టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో గురువారం ఉమ్మడి జిల్లాకు బీజేపీ కీలక నాయకులు టీఆర్ఎస్లో చేరారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, చౌటుప్పల్ మూడు, ఆరో వార్డు కౌన్సిలర్లు బండమీది మల్లేశం, ఆలె నాగరాజుతోపాటు కాంగ్రెస్ పార్టీ నుంచి మర్రిగూడ మాజీ ఎంపీపీ అనంతరాజుగౌడ్ గులాబీ కండువా కప్పుకొన్నారు.
నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ) : అల్లకల్లోలం అనే పదానికి మారుపేరుగా మారింది మునుగోడులో బీజేపీ పరిస్థితి. ఏండ్ల తరబడి సిద్ధాంతాన్ని నమ్ముకుని, పార్టీని పట్టుకుని ఉనికి కాపాడుకుంటూ వస్తున్న శ్రేణులకు ప్రస్తుత పరిస్థితులు మింగుడుపడడం లేదు. పార్టీ కార్యకర్తల నమ్మకాన్ని ఉప ఎన్నికల కోసం కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి పార్టీ అధినాయకత్వం తాకట్టుపెట్టిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటప్పుడు పార్టీలో ఉండడం ఎందుకంటూ కీలక నేతలంతా బీజేపీకి రాంరాం చెబుతున్నారు.ఇప్పటికే పెద్ద సంఖ్యలో పలు మండలాల అధ్యక్ష, కార్యదర్శులు, ప్రజాప్రతినిధులంతా టీఆర్ఎస్లో చేరారు. తాజాగా మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో తెలంగాణ భవన్లో బీజేపీ, అనుబంధ సంఘాల ముఖ్యనేతలు, కార్యకర్తలు గురువారం టీఆర్ఎస్లో చేరారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి రాజగోపాల్రెడ్డి వెంట బీజేపీలోకి వెళ్లిన కీలక నేతలు సైతం అక్కడ ఇమడలేక గులాబీ కండువా కప్పుకొంటున్నారు.
రాజగోపాల్రెడ్డి ప్రధాన అనుచరుడు, మునుగోడు మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు జూనియర్ పాల్వాయి గోవర్ధన్రెడ్డితోపాటు ఐతగోని విజయ్ మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. రాజగోపాల్రెడ్డి చెబుతున్న కల్లబొల్లి మాటలను ప్రజలు నమ్మడం లేదని, టీఆర్ఎస్తోనే మునుగోడు అభివృద్ధి సాధ్యమంటూ పార్టీలో చేరిన వారు ప్రకటిస్తున్నారు. పోలింగ్కు పక్షం రోజుల ముందే మునుగోడులో టీఆర్ఎస్కు విజయం ఖాయమైందని, సొంత కాంట్రాక్టుల కోసం ఉప ఎన్నికలను తెచ్చిపెట్టిన రాజగోపాల్రెడ్డికి భారీ ఓటమి తప్పదంటూ మంత్రి జగదీశ్రెడ్డి స్పష్టం చేశారు.
