విద్యా వ్యవస్థను పటిష్టం చేసి విద్యార్థులకు మెరుగైన బోధన అందించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా స్కూళ్లల్లో బోధన, బోధనేతర సిబ్బందికి బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టింది. సూర్యాపేట జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా అన్ని ప్రభుత్వ స్కూళ్లలో బయోమెట్రిక్ హాజరును అమలు చేస్తున్నారు. అది విజయవంతం కావడంతో అక్టోబర్ నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కస్బూర్బా పాఠశాలల్లో ప్రవేశపెట్టారు. సమయానికి సిబ్బంది రావడంతోపాటు సెలవులు, ఇతర విషయాలను ఉన్నతాధికారులు సులువుగా తెలుసుకోవచ్చు.
రామగిరి, నవంబర్ 4 : సర్కారు విద్యకు ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. పాఠశాలల బలోపేతానికి చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా సిబ్బంది హాజరు పారదర్శకంగా ఉండేలా చూస్తున్నది. ఈ క్రమంలో బాలికల విద్య కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో బోధన, బోధనేతర సిబ్బంది సమయపాలన పాటించేలా బయోమెట్రిక్ హాజరుకు రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 59 కస్తూర్బా పాఠశాలలకు బయోమెట్రిక్ అటెండెన్స్ డివైజ్లను అందజేసింది. అందులోనే లీవ్, సిక్ లీవ్, ఓడీ, స్పెషల్ హాలిడే ఆప్షన్లు సైతం నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అయితే.. నిమిషం ఆలస్యమైనా రెడ్ మార్క్ పడుతుంది. ఇప్పటికే సూర్యాపేట జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో బయోమెట్రిక్ హాజరును పైలెట్ ప్రాజెక్టు కింద అమలు చేస్తున్నారు.
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో పని చేస్తున్న బోధనా సిబ్బంది, ప్రత్యేక అధికారులు, పీజీ సీఆర్టీలు, సీఆర్టీలు, పీఈటీలు, ఏఎన్ఎంలకు బయోమెట్రిక్ హాజరును ఈ విద్యా సంవత్సరం అక్టోబర్ నుంచి అమలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన యంత్రాలను ఆయా పాఠశాలలకు అందజేశారు. ఉదయం బడికి వెళ్లగానే తిరిగి సాయంత్రం పాఠశాల ముగిశాక బయోమెట్రిక్ హాజరు వేయాలి. ఇందుకు కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్ అఫీషియో స్టేట్ ప్రాజెక్టు షెడ్యూల్ విడుదల చేయడంతో జిల్లాల వారీగా డీఈఓ అండ్ ఎక్స్ అఫీషియో డీపీఓ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో రంగం సిద్ధం చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో 59 కేజీబీవీలు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 59 కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలు ఉన్నాయి. ఇందులో నల్లగొండలో 27, సూర్యాపేటలో 18, యాదాద్రి భువనగిరి జిల్లాలో 14 పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో 654 మంది బోధన, ప్రత్యేక అధికారులు, పీఈటీలు, ఏఎన్ఎంలు, 616 మంది బోధనేతర సిబ్బంది పని చేస్తున్నారు. వీరంతా ప్రస్తుతం పని చేస్తున్న పాఠశాలల్లో నిత్యం బయోమెట్రిక్ హాజరు వేస్తున్నారు.
సర్కార్ బడుల్లోనూ ఇదే విధానం
రాష్ట్ర వ్యాప్తంగా 14 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా బయోమెట్రిక్ హాజరు విధానం విజయవంతంగా అమలవుతున్నది. ఇందులో భాగంగా సూర్యాపేట జిల్లాలోని పలు పాఠశాల్లో అమలు చేస్తున్నారు. కస్తూర్బాతోపాటు సర్కారు బడుల్లో అమలు తీరును పర్యవేక్షిస్తున్న రాష్ట్ర అధికారులు.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సర్కార్ పాఠశాల్లో ఈ విధానం అమలు చేయాలనే ఆలోచనతో ఉన్నారు.
విద్యాశాఖలో పారదర్శకతే లక్ష్యంగా..
విద్యాశాఖలో పారదర్శకతే లక్ష్యంగా బయోమెట్రిక్ హాజరును ప్రభుత్వం అమలు చేస్తున్నది. దాంతో ఉపాధ్యాయులు కచ్చితంగా పాఠశాల ప్రారంభ సమయానికి హాజరయ్యే అవకాశం ఉంటుంది. మరోవైపు ఆలస్యంగా వస్తే బయోమెట్రిక్లో రెడ్ మార్క్ నమోదవుతుండడంతో అంతా సకాలంలో హాజరవుతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.
బయోమెట్రిక్ ఉపయోగాలు
బయోమెట్రిక్తో ఉదయం ప్రార్థన సమయానికి ఎంత మంది ఉపాధ్యాయులు వస్తున్నారు.. ఆలస్యంగా ఎంత మంది వస్తున్నారో తెలుస్తుంది. జిల్లా విద్యాశాఖలోని సమగ్రశిక్షలో సెక్టోరియల్ అధికారి (జీసీడీఓ)లకు ఏయే పాఠశాలల్లో ఎస్ఓ నుంచి ఉపాధ్యాయుల వరకు ఎవరు వచ్చారో తెలుసుకునే అవకాశం సులభమవుతుంది. ఎవరు సెలవులో ఉన్నారో తెలుస్తుంది. ఉపాధ్యాయులంతా సకాలంలో హాజరయ్యే అవకాశం ఉంటుంది.
బయోమెట్రిక్ డివైజ్లు అందజేశాం
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో బయోమెట్రిక్ హాజరు అమలు చేస్తున్నాం. ఇందుకు సంబంధించి డివైజ్లను అందజేశాం. గతంలో ఏ పాఠశాలలో ఎంత మంది ఉపాధ్యాయులు హాజరయ్యారనే అంశాన్ని ఫోన్ ద్వారా గానీ, వాట్సాప్ ద్వారా గానీ తెలుసుకునేది. బయోమెట్రిక్ హాజరు విధానంతో జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుంచే పర్యవేక్షించే అవకాశం కలిగింది.
– పి.సరిత, సెక్టోరియల్ అధికారి, జీసీడీఓ, సమగ్రశిక్ష, నల్లగొండ
బయోమెట్రిక్ కచ్చితంగా పాటించాలి
రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ ఆదేశాలతో కస్తూర్బా గాంధీ పాఠశాలల్లో బయోమెట్రిక్ హాజరు అమలు చేస్తున్నాం. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 27 కస్తూర్బా గాంధీ పాఠశాలలోవిజయవంతంగా సాగుతుంది. ప్రతి పాఠశాలలోని ప్రత్యేకాధికారులు(ఎస్ఓలు) బయోమెట్రిక్ హాజరుతోపాటు విద్యార్థుల హాజరును నమోదు చేసి జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్షకు అందజేయాలి.
– బి.భిక్షపతి, డీఈఓ, నల్లగొండ.