండగా ఈ ఏడాది వరకు 26 లక్షల ఎకరాలకు చేరుకుంది. ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు, 24 గంటల విద్యుత్తో నాటి నిరసనలు, ధర్నాలు అసలే లేవు. రూ.1200 కోట్లతో యాదగిరి గుట్ట ఆలయాన్ని అద్భుతంగా పునర్నిర్మించారు. ఇల వైకుంఠంగా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నది. రాష్ర్టానికి విద్యుత్ వెలుగులు అందించేందుకు దామరచర్లలో 4వేల మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణ పనులు 90 శాతం పూర్తయ్యాయి. ప్రభుత్వ దవాఖానలు కార్పొరేట్కు దీటుగా మారాయి. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో మెడికల్ కళాశాలు అందుబాటులోకి రాగా యాదాద్రిలో నిర్మాణం కానున్నది.
హరితహారం, పల్లె ప్రకృతి వనంతో పచ్చదనం సంతరించుకోగా.. ప్రతి ఊరికి రోడ్డు, సీసీ రోడ్లు, మురికి కాల్వల నిర్మాణం వంటి ఎన్నో పనులు జరిగాయి. కులవృత్తులు మెరుగుపడ్డాయి. చేతినిండా పనులు దొరుకుతుండడంతో వలస జీవులు సొంతూళ్లకు వచ్చి సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. ఇవన్నీ అభివృద్ధి, సంక్షేమంలో జరిగిన మార్పులు. ప్రత్యక్షంగా, పరోక్షంగా మరెంతో మందికి లబ్ధి చేకూరుతున్నది. కానీ ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో శ్వేత పత్రాల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు లెక్కలతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసిందని చెప్పింది. కానీ ఆస్తులు, సంపద ఏమేర పెరిగాయో చెప్పలేదు. ఈ విషయాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆదివారం స్వేద పత్రం విడుదల చేశారు. తొమ్మిదిన్నరేండ్లలో రాష్ట్రంతోపాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగిన ప్రగతిని, మార్పును స్పష్టంగా వివరించారు.
తెలంగాణ ప్రజలు 60 ఏండ్లు పడ్డ గోసను 10 ఏండ్ల కాలంలో తీర్చడంతో పాటు రాష్ర్టాన్ని అభివృద్ధి చేసిన ఘనత గత కేసీఆర్ ప్రభుత్వానిదే. దానిని వదిలేసి కేవలం అప్పులను మాత్రమే చూపుతూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టి ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నది. విద్యుత్ కొరతను అధిగమించి వెలుగు జిలుగుల రాష్ట్రంగా తెలంగాణ మారింది. వ్యవసాయాన్ని పండుగ చేసి రైతును రాజుగా చేసింది గత ప్రభుత్వమే. అది వారికి కనిపించలేదా..? కాళేశ్వరంలో అవినీతి జరిగితే ఆ ప్రాజెక్టు నాలుగున్నరేండ్లలో ఏలా పూర్తవుతుంది.
పట్టణ, పల్లె ప్రగతి ద్వారా ప్రతి ఊరిలో వసతులు కల్పించడంతో పాటు పార్కులు, వైకుంఠధామాలు, సీసీ రోడ్ల నిర్మాణం, రైతువేదికలు నిర్మించింది వాస్తవం కాదా. తెలంగాణలో తలసరి ఆదాయాన్ని పెంచి, విభజన సమయంలో 21 శాతంగా ఉన్న పేదరికాన్ని పదేండ్ల కాలంలో 5 శాతానికి తగ్గించింది. గురుకులాలు ఏర్పాటుచేసి లక్షల మంది పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించిన ఘనత కేసీఆర్దే. సంక్షేమం కోసం అప్పులు అయినా భవిష్యత్లో వీటివల్ల సంపదను పెంచుకో గలుతుతాం.
– పాదూరి సంజీవరెడ్డి, మిర్యాలగూడటౌన్
మేడిగడ్డ వద్ద కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 405.45 కిలోమీటర్ల దూరంలో చివరి ఆయకట్టుగా ఉన్న సూర్యాపేట జిల్లా తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాలకు పుష్కలంగా సాగునీరు అందడంతో నేడు ఆ ప్రాంతాలు సస్యశ్యామలం అయ్యాయి. దాంతో పాటు సూర్యాపేట జిల్లాలోని చిట్టచివరి ప్రాంతమైన పెన్పహాడ్ మండలం మాచారం రావి చెరువుకు కూడా కాళేశ్వర జలాలు చేరుతున్నాయి. దాంతోపాటు నాగార్జునసాగర్ నుంచి మనకు రావాల్సిన వాటా నీటిని పక్కాగా వినియోగించుకోవడం ద్వారా ఎడమకాల్వ ఆయకట్టుకు పక్కాగా సాగునీరు అందింది. దానికి తోడు మూసీ ప్రాజెక్టు ఆధునీకరణ, నదులు, వాగుల నీరు వృథాగా పోకుండా కోట్ల రూపాయలతో వాటిపై చెక్ డ్యాంలు సైతం నిర్మించింది. దీనికి తోడు మిషన్ కాకతీయ ద్వారా చెరువులను ఆధునీకరించడంతో అవి ప్రస్తుతం నీటితో కళకళ లాడుతున్నాయి.