పోలింగ్కు సమయం దగ్గర పడుతున్నా కొద్దీ మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ ఖాళీ అవుతూవస్తుంది. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాకతోపాటు ఆయన వ్యవహారశైలితో గతంలో ఇక్కడి నుంచి పోటీచేసిన పార్టీ నేత గంగిడి మనోహర్రెడ్డి అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. కేవలం బండి సంజయ్ రోడ్షోలను మాత్రమే పర్యవేక్షిస్తూ తన బాధ్యత ఇంతే అంటూ ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ఇక్కడ పార్టీకి ఆది నుంచి కీలకంగా ఉన్న మనోహర్రెడ్డి పరిస్థితినే ఇలా ఉంటే, భవిష్యత్లో తమ పరిస్థితి ఏంటన్న మదనం పార్టీ శ్రేణుల్లో ఉంది. ఈ పరిస్థితిలో పార్టీలో ఉండడం ఎందుకున్న ధోరణికి వచ్చేశారు. ఇదే సమయంలో రాజగోపాల్రెడ్డి చెబుతున్న అభివృద్ధి మాటలన్నీ బూటకమేనని బీజేపీ పాత క్యాడరంతా బహిరంగంగానే ఎత్తిచూపుతున్నారు. కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా ఉండి చేయలేని అభివృద్ధి ఉప ఎన్నికలో గెలిచి ఎలా చేస్తారు? అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే బీజేపీ శ్రేణులంతా అంతర్మథనంలో పడిపోయారు. మునుగోడులో ఫ్లోరైడ్ సమస్య పరిషారంతోపాటు శివన్నగూడెం రిజర్వాయర్ నిర్మాణం, రహదారుల విస్తరణ లాంటి అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు సైతం టీఆర్ఎస్ హయాంలోనే జరుగుతుండడంతో బీజేపీ శ్రేణులు ఆలోచనలో పడ్డాయి.
2018లోనే ఇక్కడ పొరపాటున రాజగోపాల్రెడ్డి గెలిచారని, ప్రస్తుత ఉప ఎన్నికలో మాత్రం టీఆర్ఎస్ గెలిస్తేనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమంటూ బలంగా విశ్వసిస్తున్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ అభివృద్ధి నినాదంతోపాటు ఇటీవల చండూరులో కేటీఆర్ చేసిన మునుగోడు దత్తత ప్రకటన కూడా మరింత ఆకర్షణీయంగా మారింది. ఇదే సమయంలో జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి తనదైన శైలిలో చక్రం తిప్పుతుండడంతో నిత్యం పెద్దసంఖ్యలో బీజేపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారు. ఇప్పటికే మర్రిగూడ, మునుగోడు మండలాల అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో అనుబంధ సంఘాల నేతలు మూకుమ్మడిగా టీఆర్ఎస్లో చేరారు. మరోవైపు ఇటీవలే రాజగోపాల్రెడ్డితోపాటు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన కీలక నేతలు సైతం టీఆర్ఎస్ బాట పట్టారు. మునుగోడుకు చెందిన కీలక నేతలు పాల్వాయి గోవర్ధన్రెడ్డి, ఐతగోని విజయ్గౌడ్ మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. దాంతో మునుగోడు నియోజకవర్గంలో ఓ వైపు పాత బీజేపీ అంతా ఖాళీ అవుతుండగా ఇన్నాళ్లు రాజగోపాల్రెడ్డిని వ్యక్తిగతంగా నమ్ముకున్న ముఖ్యులు సైతం గులాబీ కండువా కప్పుకుంటుండడం విశేషం. ప్రస్తుతం బీజేపీలో జరుగుతున్న పరిణామాలను బట్టి పోలింగ్ నాటికి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి తీవ్ర ప్రతికూల పరిస్థితులు తప్పవని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ శ్రేణులు సైతం పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్లోకి వస్తున్నారు. గురువారం మంత్రి జగదీశ్రెడ్డి కాంగ్రెస్ నేతలకు, ప్రజాప్రతినిధులకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చేరికల్లో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, పార్టీ నేత వేమిరెడ్డి నర్సింహారెడ్డి, సూర్యాపేట జడ్పీ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, టీఆర్ఎస్ నేత నారబోయిన రవిముదిరాజ్, పల్లె రవిగౌడ్ కీలకపాత్ర పోషించారు.
కూసుకుంట్ల సమక్షంలో..
గట్టుప్పల్ : మండలంలోని కమ్మగూడెంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మద్ది లింగయ్య, చిన్నబత్తిని జోజప్ప, అగస్తినమ్మ, అడ్డగట్ల బాలశౌరి, అడ్డగట్ల భార్గమ్మ, మాదాసు నూర్తయ్య, మేరమ్మ, ఆరోగ్యయ్య, నూర్తమేరి ఆంతోని, పర్లయ్య టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి ఆయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
మునుగోడు మండలం నుంచి..
