యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ)/ భూదాన్పోచంపల్లి: ఓ వైపు అధికార దుర్వినియోగం.. మరోవైపు అడ్డగోలుగా ప్రలోభాలు, ఇంకో వైపు బెదిరింపులు, భయబ్రాంతులు.. అయినప్పటికీ భూ దాన్పోచంపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఎదురు నిలిచింది. కాంగ్రెస్ అరాచకాలకు ఎదురొడ్డి గట్టి పోటీ ఇచ్చింది. హస్తం పార్టీతో హోరాహోరీగా తలపడింది. అన్ని వార్డుల్లో కాంగ్రెస్కు చమటలు పట్టించింది. ఒక్క సీటు దూరంలో వెనకంజలో నిలిచింది. తన ఓటు బ్యాంక్ను పదిలపర్చుకుంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో పోచంపల్లిలో హంగ్ ఏర్పడింది. ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాలేదు. ఇక్కడ మొత్తం 13 వార్డులకుగాను కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 5, బీజేపీ 1, ఇండిపెండెంట్ అభ్యర్థి ఒకరు గెలిచాయి. బీఆర్ఎస్ అభ్యర్థులు నాలుగో వార్డులో పెద్దల చక్రపాణి, 5వ వార్డులో బాతుక లింగస్వామి, 6వ వార్డులో కర్నాటి వరలక్ష్మి నరసింహ, 7వ వార్డులో రాపోలు కావ్య వేణు, 11వ వార్డులో కుడికాల బలరామ్ విజయం సాధించారు.
ఒకటో వార్డులో బీజేపీ, 9వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి జింకల లావణ్య గెలుపొందారు. పోలింగ్ సమయంలో కాంగ్రెస్ ఓటుకు రూ.10 వేల వరకు పంపిణీ చేసింది. చీరలు, మాంసం, మద్యం పంపిణీ చేసి ప్రలోభపెట్టింది. పోచంపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థులు 5 స్థానాల్లో విజయం సాధించారు. రెండు స్థానాల్లో అతి స్వల్ప మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. ఒకటో వార్డులో సన్న అనిత నరసింహ కేవలం 8 ఓట్లతో ఓటమిపాలయ్యారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి మంజుల శ్రీరామ్కు 446 ఓట్లు, సమీప బీఆర్ఎస్ అభ్యర్థికి 438 ఓట్లు పోలయ్యాయి. 202 ఓట్లతో కాంగ్రెస్ మూడో స్థానంలో నిలిచింది.
12వ వార్డులో బీఆర్ఎస్ 27 ఓట్లతో ఓడిపోయింది. కాంగ్రెస్ అభ్యర్థి తడక వెంకటేశ్వర్లుకు 630 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థికి 607 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థికి 32 ఓట్లు పోలయ్యాయి. రెండో వార్డులో 65 ఓట్లు, ఎనిమిదో వార్డులో 85 ఓట్లతో గులాబీ అభ్యర్థులు ఓడిపోయారు. హంగ్ రావడంతో చైర్మన్ పీఠం ఎవరు అధిరోహిస్తారో అనే ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్కు ఆరు స్థానాలు వచ్చాయి. మెజార్టీ కోసం ఇంకో సీటు కావాలి. స్వతంత్ర అభ్యర్థి మద్దతు కీలకంగా మారనుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎక్స్అఫీసియో ఓటును వాడుకునే అవకాశం లేకపోలేదు.