కేఆర్ఎంబీకి కృష్ణానది ప్రాజెక్టుల అప్పగింతపై బీఆర్ఎస్ తలపెట్టిన చలో నల్లగొండ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. సోమవారం రాత్రి వరకే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. నల్లగొండ పట్టణ శివారులోని మర్రిగూడ బైపాస్ వద్ద నార్కట్పల్లి- అద్దంకి రహదారికి ఆనుకుని విశాలమైన స్థలంలో సభకు ఏర్పాట్లు చేశారు. సభా వేదికతోపాటు కళాకారుల వేదిక, గ్యాలరీలు, బారి కేడింగ్ వంటివన్నీ పూర్తయ్యాయి. జిల్లా నేతలతో కలిసి మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే సభకు సంబంధించి క్షేత్రస్థాయి వరకు విస్తృత ప్రచారం కల్పించిన నేపథ్యంలో పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారిగా ప్రసంగించనుండడంతో అందరి దృష్టి ఈ సభపైనే కేంద్రీకృతమైంది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ మొదలుకానున్నది.
చలో నల్లగొండ బహిరంగ సభ కోసం హైవేకు ఆనుకుని ఉన్న 50 ఎకరాల విశాలమైన స్థలంలో బీఆర్ఎస్ ఏర్పాట్లు పూర్తి చేసింది. గత మూడు రోజులుగా చకచకా ఏర్పాట్లు చేస్తూ వచ్చారు. గతంలో ఇదే స్థలంలో నిర్వహించిన నాలుగు సభల్లో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో తిరిగి అదే స్థలంలో కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతపై పోరు శంఖం పూరించనున్నారు. హైదరాబాద్ నుంచి కేసీఆర్ రోడ్డు మార్గాన భారీ కాన్వాయ్తో నల్లగొండకు చేరుకోనున్నట్లు సమాచారం. చివరి క్షణాల్లో ట్రాఫిక్, ఇతర అంశాల నేపథ్యంలో హెలికాప్టర్లోనూ వచ్చే అవకశాలు లేకపోలేదని పార్టీ నేతలు భావిస్తున్నారు.
అందుకు అనుగుణంగా సభా ప్రాంగణం పక్కనే హెలిప్యాడ్ను, అక్కడి నుంచి సభా వేదికకు చేరుకునేలా ప్రత్యేక రూట్ను కూడా సిద్ధం చేశారు. సభకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్లు, మాజీ కీలక ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర ముఖ్య నేతలంతా తరలిరానుండడంతో అందుకు అనుగుణంగా విశాలమైన సభా వేదికను నిర్మించారు. ఇక దాని పక్కనే కళాకారుల వేదికను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. సభా వేదికకు ఎదురుగా వీఐపీ, మీడియా, మహిళల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలను సిద్ధం చేశారు. సభకు వచ్చే వారికి ఇబ్బంది లేకుండా బారీ కేడింగ్ చేశారు. వీఐపీల వాహనాల పార్కింగ్ను కూడా సభా వేదికకు ఇరువైపులా చేసేలా చర్యలు చేపట్టారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొంటున్న నేపథ్యంలో సభకు పెద్ద సంఖ్యలోనే పార్టీ శ్రేణులు, ప్రజలు తరలివచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలతోపాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి ఎక్కువ మంది హాజరవుతున్నట్లు పార్టీ నేతలు చెప్పారు. వాహనాల పార్కింగ్ కోసం నలువైపులా స్థలాలను సిద్ధం చేశారు. నార్కట్పల్లి ప్రాంతం నుంచి వచ్చే వారంతా తమ వాహనాలను పిట్టంపల్లి రోడ్డులోని ఎంఎన్ఆర్ గార్డెన్స్ సమీపంలో నిలిపేలా స్థలం రెడీ చేశారు.
దేవరకొండ, మునుగోడు వైపు నుంచి నల్లగొండ పట్టణంలో నుంచి వచ్చే వారు లక్ష్మీ గార్డెన్ సమీపంలోని ఎల్లమ్మ గుడి దగ్గర ఎదురుగా స్థలంలో.. సూర్యాపేట, మిర్యాలగూడ వైపుల నుంచి వచ్చే వాహనాదారులు సభ సమీపంలోనే అద్దంకి-నార్కట్ పల్లి రోడ్డుకు ఇరువైపులా(ఐకేపీ సెంటర్లో) వాహనాలు పెట్టే విధంగా పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం కేటాయించిన స్థలాల్లో వాహనాలను పార్క్ చేసి సభా స్థలానికి చేరుకోవాలని నిర్వాహకులు సూచిస్తున్నారు.
మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి ఏడెనిమిది గంటల వరకు నార్కట్పల్లి-అద్దంకి రహదారి సభకు వచ్చి వెళ్లే వాహనాలతో తీవ్ర రద్దీగా మారనుంది. ఈ రూట్లో ప్రయాణించాలనుకునే సాధారణ వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లో వెళితే మంచిదని సభ నిర్వాహకులు సూచిస్తున్నారు. నార్కట్పల్లి వైపు నుంచి నల్లగొండ మీదుగా వెళ్లాలనుకునే వారు వయా నకిరేకల్, తిప్పర్తి మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. మిర్యాలగూడ వైపు నుంచి నల్లగొండ మీదుగా నార్కట్పల్లి వైపు వెళ్లాలనుకునే వారు వయా తిప్పర్తి, నకిరేకల్ మీదుగా నార్కట్పల్లికి వెళ్లాలని సూచిస్తున్నారు. సభకు వచ్చే వాహనాలతో నార్కట్పల్లి- అద్దంకి హైవే పూర్తిగా రద్దీగా మారనున్న నేపథ్యంలో ఇతర ప్రత్యామ్యాయ మార్గాలను ఎంచుకోవాలని నల్లగొండ జిల్లా పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. సభకు 500 మంది పోలీసులతో బందోబస్తు చేపట్టినట్లు డీఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు.
సభా ఏర్పాట్లను మాజీ మంత్రి జగదీశ్రెడ్డ నేతృత్వంలో జిల్లా నేతలు పర్యవేక్షిస్తున్నారు. సోమవారం రోజంతా స్థానిక, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డితో కలిసి ఆయన సభా ఏర్పాట్లలో బిజీబిజీగా గడిపారు. వారితోపాటు ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్కుమార్, చిరుమర్తి లింగయ్య, ఎ.జీవన్రెడ్డి, క్రాంతికిరణ్, పార్టీ నేతలు గ్యాదరి బాలమల్లు, బీఆర్ఎస్ నల్లగొండ ఇన్చార్జి రవీంద్ర సింగ్, రాష్ట్ర నాయకుడు గుత్తా అమిత్ రెడ్డి వంటి కీలక నేతలంతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. సభకు వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు ఆ సందర్భంగా జగదీశ్రెడ్డి వివరించారు.