– నల్లగొండ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం.ఏ. హఫీజ్ ఖాన్
రామగిరి, ఫిబ్రవరి 04 : ఉర్దూ భాష, సాహిత్య అభివృద్ధికి పుస్తకాలు ప్రధాన ఆధారం అని నల్లగొండ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం.ఏ. హఫీజ్ ఖాన్ అన్నారు. షబ్-ఇ-బరాత్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఉర్దూ భాషాభిమానులు, ఉర్దూ ఉపాధ్యాయులతో కలిసి ఆయన తన నివాసంలో ఉర్దూ భాషా–సాహిత్య పరిరక్షణకు చేపట్టవలసిన చర్యలపై బుధవారం సమాలోచనలు చేశారు. ఈ సందర్భంగా ఉర్దూ భాషాభిమానులు ఉర్దూ రచయితలు ఉర్దూ మాధ్యమంలో చదివే విద్యార్థులకు అవసరమైన ఉర్దూ పుస్తకాలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాలని చైర్మన్ను కోరారు. దినపై స్పందించిన చైర్మన్ హఫీజ్ ఖాన్ విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు గ్రంథాలయాల ద్వారా ఉర్దూ పుస్తకాలను మరింత అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు.ఉర్దూ పుస్తకాలు భాషా నైపుణ్యాలను పెంపొందించడమే కాకుండా నైతిక విలువలు, సాంస్కృతిక వారసత్వాన్ని తరతరాలకు అందిస్తున్నాయని ఆయన అన్నారు.
జిల్లాలోని అన్ని గ్రంథాలయాల్లో ఉర్దూ పుస్తకాల విభాగాన్ని బలోపేతం చేయడంతో పాటు, పాఠశాల విద్యార్థులకు అనుకూలమైన ఉర్దూ పుస్తకాలను అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రభుత్వ సహకారంతో పాటు దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఉర్దూ పుస్తకాల అభివృద్ధికి తోడ్పడాలని ఈ సందర్భంగా హఫీజ్ ఖాన్ కోరారు. గ్రంథాలయాలు జ్ఞాన కేంద్రాలుగా మరింత బలోపేతం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎండి. హుస్సాముద్దీన్, బషారత్ అలీ బాఖర్, టీఎస్పీకే జిల్లా అధ్యక్షుడు ఎం.ఏ.గఫూర్, ప్రధాన కార్యదర్శి ఎండి.షాహిన్ తయ్యాబ్, మహిళా ప్రతినిధులు ఫాతీమా జహీరా, సమీనా బేగం, నాజియా నూరిన్ పాల్గొన్నారు.