‘తొమ్మిదిన్నరేండ్లలో సాగర్ ఎడమ కాల్వ ద్వారా 18 సార్లు తమ ప్రభుత్వం పంటలకు సాగు నీరు ఇచ్చింది. రాష్ట్రంలోనే అత్యధికంగా వరి పండిస్తున్న జిల్లా నల్లగొండ. రైస్ మిల్లుల కేంద్రంగా దేశానికే అన్నం పెడుతున్న ఘనత మిర్యాలగూడదే. 2014కు ముందు ఇప్పటికి మిర్యాలగూడ ఎంతో అభివృద్ధి చెందింది. కొత్త జిల్లాల ఏర్పాటు ఉంటే మొదటగా మిర్యాలగూడకే అవకాశం ఉంటుంది. నిస్వార్థ నాయకుడు భాస్కర్రాను గెలిపించాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్రావుకు మద్దతుగా సోమవారం మిర్యాలగూడలో కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. పెద్ద ఎత్తున హాజరైన జనంతో పట్టణం గులాబీమయమైంది.
మిర్యాలగూడ, నవంబర్ 20 : నిస్వార్థపరుడు నల్లమోతు భాస్కర్రావును మరోసారి ఆశీర్వదించి మరింత అభివృద్ధి చేసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం మిర్యాలగూడ పట్టణంలో బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్రావు విజయం కోసం చేపట్టిన ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడుతూ.. గత తొమ్మిదిన్నరేండ్లుగా నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ద్వారా 18సార్లు పంటలకు నీళ్లు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక ఏరోజున కూడా రైతులు, ప్రజలు కరువు బారిన పడలేదన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా వరి ధాన్యం పండిస్తున్న జిల్లా నల్లగొండ అని తెలిపారు. దేశానికి అన్నం పెడుతున్న ఘనత మిర్యాలగూడదేనని పేర్కొన్నారు.
రైతుబంధు పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తుండడంతో తొమ్మిదిన్నరేండ్లుగా రైతులు పుష్కలంగా పంటలు పండించుకొని ఆనందంగా ఉన్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 24 గంటల కరెంట్ రావట్లేదని అంటున్న ఉత్తమ్కుమారెడ్డి, జానారెడ్డి, రేవంత్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మిర్యాలగూడ మండలంలోని ఏదైనా గ్రామానికి వచ్చి కరెంట్ తీగలు పట్టుకొని కరెంట్ వస్తుందో? రాట్లేదో? తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో అర్ధరాత్రి వచ్చే కరెంట్కు మోటర్లు పెట్టేందుకు వెళ్లి అన్నదాతలు కరెంట్ షాక్కు గురై వేల మంది అసువులు బాసారని పేర్కొన్నారు. వారి ఉసురు తగిలే కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయిందని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో విత్తనాలు, ఎరువుల కోసం రైతులు గంటలకొద్దీ బారులు తీరేవారని, కానీ, స్వరాష్ట్రంలో ఆ పరిస్థితి లేకుండా పోయిందన్నారు. గాడ్దులకు గడ్డేసి ఆవులకు పాలు పిండితే పాలు వస్తాయా? అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి పథకాలు అడిగితే రావని తెలిపారు. కారు గుర్తుకు ఓటేసినట్లయితే ప్రజలకు అన్ని పథకాలు వస్తాయని చెప్పారు.
మిర్యాలగూడ పట్టణంలో నిర్వహించిన రోడ్షోకు ఇంత భారీగా గులాబీ శ్రేణులు తరలిరావడం సంతోషంగా ఉందని, ఇది రోడ్షోలా లేదని, గెలిచిన తరువాత బీఆర్ఎస్ విజయోత్సవ ర్యాలీలా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ గులాబీ దండును చూసి కాంగ్రెస్ నాయకులకు కంటి మీద కునుకు ఉండదని, వారు గెలుపుపై ఆశలు వదులుకోవాల్సిందేనని అన్నారు. దేశంలోనే అతి పెద్దదైన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను రూ.30వేల కోట్లతో నిర్మిస్తున్నామని, ఇది త్వరలోనే నిర్మాణం పూర్తి చేసుకుంటుందని, ఈ ప్లాంట్లో స్థానిక యువతకే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ఉంటే మొదటి అవకాశం మిర్యాలగూడకే ఇస్తామని తెలిపారు. మళ్లీ గెలిచిన తర్వాత సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా 18 ఏండ్లు నిండిన మహిళలకు రూ.3 వేల భృతి, ఆసరా పింఛన్ దారులకు రూ.5 వేలు, దివ్యాంగులకు రూ.6వేలను దశలవారీగా పెంచుతామన్నారు.
