– పాల్గొన్న దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
దేవరకొండ, సెప్టెంబర్ 02 : కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం దేవరకొండ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావడంతో దేవరకొండ పట్టణం గులాబీమయంగా మారింది. ర్యాలీతో పట్టణం దద్దరిల్లింది. దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ భారీ ర్యాలీలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు, మహిళా కార్యకర్తలు, యువజన నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల నుండి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా కొనసాగి బస్స్టాండ్ వద్దకు చేరుకుంది. నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నినాదాలు చేశారు. బీఆర్ఎస్ జెండాలు, గులాబీ కండువాలతో భారీగా తరలివచ్చిన కార్యకర్తలతో దేవరకొండలో పండుగ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని రమావత్ రవీంద్ర కుమార్ ఆరోపించారు.

బీఆర్ఎస్ నిరసన.. దద్దరిల్లిన దేవరకొండ