సిద్దిపేట, జూలై 11: పేదలకు కంటి పరీక్షలు, అవసరమైన ఆపరేషన్లు ఉచితంగా నిర్వహించాలని ఉద్దేశంతో సిద్దిపేటలో ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖాన ఏర్పాటు చేసుకున్నామని, ఆరోగ్యం బాగుంటేనే అభివృద్ధి సాధ్యమని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. శనివారం సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో ఆటో ఎలక్ట్ట్రికల్ అసోసియేషన్ వారికి ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖాన సౌజన్యంతో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్ హుస్సేన్తో కలిసి హరీశ్రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. హైదరాబాద్కు వెళ్లే స్థోమత లేని ఎంతోమందికి సిద్దిపేటలోనే నాణ్యమైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఎల్వీ ప్రసాద్ దవాఖాన ఏర్పాటు చేసి, ఇప్పటికే ఎంతో మందికి చికిత్స, ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. బైక్ మెకానిక్లు, బస్సు డ్రైవర్లు, ఎలక్ట్ట్రీషియన్లు వంటి వృత్తుల వారు దవాఖానను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 40 ఏండ్ల తర్వాత చాలామందికి కంటి సమస్యలు వస్తుంటాయని, చాలామంది పరీక్షలు చేయించుకోవడానికి నిర్లక్ష్యం చేస్తుంటారని తెలిపారు.
ప్రతి ఒకరూ తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలని హరీశ్రావు పిలుపునిచ్చారు. ఎవరికైనా కళ్లద్దాలు, ఆపరేషన్ అవసరమైతే చేయించే బాధ్యత తాను తీసుకుంటానని హరీశ్రావు భరోసా ఇచ్చారు. సిద్దిపేటను అన్నిరంగాల్లో అభివృద్ధి చేశానని, రానున్న రోజుల్లో ఇక్కడి ప్రజలకు మరింత సేవ చేస్తానని హరీశ్రావు అన్నారు. కార్యక్రమంలో నాయకులు పాల సాయిరామ్, మెహన్లాల్, బాబుజానీ, ఆజీజ్ తదితరులు పాల్గొన్నారు.