మునుగోడు రూరల్ : రాజగోపాల్రెడ్డికి మునుగోడులో బిగ్షాక్ తగిలింది. ఆయన ప్రధాన అనుచరుడు, కాంగ్రెస్ పార్టీ మాజీ మండలాధ్యక్షుడు ఇటీవల రాజగోపాల్రెడ్డితో బీజేపీలో చేరిన జూనియర్ పాల్వాయి గోవర్ధన్రెడ్డి, ఐతగోని విజయ్ తిరిగి గురువారం మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో హైదరాబాదులో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వేమిరెడ్డి నరసింహారెడ్డి, సూర్యాపేట జడ్పీ వైస్ చైర్మన్ వెంకట్ నారాయణగౌడ్ పాల్గొన్నారు.
పథకాలకు ఆకర్షితులై చేరికలు : ఎమ్మెల్సీ
నాంపల్లి : టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గురువారం మండలంంలోని రెవెల్లిలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఉప సర్పంచ్ మన్నెమోని వెంకటయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తుమ్మలపల్లి మధుసూదన్రెడ్డి, తుమ్మలపల్లి నర్సిరెడ్డి, యువ నాయకులు బట్టు గిరి, ఏటవల్లి హరికృష్ణ, ఏటవల్లి మహేశ్ సర్పంచ్ తుమ్మలపల్లి హర్షితాగోపాల్రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
టీఆర్ఎస్లో చేరింది వీరే..
బీజేపీ మునుగోడు నియోజకవర్గ ప్రచార కార్యదర్శి బండారు యాదయ్య, ఓబీసీ జిల్లా సంయుక్త కార్యదర్శి మాదగోని నరేందర్ గౌడ్, మైనార్టీ జిల్లా అధ్యక్షుడు ఎండీ మాజిద్, బీజేవైఎం జిల్లా కార్యదర్శి పందుల రాజేశ్, దళిత మోర్చా నియోజకవర్గ కన్వీనర్ నీరుడు రాజారామ్, మహిళా మోర్చా మండలాధ్యక్షురాలు ముచ్చపోతుల స్రవంతి, దళిత మోర్చా జిల్లా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, మండల కార్యదర్శి జీడిమెట్ల రమేశ్ టీఆర్ఎస్లో చేరారు. ఇక చండూర్ మండలం నుంచి చండూర్ మాజీ ఎంపీటీసీ తిరందాసు అనితాఆంజనేయులు, శేరిగూడెం బీజేపీ ఉప సర్పంచ్ పంకర్ల వెంకటేశ్, వార్డు సభ్యుడు పంకెర స్వామి, మర్రిగూడ మండలం లెంకలపల్లి నుంచి సర్పంచ్ పాక్ నగేశ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పగిళ్ల రాజశేఖర్, ఆ పార్టీ సీనియర్ నాయకుడు బోడ భిక్షం, వడ్డెర సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి వరికుప్పల వెంకటేశం, ముదిరాజ్ గ్రామ సంఘం అధ్యక్షుడు దాసరి వెంకన్న, గౌడ సంఘం కోశాధికారి కర్నాటి శ్రీను, దాసరి లింగయ్య, కోటగోని రమేశ్, ముది స్వామి, దాసరి కుమార్, వరికుప్పల ప్రసాద్, కొంగల నవీన్, పగిళ్ల హరీశ్, జంపాల ఆంజనేయులు, శివన్నగూడెం నుంచి రాష్ట్ర వడ్డెర సంఘం అధ్యక్షుడు శివరాత్రి ఐలమల్లు, ఎంపీటీసీ గండికోట హరిక్రిష్ణ, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు నూనెకొలుపుల పెద్దులుయాదవ్, నారాయణపురం, మర్రిగూడ మండలాల్లోని వడ్డెర సంఘం, బీజేపీ, కాంగ్రెస్ నుంచి 100 మంది కార్యకర్తలు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
ఎమ్మెల్యే శంకర్నాయక్ సమక్షంలో..
