ఇబ్రహీంపట్నం/ ఆదిబట్ల, ఏప్రిల్ 12 : పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి గుంపు మేస్త్రీకి గుణపాఠం చెబుదామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇబ్రహీంపట్నం మండలం బొంగుళూరు గ్రామ సమీపంలో శుక్రవారం జరిగిన పార్టీ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎంపీ సీట్ల కేటాయింపులో బీఆర్ఎస్ బలహీన వర్గాల వారికి పెద్ద పీట వేసిందన్నారు. అందులో భాగంగా భువనగిరి స్థానంలో క్యామ మల్లేశ్కు అవకాశం కల్పించినట్లు తెలిపారు.
ఆర్థిక ప్రగతితోనే సమానత్వం వస్తుందన్న జ్యోతిరావు ఫూలే, అంబేద్కర్ ఆశయాలను కేసీఆర్ ఆచరణలో చూపించారన్నారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసినట్లు తెలిపారు. 1008 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించామన్నారు. కుల వృత్తులను ప్రోత్సహించి వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేశామని, రూ.11 వేల కోట్లతో గొల్లకురుమలకు సబ్సిడీపై గొర్రెలు, రూ.35 వేల కోట్లతో మత్స్యకారులకు చేప పిల్లలను అందజేశామని చెప్పారు. అనేక సంక్షేమ పథకాలతో నేతన్నలకు అండగా నిలిచామన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బడుగు, బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉన్నదని, ఒకరిద్దరు అవకాశవాద నేతలు పార్టీని వీడినంతమాత్రాన జరిగే నష్టమేమీలేదని అన్నారు. స్థానికుడైన భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేశ్ను 50వేల మెజారిటీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో పార్టీ నాయకులు సత్తు వెంకటరమణారెడ్డి, దండె రాంరెడ్డి, జక్క రాంరెడ్డి, ఎంపీపీ కృపేశ్, జడ్పీటీసీ జంగమ్మ, ఆయా మండలాల అధ్యక్షులు, స్థానిక సంస్థల ప్రతినిధులు పాల్గ్గొన్నారు.