రామగిరి, మార్చి 8 : విద్యకు ప్రాధాన్యత కల్పిస్తున్న సర్కార్. ఆ దిశగా అనేక చర్యలు చేపడుతున్నది. అందులో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది హాజరుశాతం పెంచడమే లక్ష్యంగా 1 ఫిబ్రవరి, 2023 బయోమెట్రిక్ హాజరుకు ఇంటర్మీడియేట్ విద్యాశాఖ చర్యలు తీసుకుంది విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలతో అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు నూతన ఆధునిక టెక్నాలజీతో అనుసంధానం చేసిన బయో మెట్రిక్ మిషన్లు అందజేశారు.
సమయ పాలనపై దృష్టి
అధ్యాపకులతోపాటు బోధనేతర సిబ్బంది సమయపాలనపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. 2016-17 సంవత్సరంలోనే విద్యార్థులతోపాటు అందరికీ బయోమెట్రిక్ విధానం అమలు చేసినప్పటికీ సాంకేతిక కారణాలతో ముందుకు సాగలేదు. వాటిలోని సమస్యలకు పరిష్కారం చూపుతూ ఆధునిక టెక్నాలజీతో కొత్త మిషన్లతో ప్రభుత్వం జూనియర్ కళాశాలలో గత నెల నుంచే బోధన, బోధనేతర సిబ్బందికి ఫిబ్రవరి, 2023 నుంచి బయోమెట్రిక్ హాజరుకు అమలుకు శ్రీకారం చుట్టింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 30 కళాశాలల్లో 675 మంది బోధన, బోధనేతర సిబ్బంది నిత్యం హాజరు వేస్తుండడంతో సత్ఫలితాలనిస్తున్నది.
పెరుగుతున్న హాజరు శాతం
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగాప్రభుత్వ జూనియర్ కళాశాలలో బయోమెట్రిక్ హాజరు విజయవంతంగా కొనసాగుతున్నది. అధ్యాపకులు ప్రతి రోజూ 6 గంటల సమయం కళాశాలలోనే ఉం డాల్సి ఉంటుంది. అంతకు తక్కువ సమయంలో బయోమెట్రిక్ వేస్తే ఒక పుటగానే మిషన్ స్వీకరిస్తున్నది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బయోమెట్రిక్ హాజరు విధానం అమలులోకి తీసుకురావడంతో బోధన, బోధనేతర సిబ్బంది సమయపాలనతోపాటు హాజరు శాతం పెరిగినట్లు అధికారులు తెలిపారు. గతంలో ఆలస్యంగా వచ్చిన రిజిస్ట్రార్లో సంతాకం చేసేవారు. కానీ ప్రస్తుతం అలాంటి అవకాశం లేకపోవడంతో కచ్చితంగా అంతా ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు సమయం కేటాయిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళాల్లో హాజరు వేస్తున్నారు.