దాంతో 2014కు ముందు జిల్లాలో 13 లక్షల ఎకరాలుగా ఉన్న ఆయకట్టు నేడు 26 లక్షల ఎకరాలకు చేరింది. గతంలో అన్ని రంగాల్లో వెనుకబడిన ఉమ్మడి నల్లగొండ జిల్లా నేడు అభివృద్ధి పథంలో దూసుకు పోయింది. ఇక 24 గంటల విద్యుత్తో జిల్లా వెలుగులు నిండింది. దామరచర్ల వద్ద నిర్మిస్తున్న 4వేల మెగావాట్ల పవర్ప్లాంట్ 90 శాతం పూర్తయింది. ఇది పూర్తయితే మన రాష్ట్రం మిగులు విద్యుత్ రాష్ట్రంగా అవతరించనుంది. దేశంలోనే ఇప్పటి వరకు ఎక్కడా, ఎవ్వరూ పునర్నిర్మాణం చేయనట్లుగా యాదాద్రి ఆలయ నిర్మాణాన్ని కేసీఆర్ ప్రభుత్వం వేల కోట్లతో నిర్మించింది.
దాంతో ఆలయానికి ప్రస్తుతం భక్తులు వేల సంఖ్యలో తరలివస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్నాయి. ప్రతి జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు ద్వారా ప్రస్తుతం నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో మెడికల్ కళాశాలలు రావడంతో ఉమ్మడి జిల్లాకు చెందిన పేద విద్యార్థులకు సైతం వైద్యవిద్య చేరువైంది. జిల్లా కేంద్రాల్లోని వైద్య శాలలను బోధనాస్పత్రులుగా మార్చి ఆధునిక పరికరాలు, భవనాలు సమకూర్చడంతో ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యం మన వద్ద అందుతున్నది.
రాష్ట్ర ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత గత ముఖ్యమంత్రి కేసీఆర్దే. మాడ్గులపల్లి కొత్త మండలంగా ఏర్పాటు కాకముందు మేము ఏ పనికైనా 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తరువాత కొత్త మండలంగా ఏర్పాటు చేయడంతో మాకు ఆ బాధలు తొలగాయి. కేసీఆర్ వచ్చిన తరువాతే 24గంటల కరెంట్ ఇచ్చి రైతులకు మేలు చేశారు. మారుమూల తండాలను, గ్రామాలను పంచాయతీలుగా చేసి అభివృద్ధి చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్. 60 ఏండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేని అభివృద్ధిని కేసీఆర్ కేవలం పదేండ్లలో చేసి చూపించారు.
– నాంపల్లి జగన్, కల్వలపాలెం, మాడ్గులపల్లి మండలం
ఉమ్మడి పాలనలో నల్లగొండ జిల్లా పేరు ప్రపంచంలోనే రికార్డుల్లోకి ఎక్కింది. అదేదో గొప్ప పని చేసినందుకు కాదు తాగునీటిలో ఫ్లోరిన్ కారణంగా కాళ్లు, చేతులు, నడుము వంకర్లు తిరిగి నల్లగొండ జిల్లాలో రెండు లక్షలకు పైగా ప్రజలు జీవచ్ఛవాలుగా బతికే పరిస్థితి ఉన్నందుకు. జలసాధన సమితి అధ్యక్షుడు దుశ్చర్ల సత్యనారాయణ ఫ్లోరోసిస్ బాధితులతో ఆనాటి ప్రధాని వాజ్పేయి వద్దకు వెళ్లి ఫ్లోరైడ్ బాధితుడు అంశుల స్వామిని ఏకంగా ప్రధాని ఎదుట టేబుల్పై పడుకోబెట్టి ఈ ప్రాంత దీనస్థితిని వివరించారు. 2014కు ముందు జిల్లాలో 967 ఫ్లోరైడ్ ఆవాస ప్రాంతాలు ఉందేవి. తెలంగాణ ఏర్పాటైన అనంతరం కేసీఆర్ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికీ శుద్ధి చేసిన తాగునీటిని అందించి ఫ్లోరైడ్ బాధను తీర్చింది. తొమ్మిదిన్నరేండ్ల కృషి అనంతరం నేడు రాష్ట్రంలో ఫ్లోరైడ్ పీడిత ప్రాంతం ఒక్కటి కూడా లేదని ఏకంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది.