(ఎల్ఆర్ఎస్)పై కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి పట్ల బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు అధికారంలోకి రాగానే చార్జీలు ఎలా వసూలు చేస్తారంటూ ఆందోళనలకు దిగింది. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మేరకు ఉచితంగానే ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించింది. కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత వైఖరిని నిలదీస్తూ పెద్దసంఖ్యలో ఆ పార్టీ శ్రేణులు ఆందోళనల్లో కదం తొక్కాయి.
నల్లగొండ ప్రతినిధి, మార్చి6 (నమస్తే తెలంగాణ) : ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులను కాంగ్రెస్ సర్కార్ మోసం చేయడంపై బీఆర్ఎస్ పార్టీ మండిపడుతున్నది. బుధవారం జిల్లా అంతటా ధర్నాలు చేపట్టింది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని క్లాక్టవర్ సెంటర్లో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఆధ్వర్వంలో జరిగిన ధర్నాలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొన్నాయి. జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనగా పార్టీ ముఖ్య నేతలంతా తరలివచ్చారు. దేవరకొండలో బస్టాండ్ వద్ద పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ధర్నా జరిగింది. నియోజకవర్గ ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులంతా తరలివచ్చారు. మిర్యాలగూడలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి, పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నకిరేకల్ మెయిన్ సెంటర్లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత వైఖరికి వ్యతిరేకంగా నినదించారు. మునుగోడులో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మెయిన్ రోడ్డుపై బైఠాయించి ఉచితంగా ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పాల్వాయి స్రవంతి, పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సూర్యాపేటలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ నేతృత్వంలో జరిగిన ఆందోళనలో పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు భాగస్వాములయ్యారు. కోదాడలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించి ఖమ్మం క్రాస్రోడ్డులో ధర్నా చేపట్టారు. హుజూర్నగర్, తుంగతుర్తిలోనూ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఎల్ఆర్ఎస్ చార్జీలను నిరసిస్తూ పెద్ద సంఖ్యలో కదం తొక్కారు. యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఆలేరు తాసీలార్ కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి ఆధ్వర్వంలో జరిగిన ఆందోళనలో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాలుపంచుకున్నాయి. ఎల్ఆర్ఎస్పై కాంగ్రెస్ సర్కార్ ప్రజలను మోసం చేస్తున్నదని, గతంలో వాళ్లు చెప్పిన మాదిరిగానే ఉచితంగానే ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఉచితంగా అమలు చేసే వరకు ప్రజల పక్షాన బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని హెచ్చరించారు. ఇక గురువారం జిల్లా కలెక్టర్లు, ఆర్డీఓలకు ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు వినతిపత్రాలు అందజేయనున్నారు.