నల్లగొండ :జిల్లా కేంద్రంలో ఆదివారం విషాద సంఘటన చోటుచేసుకుంది. ఏఎంఆర్పీ(ఎనిమినేటి మాదవరెడ్డి ప్రాజెక్టు) కెనాల్లో మునిగి ఓ బాలుడు మృతిచెందగా మరో బాలుడు గల్లంతయ్యాడు. బాధితులిద్దరిని సోదరులు కె. చందు(10), నందు(8)గా గుర్తించారు.
నల్లగొండ పట్టణ శివారులోని సూర్యానగర్ కాలనీకి చెందిన రాంబాబు అనే వ్యక్తి కుమారులు వీరు. అంత్యక్రియల అనంతరం గంగాస్నానం ఆచరించే నిమిత్తం కొంతమంది వ్యక్తులు ఆర్జాలబావి సమీపంలోని కాలువకి వెళ్లారు. అక్కడ బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలుడిని గుర్తించేందుకు ఫోటోను వాట్సప్ గ్రూప్లో షేర్ చేశారు. బాలుడి చందు తల్లిదండ్రులు పోలీసులను చేరి మృతుడిని తమ కుమారుడిగా తెలిపారు. కాగా మరో కుమారుడు కూడా కనిపించకుండా పోయాడని తెలిపారు.
దీంతో పోలీసులు కాలువలో గల్లంతైన బాలుడు ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భవన నిర్మాణ కూలీలుగా పనిచేస్తున్న తల్లిదండ్రులు పిల్లలను ఇంట్లోనే వదిలి పనికి వెళ్లినప్పుడు ఈ విషాదం చోటుచేసుకుంది. నల్లగొండ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.