సూర్యాపేట టౌన్, జనవరి 3 : బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్న కాంగ్రెస్ అరాచక శక్తులపై చర్యలు చేపట్టి.. దాడులను ఆదిలోనే అరికట్టాలని, ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహించకూడదని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. కాంగ్రెస్ నాయకుల దాడిలో గాయపడి సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జాజిరెడ్డిగూడెం మండలం కోమటిపల్లి, కాసర్లపహాడ్ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలను బుధవారం పరామర్శించారు.
అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తుంగతుర్తిలో కాంగ్రెస్ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. గతంలో రక్తపుటేరులు పారినచోట బీఆర్ఎస్ ప్రభుత్వం గోదావరి జలాలు పారించి అభివృద్ధి చేస్తే.. కాంగ్రెస్ పార్టీ తిరిగి ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నదని ఆరోపించారు. నోటికొచ్చినట్టు హామీలిచ్చి ఇప్పుడు నెరవేర్చలేక ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు.
దాడులు ఆపకపోతే ప్రజాక్షేత్రంలో గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ శ్రేణులు అధైర్యపడొద్దని అండగా ఉంటామని, ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు చేరేవరకూ విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. పరామర్శించిన వారిలో జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపిక, జడ్పీటీసీలు దావుల వీరప్రసాద్ యాదవ్, కందాల దామోదర్రెడ్డి, బీఆర్ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్ కల్లెట్లపల్లి శోభన్, పార్టీ మండలాధ్యక్షుడు సంకినపల్లి రఘునందన్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.