‘కోదాడలో బొల్లం మల్లన్న గెలిచిన తర్వాత ఎలా ఉన్నది. అంతకుముందు ఎలా ఉన్నది. తెలంగాణలో 11సార్లు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినా ఇక్కడ చేసిన అభివృద్ధి ఏమీ లేదు. నేడు మీ కండ్ల ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులు కనపడుతున్నయి. ట్యాంక్ బండ్, రోడ్లు, డివైడర్లు, గ్రీనరీ, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుతో కోదాడ పట్టణం సుందరంగా మారింది. మళ్లీ మల్లన్న గెలిస్తే ఆయన అడిగినట్లు వంద కోట్ల రూపాయలు, హైటెక్ బస్టాండ్, పాలిటెక్నిక్ కళాశాలతోపాటు ఏదైనా వస్తాయి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. కోదాడలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య
యాదవ్కు మద్దతుగా బుధవారం నిర్వహించిన రోడ్ షోలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
మల్లన్న మీలోంచి వచ్చిన వ్యక్తి అని, బలహీన వర్గాలకు వచ్చిన మరో అవకాశాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. బీసీ బిడ్డను ఓడించడానికి దొరలు, పెత్తందార్లు కుట్రలు పన్నుతున్నారని, ప్రజలు ఆలోచించి అభివృద్ధికి అండగా ఉండాలని కోరారు. ఉత్తమ్కుమార్ రెడ్డి డబ్బులు బాగా ఉన్నాయని ఎన్నికల్లో పంచేందుకు వస్తున్నారని, చుట్టపు చూపుగా వచ్చే నాయకులు కావాలో, నిత్యం జనం మధ్య ఉండే మల్లన్న కావాలో ప్రజలు తేల్చుకోవాలని సూచించారు. రోడ్ షోకు పెద్ద సంఖ్యలో హాజరైన బీఆర్ఎస్ శ్రేణులతో కోదాడ
గులాబీమయమైంది.
సూర్యాపేట, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ) : ‘కోదాడకు బొల్లం మల్లన్న వచ్చిన తరువాత ఎలా ఉంది. గతంలో 11 సార్లు అవకాశం ఇస్తే 55 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ హయాంలో ఏం జరిగిందో అంతా మీ కళ్ల ముందే ఉన్నది. నేడు కోదాడ ఎంతో సర్వాంగ సుందరంగా మారుతుంది. నియోజకవర్గ పరిధిలోని కాళేశ్వరం టేలెండ్ ప్రాంతాలకు గోదావరి జలాలు వస్తున్నాయి. ట్యాంక్బండ్, రోడ్లు, డివైడర్లు, గ్రీనరీ, సెంట్రల్ లైటింగ్ సిస్టం ఇలా ఎన్నో జరిగాయి.’ అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మరి ఈ ఎన్నికల్లో అభివృద్ధికి పాటుపడే మల్లన్నను గెలిపించుకుందామా.. లేక అభివృద్ధి అడ్రస్ తెలియని కాంగ్రెస్కు ఓటేద్దామా? అని ప్రశ్నించారు.
మళ్లీ మల్లన్న గెలిస్తే ఆయన అడిగినట్లు వంద కోట్ల రూపాయలు, హైటెక్ బస్టాండ్, పాలిటెక్నిక్ కళాశాల ఏదైనా వస్తాయని అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్యయాదవ్తో కలిసి బుధవారం కోదాడ పట్టణంలో ఖమ్మం క్రాస్ రోడ్ నుంచి రంగా థియేటర్ చౌరస్తా వరకు రోడ్ షో నిర్వహించారు. పార్టీ శ్రేణులు, ప్రజలు భారీగా తరలి వచ్చారు. రంగా థియేటర్ చౌరస్తా వద్ద ప్రజలనుద్దేశించి మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. ఆయన మాటల్లోనే.. ‘బొల్లం మల్లయ్య మీలోంచి వచ్చిన వ్యక్తి. అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన బలహీన వర్గాల బిడ్డ. అవతల పెద్దపెద్ద దొరలు, పెత్తందారులు ఒక్కటవుతున్నరు. మల్లన్నను ఓడించాలని కుట్రలు చేస్తున్నారు. డబ్బు సంచులతో దిగుతున్నారు. చుట్టపు చూపుగా వచ్చే వారి గురించి ఆలోచిద్దామా.. ఇక్కడుండే వారి గురించి ఆలోచిద్దామా? అభివృద్ధిని కాంక్షిస్తూ నిత్యం ప్రజల మధ్యనే ఉంటున్న మల్లన్నను కాపాడుకుంటరా?’ అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించగా.. కాపాడుకుంటామని జనం నినదించారు.
