మిర్యాలగూడ, సెప్టెంబర్ 02 : కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయడంలో వైఫల్యం చెందిందని పేర్కొంటూ, ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు ఆధ్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలో 420 హామీలతో కూడిన ఫ్లెక్సీని ర్యాలీగా తీసుకువచ్చి ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా భాస్కర్ రావు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక మహిళలకు నెలకు రూ.2,500 అందిస్తామని ఇప్పటివరకు రూ.82,500 బాకీ పడిందన్నారు. వృద్ధాప్య పింఛనుదారులకు నెలకు రూ.4000 ఇస్తానని చెప్పిందని 33 నెలలకు రూ.66 వేలు బాకీ ఉందని అదేవిధంగా దివ్యాంగులకు రూ.6000 పింఛన్ ఇస్తామని చెప్పగా రూ.66,000 బాకీ పడిందని తెలిపారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం ఇస్తానని హామీ ఇచ్చి నేడు పట్టించుకోకుండా వదిలేశారని ఆరోపించారు.
18 సంవత్సరాలు దాటిన విద్యార్థినిలు స్కూటీ బాకీ ఉందని ఇంతవరకు ఇవ్వలేదని తెలిపారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల రూ.12 వేల కోట్లు బాకీ పడ్డారని దీనివలన కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు కళాశాల యాజమాన్యాల నుండి వేధింపులు వస్తున్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రైతులు అరిగోస పడుతున్నారని, విత్తనాలు, ఎరువులు దొరకక గోస తీస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఎరువులు దొరకక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, యూరియా బుకింగ్ యాప్ వలన రైతులు బ్లాకులో యూరియాను కొనాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. రెండు లక్షల రుణమాఫీ 50 శాతం మందికి కాలేదని అన్నారు రైతు కూలీలకు సంవత్సరానికి రూ.12 వేలు ఇస్తానని హామీని గాలికి వదిలేశారని తెలిపారు విద్యా భరోసా కార్డు కింద విద్యార్థులకు ఐదు లక్షల రూపాయలు బాకీ పడ్డారన్నారు.
అదేవిధంగా ఆటో కార్మికులకు రూ.12,000 హామీ ఇచ్చారని ఇప్పటికి రూ.24 వేలు బాకీ పడ్డారని తెలిపారు. హామీల అమలులో వైఫల్యం చెందిన రేవంత్ రెడ్డి సీఎం పదవి నుండి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనకు మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా రెండు వేల మందికి పైగా కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, నాయకులు చింతారెడ్డి శ్రీనివాసరెడ్డి, అన్న భీమోజు నాగార్జున చారి, నల్లమోతు సిద్ధార్థ, నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, పాలుట్ల బాబయ్య, మట్టపల్లి సైదులు యాదవ్, హతీరామ్, ఎడవల్లి శ్రీనివాస్ రెడ్డి, సిర్ర మల్లయ్య యాదవ్, కట్ట మల్లేష్ గౌడ్, శాహానాంజ్ బేగం, సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.

ప్రజా వ్యతిరేక పాలనపై భగ్గుమన్న బీఆర్ఎస్ మిర్యాలగూడ శ్రేణులు