రూ.400కే వంట గ్యాస్ సిలిండర్, తెల్ల రేషన్కార్డు ఉన్న వారందరికీ సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. భూమి ఉన్నా లేకున్నా పేదలందరికీ రూ.5లక్షల కేసీఆర్ బీమా ఇవ్వనున్నట్లు చెప్పారు. డిసెంబర్ 3 తరువాత తెల్లరేషన్ కార్డు లేని వారికి తిరిగి నూతన కార్డులు అందించనున్నట్లు చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి కొనసాగాలంటే నిస్వార్థపరుడైన నల్లమోతు భాస్కర్రావును గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరిపై ఉందని, కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు అలుగుబెల్లి అమరేందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ నారాయణరెడ్డి, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు మోసిన్అలీ, సీనియర్ నాయకులు అన్నభీమోజు నాగార్జునాచారి, జొన్నలగడ్డ రంగారెడ్డి, ఎంపీపీ నూకల సరళాహన్మంతరెడ్డి, జడ్పీటీసీలు లలితాహాతీరాం, ఇరుగు మంగమ్మావెంకటయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, ఆయా మండలాల బీఆర్ఎస్ అధ్యక్షులు పాలుట్ల బాబయ్య, నామిరెడ్డి కరుణాకర్రెడ్డి, మట్టపల్లి సైదులుయాదవ్, కూరాకుల చినరామయ్య, నాయకులు వంగాల నిరంజన్రెడ్డి, ధనావత్ చిట్టిబాబునాయక్, నల్లమోతు సిద్దార్ధ, చైతన్య పాల్గొన్నారు.
మంత్రి కేటీఆర్ రోడ్షోతో పట్టణమంతా గులాబీమయమైంది. మంత్రి కేటీఆర్ హెలికాప్టర్లో పట్టణ శివారులోని వైదేహి వెంచర్లో దిగారు. అక్కడ స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, డీసీఎంఎస్ జిల్లా చైర్మన్ నారాయణరెడ్డి, ఎంపీపీలు, జడ్పీటీసీలు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రచార రథంలో వేలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు వెంట నడువగా భారీ రోడ్షో నిర్వహించారు. హనుమాన్పేట ఫ్లైఓవర్ నుంచి గాంధీ బొమ్మ మీదుగా రాజీవ్చౌక్ వద్దకు చేరుకున్నారు.
మార్గమధ్యంలో ఆయన ప్రజలకు అభివాదం చేస్తూ ప్రజల్లో ఉత్సాహం నింపారు. గణేశ్ ఆలయ సమీపంలో క్రేన్ సహాయంతో భారీ పూలదండతో కేటీఆర్కు స్వాగతం పలికారు. మహిళల కోలాటాలు, యువకుల డ్యాన్స్లు, పటాకుల మోతతో పట్టణమంతా మార్మోగింది. రోడ్షోకు దామరచర్ల, అడవిదేవులపల్లి, వేములపల్లి, మిర్యాలగూడ పట్టణం, రూరల్ నుంచి ట్రాక్టర్లు, ఆటోలు, బైక్లపై వేలాదిగా తరలివచ్చారు. పట్టణమంతా గులాబీజెండాలు రెపరెపలాడాయి. రోడ్షోలో మంత్రి కేటీఆర్ చేసిన ప్రసంగం యువకులు, రైతులు, మహిళల్లో జోష్ నింపింది. మంత్రి రోడ్షోను కొంతమంది బిల్డింగ్ల పైకి ఎక్కి తిలకించారు.
దామరచర్ల : ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్ నిర్వహించిన రోడ్షోలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు మాట్లాడుతూ భద్రాచల రాముని తర్వాత కేటీఆర్ మంచి మనసున్న వారని, రూ.5,200 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధికి కేటీఆర్ సహాయ, సహకారం ఎంతో ఉందన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మిర్యాలగూడ మున్సిపాలిటీ, మండలాల్లో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. మిర్యాలగూడను జిల్లా చేసి ఈ ప్రాంతవాసుల కోరికను నెరవేర్చాలని కోరారు.