‘ఇయ్యాల కరెంటు గురించి రేవంత్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డితో పాటు ఇంకా చాలా మంది మాట్లాడుతున్నరు. కేసీఆర్.. మీరిచ్చే కరెంటు కనపడట్లేదు అంటున్నారు. మరి కరెంటు కనపడతదా? ఉత్తమ్, రేవంత్, వెంకట్రెడ్డి, జానారెడ్డి, చందర్రావు నియోజకవర్గంలో ఏ గ్రామానికైనా వెళ్లి విద్యుత్ వైర్లను పట్టుకుంటే వస్తదో రాదో తెలుస్తది. దీంతో రాష్ర్టానికి పట్టిన కాంగ్రెస్ దరిద్రం కూడా పోతది. ఆనాడు కరెంటు, ఎరువులు, విత్తనాలు, రైతు బంధు ఇవ్వనోళ్లు.. ఇయ్యాల రైతుల మీదు వల్లమాలిన ప్రేమ కనబర్చితే మోసపోదామా?’ అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
కోదాడలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న బొల్లం మల్లయ్యయాదవ్ను గెలిపించండి.. ఏది కావాలన్నా ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానని మంత్రి కేటీఆర్ అన్నారు. కోదాడకు వంద కోట్లు రావాలన్నా, పాలిటెక్నిక్ కళాశాల, హైటెక్ బస్టాండ్ కావాలన్నా మల్లన్న గెలిస్తే వచ్చి తీరుతాయన్నారు. డబ్బులకు ఆశపడొద్దు.. బలహీన వర్గాల బిడ్డను గెలిపిస్తే ఇప్పుడు జరిగిన అభివృద్ధికి రెట్టింపు జరుగడం ఖాయమని హామీ ఇచ్చారు. కనీవిని ఎరుగని రీతిలో వచ్చిన జన సందోహం, వారి ఉత్సాహం చూస్తుంటే ప్రచార ర్యాలీలా కాకుండా మల్లన్న విజయోత్సవ ర్యాలీని తలపిస్తున్నదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
‘గాడిదలకు మేత వేసి ఆవులకు పాలు పిండితే వస్తాయా.. కాంగ్రెస్కు ఓటేసి పనులు కావాలంటే కావు. 2014కు మునుపు ఈ రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్సే. ఇవ్వాల వచ్చి ఒక్క చాన్స్ అంటున్నారు. వాళ్లకు ఇచ్చింది 11 చాన్స్లు. 55 ఏండ్లు రాష్ట్రం వాళ్ల చేతుల్లోనే ఉన్నది. 2014కు ముందు కోదాడ ఎలా ఉండేది? గుంతల రోడ్లు, మురికి వాడలు, విద్యుత్ కోతలతో కాలిపోయిన మోటర్లు, పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు, అర్ధరాత్రి ఇచ్చే కరెంటు. చెప్పింది ఆరు గంటలు.. ఇచ్చింది మూడు గంటలు. ఎవరైనా చనిపోతే పైరవీలు చేసి 15 నిమిషాల కరెంటు ఇవ్వాలని బతిమాలుకునే దుస్థితి ఉండేది. మరి ఇయ్యాల ఎలా ఉందో మీ కళ్లముందే ఉన్నది.’
మీ అందరినీ అడిగేది ఒక్కటే. మల్లన్నను ఒక్కసారి గెలిపిస్తే ఎలా మారింది. గ్రామంలా ఉన్న కోదాడలో అనేక పనులు చేసి మంచి పట్టణంలా మార్చారు. సెంట్రల్ లైటింగ్ పెట్టి అందమైన చెట్లతో చక్కగా ఆధునీకరించాం. ట్యాంక్ బండ్ తయారైంది. బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేండ్లలో చేసిన పనులను గుర్తు చేసుకోవాలి. రోడ్లు, పార్కులు, కరెంటు, సాగు, తాగునీటితో పాటు అనేక పనులు మీ కళ్ల ఎదుటే సాక్షాత్కరిస్తున్నది నిజం కాదా?’
కోదాడ టౌన్, నవంబర్ 22 : నాడు అయోధ్యరాముడి పాదాల స్పర్శతో రాయి అహల్యగా మారితే.. నేడు మన తారకరాముడి పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడంతోపాటు బీడు భూములు సస్యశ్యామలంగా మారాయని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. కోదాడలో రోడ్షోలో ఆయన మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ అనేక బహుళ జాతి కంపెనీలను రాష్ర్టానికి రప్పించి లక్షలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారన్నారు.
ఐటీ రంగంలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్గా నిలిపారని తెలిపారు. తనపై నమ్మకముంచి గెలిపిస్తే రూ.2400 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానన్నారు. కోదాడ మున్సిపాలిటీని ఇప్పటికే వందల కోట్లతో సుందరీకరించామని చెప్పారు. ఎన్నికల తర్వాత మోడల్గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. మరోసారి ఆశీర్వదించి అసెంబ్లీకి పంపండి.. మరింత అభివృద్ధి చేస్తానని కోరారు.