సూర్యాపేట టౌన్, ఫిబ్రవరి 5 : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పొగరుబోతుతనం తగ్గించుకుంటే మంచిదని, బాధ్యతాయుతమైన పదవిలో ఉండి వీధి రౌడీలా ప్రవర్తిస్తున్న ఆయన తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు అన్నారు. తెలంగాణ జాతిపిత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై సీఎం రేవంత్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ సూర్యాపేట పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ శ్రేణులు సోమవారం నిరసన తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై సీఎం రేవంత్రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు యావత్ తెలంగాణ సిగ్గుపడుతుందన్నారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని, రేవంత్ ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదని పేర్కొన్నారు. కేసీఆర్ కృషితో నేడు తెలంగాణలో కోట్ల టన్నుల ధాన్యం పండుతుందని, కాళేశ్వరం రూపుదిద్దుకొని సూర్యాపేట నియోజకవర్గంలోని చివరి గ్రామానికి కూడా నీరందుతుందని, లక్షలాది ఎకరాలు సాగవుతున్నాయని తెలిపారు. రైతుబంధు ఇవ్వలేదు, రుణమాఫీ చేయలేదు.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు ఆర్టీసీపై మోపారని ఎద్దేవా చేశారు.
చేతకాకుంటే ప్రజలకు క్షమాపణ చెప్పి తప్పుకోవాలని, తమ నాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రజలు మీ నాటకాలను గమనిస్తున్నారని, రేవంత్రెడ్డి 420 అని, ఆయన అడ్డగోలు వ్యాఖ్యలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చుతామని తమ పార్టీ నాయకులెవరూ అనలేదని, హామీలు అమలు చేయకుంటే నీ పీటం ఎక్కడ కదులుతుందోనని భయపడి మాట్లాడుతున్నావని పేర్కొన్నారు.
ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, కౌన్సిలర్ చింతలపాటి భరత్ మహజన్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సవరాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి బూర బాలసైదులు, నాయకులు లవకుశ, రమేశ్, జానీ, నాగయ్య, వేణుగౌడ్, రవి, అంజమ్మ, మహేశ్వరి, కరుణశ్రీ, విజయ, వేణుగోపాల్రెడ్డి, నరేందర్, రఫీ, కార్యకర్తలు పాల్గొన్నారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ భువనగిరిలోనూ బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, జడ్పీటీసీ బీరు మల్లయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆంజనేయులు, నాయకులు పాల్గొన్నారు.