రామగిరి, ఏప్రిల్ 29 : నల్ల కోటు వెనుక ఉన్న కష్టాలు తనకు తెలుసని, తనను గెలిపిస్తే న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా కృషి చేస్తానని బీఆర్ఎస్ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి అన్నారు. నల్లగొండ బార్ అసోసియేషన్లో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డితో కలిసి సోమవారం న్యాయవాదులను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను ఎంపీగా గెలిపిస్తే తొలి ఎంపీ ల్యాండ్స్ నిధులు న్యాయవాదుల అభివృద్ధికి కేటాయిస్తానని హామీ ఇచ్చారు.
ప్రజలను చైతన్యం చేయడంలో న్యాయవాదుల పాత్ర చాలా కీలకమైందని, అటువంటి వారు తనకు మద్దతుగా నిలువడం చాలా సంతోషంగా ఉన్నదని అన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సిరిగిరి వెంకట్రెడ్డి, ప్రధాన కార్యదర్శి గిరి లింగయ్యగౌడ్, సీనియర్ న్యాయవాదులు మునగాల నారాయణ, నేతి రఘుపతి, లొడంగి గోవర్ధన్, కె.జవహర్లాల్, జి.జవహర్లాల్, జి.వెంకటేశ్వర్లు, మామిడి బాలయ్య, మామిడి ప్రమీల, ఆదిరెడ్డి పాల్గొన్నారు.