హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ) : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన బీజేపీ దూతల ఆడియో మునుగోడు బీజేపీలో గత్తరలేపింది. ఆ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సహా ఆయన అనుచరగణం ఒక్కసారిగా కుప్పకూలింది. మునుగోడులో బీజేపీకి డిపాజిట్ కష్టమేనని తేలిపోయింది. ‘ప్చ్..ఇగ రాజగోపాల్ ఖేల్ ఖతమ్ అని శుక్రవారం ఏ ఇద్దరు కలిసినా ఆడియోపైనే చర్చించుకున్నారు. తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్టు రాజగోపాల్రెడ్డి ఒకటి అనుకుంటే బీజేపీ మరొకటి చేసిందని ఎక్కడ విన్నా ఇదే ముచ్చట. రాజగోపాల్రెడ్డికి రాజకీయ జీవితం ఇక సమాధేనని మునుగోడు తేల్చివేస్తున్నది. శుక్రవారం మధ్యాహ్నం టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి, రామచంద్రభారతి, నందకుమార్ జరిపిన మొదటి ఆడియో… రామచంద్రభారతి, సింహయాజులు, నందకుమార్ రెండో ఆడియో మునుగోడు చెవిన మార్మోగింది. బాహుబలి -1, బాహుబలి- 2 మాదిరిగా రెండు దశలుగా విడుదలైన బీజేపీ కొనుగోలు ఆడియోలు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని బలిపీఠంపై ఎక్కించాయని మునుగోడు ప్రజలు నిర్ధ్దారణకు వచ్చేశారు.
ప్రజల చేతిలో రాజగోపాల్రెడ్డికి ఎన్నికల్లో శిక్షతప్పదని, ఆయనెంత పాకులాడినా మూడోస్థానమేనని మునుగోడు డిసైడ్ అయింది. ఒక్కరోజే రెండు ఆడియోలు విడుదల కావడం.. ఆ రెండింటితోనే ఆగవు.. ఇంకా బలమైన ఆయుధాలు టీఆర్ఎస్ అమ్ములపొదిలో ఉన్నట్టున్నాయని సాక్షాత్తు బీజేపీ నేతలే అనుమానిస్తున్నారు. ఇప్పటి దాకా ఒక ఎత్తు, ఇప్పటి నుంచి ఒక ఎత్తుగా జాగ్రత్తగా వ్యవహరిస్తేనే మూడో స్థానం దక్కుతుంది, లేదంటే అది కూడా పోయి ఆఖరికి డిపాజిట్ వస్తదోరాదోననే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.