రామన్నపేట, డిసెంబర్ 13: ప్రజల్లో వైషమ్యాలు సృష్టించే బీజేపీ విధానాలను ప్రజలు తిప్పికొట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపు నిచ్చారు. మంగళవారం మండలంలోని అమృతవనంలో ఏర్పాటు చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశాన్ని అగాధంలోకి నెట్టే విధానాలను అవలంబిస్తున్న మోదీ సర్కారుకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్మించాలన్నారు. గుజరాత్లో గ్రామీణ స్థాయిలో మత విద్వేషాలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిందే తప్ప ప్రజలకు సుపరిపాలన అందించి కాదని అన్నారు.
హిమాచల్ప్రదేశ్, ఢిల్లీ ఎన్నికల్లో మత విద్వేషాల పాచిక పారలేదన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని ఉపయోగించుకొని రాజకీయాలు చేసే గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలన్నారు. అంతకు ముందు శిక్షణ తరగతుల ప్రారంభ సూచికగా మేక అశోక్రెడ్డి జెండాను ఆవిష్కరించారు.
కల్లూరి మల్లేశం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్, కొండ మడుగు నర్సింహ, బుట్టపల్లి అనురాధ, దోనూరి నర్సిరెడ్డి, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, దాసరి పాండు, పెంటయ్య, వెంకటేశం, ఉపేందర్, కృష్ణారెడ్డి, రాజయ్య, నర్సింహాచారి, మీర్ఖాజాఅలీ, ఆనంద్ పాల్గొన్నారు.