సంస్థాన్ నారాయణపురం : పల్లగట్టుతండా 4వ వార్డు సభ్యుడు కేలోత్ శంకర్, నాయకుడు కేలోత్ సక్రూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి స్థానిక ఎంపీటీసీ కేలోత్ నరేశ్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.
ఎమ్మెల్యే బాపురావు సమక్షంలో..
గట్టుప్పల్ : మండలంలోని అంతంపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వీరమల్ల వెంకటేశ్ తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్లో చేరగా వారికి ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుగులాబీ కండువా కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మల్యే మాట్లాడుతూ.. 2018 ఎన్నికల్లో మాయమాటలు చెప్పి గెలిచి ఏమాత్రం అభివృద్ధి చేయకపోగా, ఇప్పుడొచ్చి గెలిపిస్తే అభివృద్ధి చేస్తానంటే ఎట్లా నమ్మాలని ప్రజలంతా ప్రశ్నిస్తున్నారన్నారు. కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు ఐతరాజు హనుమంతు, సర్పంచ్ మాదగోని శేఖర్గౌడ్, ఎంపీటీసీ నేనావత్ బంతిలాల్, మాజీ ఉప సర్పంచ్ వీరమళ్ల రాజుగౌడ్, డైరెక్టర్ మాతంగి రాములు, టీఆర్ఎస్వీ మర్రిగూడ మండలాధ్యక్షుడు సురిగి సందీప్, మాదగోని జంగయ్య, తోకల నర్సింహ, మాతంగి నరేందర్, ఇస్తారి, ఐతరాజు స్వామి, సురిగి రాఘవేందర్, దండిగ శంకర్, ఐతరాజు శివ, ఎట్టయ్య, మల్లయ్య, రాజు పాల్గొన్నారు.
బీజేపీ కోవర్టులు.. అభివృద్ధి నిరోధకులు : మంత్రి జగదీశ్రెడ్డి
కోమటిరెడ్డి బ్రదర్స్ బీజేపీ కోవర్టులు.. అభివృద్ధి నిరోధకులు. వారి గురించి ప్రజలు పూర్తిస్థాయిలో అర్థం చేసుకుంటున్నారు. రాజ్గోపాల్రెడ్డి మూడేండ్లుగా బీజేపీతో టచ్లో ఉన్నానని పలు సందర్భాల్లో ఒప్పుకున్నాడు. ఇక ఆయన అన్న వెంకట్రెడ్డి కాంగ్రెస్లో ఉంటూ బీజేపీకి కోవర్టుగా పనిచేస్తున్నాడు. ఈ ఉప ఎన్నిక రాజ్గోపాల్ అవసరం కోసమే తప్ప, నియోజకవర్గ అభివృద్ధి కోసం కాదు. రాజగోపాల్రెడ్డికి రూ.18వేల కోట్ల కాంట్రాక్టు కట్టబెట్టి బీజేపీ ఆడుతున్న నాటకం ఇది. ఈ విషయం తెలిసో, తెలియకో మొదట కొందరు బీజేపీలో చేరారు. తర్వాత విషయం తెలుసుకొని తిరిగి టీఆర్ఎస్లో చేరుతున్నారు.
టీఆర్ఎస్లోకి 40 కుటుంబాలు..
మునుగోడు రూరల్ : మండలంలోని చొల్లేడులో వివిధ పార్టీలకు చెందిన 40 కుటుంబాలు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సమక్షంలో గురువారం టీఆర్ఎస్లో చేరారు. అనంతరం చెల్లెలు సోలిపురం గ్రామాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ జనిగల మహేశ్వరీసైదులు, ఎంపీటీసీ నిర్మలాయాదయ్య, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బుడిగపాక ఏసు, భూపాలపల్లి జడ్పీటీసీలు సదయ్య, తిరుపతిరెడ్డి, ఎంపీపీ మల్లారెడ్డి పాల్గొన్నారు.