నాంపల్లి డిసెంబర్ 28 : సీపీఐ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా ఈనెల 27న మండలంలోని తుంగపహాడ్లో పార్టీ జెండాను ఆవిష్కరించడానికి వచ్చిన సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యంపై బీజేపీ నాయకులు దాడి చేశారు. జెండా ఆవిష్కరణ అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు మాట్లాడుతుండగా బీజేపీ నాయకులు ప్రభుత్వం యాదవులకు సంబంధించిన గొర్రెల పైసలు వేసి అకౌంట్లను ఫ్రీజ్ చేసి ఇబ్బంది పెడుతున్నదని ఆరోపించారు. దాంతో నారాయణరావు స్పందిస్తూ కలెక్టర్కి వినతి పత్రం అందజేశామని, త్వరలో అకౌంట్లపై ఫ్రీజ్ తొలగిస్తారని తెలిపారు. అనంతరం నెల్లికంటి సత్యం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలతో పాటు నిత్యావసర ధరలను పెంచి ప్రజలను ఇబ్బంది పెడుతున్నదని మాట్లాడుతుండగా గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు నేతళ్ల కొండల్, నేతళ్ల నరేశ్, కాశిరెడ్డి మహేశ్ దాడికి దిగారు. ఎంత నిలువరించినా వినకపోవడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి వచ్చి గొడవను అడ్డుకున్నారు. అనంతరం సీపీఐ నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
వామపక్షాల రాస్తారోకో
బీజేపీ నాయకుల దాడిని నిరసిస్తూ గురువారం నాంపల్లిలో సీపీఐ, సీపీఎం నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం మాట్లాడుతూ మునుగోడు ఉపఎన్నికలో బీజేపీకి మద్దతు ఇవ్వనందుకే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అనుచరులు తమపై దాడులు చేశారని ఆరోపించారు. వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు యువతకు మద్యం తాపించి రెచ్చగొట్టి దాడులకు ఉసిగొల్పుతున్నారని, వారి మాయమాటలు నమ్మి యువత జీవితాన్ని నాశనం చేసుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అంజాచారి, మహిళా సమాఖ్య జిల్లా కన్వీనర్ గిరి రమణ, సీపీఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షుడు బుషిపాక జగన్, సీపీఐ మండల కార్యదర్శి సుందనబోయిన రమేశ్ పాల్గొన్నారు.