అర్వపల్లి, నవంబర్ 5 : కాంగ్రెస్కు ఓటు వేస్తే అరాచకాన్ని ఆహ్వానించినట్లేనని బీఆర్ఎస్ తుంగతుర్తి నియోజక వర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. తుంగతుర్తి నియోజక వర్గ అభివృద్ధి చూసి, సీఎం కేసీఆర్కు అండగా ఉంటూ కారు గుర్తుకు ఓటు వేసి మళ్లీ గెలిపించాలని ప్రజలను కోరారు. మళ్లీ గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఆదివారం జాజిరెడ్డిగూడెం మండలం బొల్లంపల్లి, సీతారాంపురం, కొత్తగూడెం, రామన్నగూడెం, వేల్పుచర్ల, అడివెంల, ఉయ్యాలవాడ, కుంచమర్తి గ్రామాల్లో ఎమ్మెల్యే కిశోర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. మహిళలు మంగళ హారతులతో తిలకం దిద్ది ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014కు ముందు నియోజక వర్గంలో ఏ పండుగ చేయాలన్నా ప్రజలు భయపడే వారన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. కాళేశ్వరం జలాలతో నియోజక వర్గం సస్యశ్యామలంగా మారి భూములన్నీ సిరుల మాగానిగా మారినట్లు తెలిపారు.
అర్వపల్లి మండల కేంద్ర నుంచి రెండు జాతీయ రహదారులు వెళ్లడంతో ఒకప్పుడు ఎకరం రూ.5 లక్షలు ఉన్న భూముల ధరలు ఇప్పుడు రూ.50 లక్షలు పలుకుతున్నాయన్నారు. తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆసరా పింఛన్లు దశల వారీగా పెంచుతూ రూ.5,016 ఇవ్వడంతో పాటు తెల్ల రేషన్ కార్డులకు కేసీఆర్ బీమా, రూ.400కే గ్యాస్ సిలిండర్, గృహలక్ష్మి, బీసీ బంధు దశల వారీగా అందజేయనున్నట్లు తెలిపారు.
అలాగే నియోజక వర్గంలోని 15 వేల దళిత కుటుంబాలకు దళిత బంధు వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. మిషన్ భగీరథతో మంచి నీళ్ల గోస తీరిందన్నారు. సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. పర్సాయపల్లి, కొత్తగూడెం గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే కిశోర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అలాగే ఉయ్యాలవాడ గ్రామ సర్పంచ్ సాగర్ల బుచ్చయ్య అనారోగ్యంతో బాధపడుతుండడంతో ఎమ్మెల్యే పరామర్శించి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ మన్నె రేణుకాలక్ష్మీనర్సయ్యయాదవ్, జడ్పీటీసీ దావుల వీరప్రసాద్యాదవ్, జీడి భిక్షం, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మారిపెద్ది శ్రీనివాస్గౌడ్, బీరవోలు సోమిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కుంట్ల సురేందర్రెడ్డి, మండలాధ్యక్షుడు గుండగాని సోమేశ్గౌడ్, మొరిశెట్టి ఉపేందర్, బొడ్డు రామలింగయ్య, మార్కెట్ డైరెక్టర్ శేఖర్రెడ్డి, నరేశ్, వివిధ గ్రామాల సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.