సూర్యాపేట, జూన్ 1 (నమస్తే తెలంగాణ) : యజ్ఞయాగాదులు, దేవాలయాల నిర్మాణాలతో సనాతన ధర్మాన్ని కాపాడుతూనే అన్ని మతాలను గౌరవించే ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయా మతాలు, వర్గాలకు వందల కోట్లు వెచ్చిస్తున్నారు. తాజాగా హైదరాబాద్లో బ్రాహ్మణ సదనం ప్రారంభోత్సవం చేసిన ముఖ్యమంత్రి బ్రాహ్మణ సమాజానికి అనేక వరాలు ప్రకటించారు. సూర్యాపేటలో పూర్తి కావచ్చిన బ్రాహ్మణ సదనాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని ప్రకటించడం పట్ల ఈ ప్రాంత బ్రాహ్మణులు హర్షం
వ్యక్తం చేస్తున్నారు. మంత్రి జగదీశ్రెడ్డి చొరవతో సూర్యాపేటలో అన్ని మతాలకు సమాన గౌరవం దక్కుతున్నది. హిందూ దేవాలయాలతోపాటు మసీదులు, చర్చిలకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారు. అందులో భాగంగా పట్టణానికి చెందిన డాక్టర్ ఎ.రామయ్య దురాజ్పల్లి సమీపంలో బ్రాహ్మణ సదన్ భవన నిర్మాణానికి ఎంతో విలువైన ఎకరం భూమిని విరాళంగా ఇచ్చారు.
అందులో ప్రభుత్వం రూ.2.50 కోట్లతో బ్రాహ్మణ సదన్ నిర్మాణం చేపడుతున్నది. దీనికి తొలుత రూ.2 కోట్లు మంజూరు చేయగా.. భవన నిర్మాణం పూర్తయింది. పెద్ద హాల్తోపాటు వంట గది, అటాచ్డ్ బాత్రూములతో రెండు గదుల నిర్మాణం పూర్తయ్యాయి. మంత్రి జగదీశ్రెడ్డి మరో రూ.50 లక్షలు మంజూరు చేయించగా మొదటి అంతస్తు నిర్మాణం పనులు చేస్తున్నారు. ఇది పూర్తయితే రోడ్డు మార్గం ద్వారా వెళ్లే పీఠాధిపతుల వసతికి వినియోగించడం, ధర్మగోష్టులు నిర్వహించడం చేస్తారు. అలాగే బ్రాహ్మణుల వివాహాలు, ఉపనయనాల కార్యాలకు తక్కువ చార్జితో ఇవ్వనున్నారు. బ్రాహ్మణ సదన్ నిర్మాణంపై సూర్యాపేట ప్రాంత బ్రాహ్మణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.