బొడ్రాయిబజార్, డిసెంబర్ 29 : తుంగతుర్తి నియోకవర్గం అర్వపల్లి మండలం కాసర్లపహాడ్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు మెండె సురేశ్, అతని భార్య, పిల్లలపై కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ తెలిపారు. కాంగ్రెస్ నాయకుల దాడిలో గాయపడి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సురేశ్ను శుక్రవారం ఆయన పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద వర్గానికి చెందిన నాయకుడని చూడకుండా రైతుబంధు రాలేదని అడుగుతావా? నీళ్లు రాలేదని వాట్సాప్లో పెడుతావా? అంటూ దాడి చేయడం బాధాకరమన్నారు. గత పదేండ్లలో బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి ఘర్షణలు, దౌర్జన్యాలు, రౌడీయిజానికి తావు లేకుండా పాలన సాగించినట్లు గుర్తు చేశారు.
నేడు కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ నాయకులపై అకారణంగా దాడులు చేయడం తగదన్నారు. మరోసారి ఇలా జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. పదేండ్ల కిందటి విష సంప్రదాయాన్ని మళ్లీ తెచ్చే ప్రయత్నం మానుకోవాలని సూచించారు. దాడికి పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సురేశ్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఆయన వెంట జడ్పీటీసీ దావుల వీరప్రసాద్యాదవ్, బీఆర్ఎస్ అర్వపల్లి మండలాధ్యక్షుడు గుండగాని సోమేశ్గౌడ్, బొడ్డు రామలింగయ్య, గణేశ్ ఉన్నారు.