సిటీబ్యూరో, జూలై 11 (నమస్తే తెలంగాణ): ఒరిస్సా కేంద్రంగా నగరంలో గంజాయి వ్యాపారం చేస్తున్న గంజాయి డాన్ బజరంగ్ రేణుక బాయ్ను ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలి వద్ద నుంచి రూ.10లక్షల విలువ చేసే 14.135 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఎల్బీనగర్ ఎక్సైజ్ డీటీఎఫ్ సీఐ సత్యనారాయణరావు కథనం ప్రకారం…హయత్నగర్లోని రోడ్ నెంబర్ 9, జకడి కాలనీ, సాహెబ్ నగర్ ప్రాంతానికి చెందిన భజరంగ్ రేణుక బాయి ఒరిస్సా నుంచి గంజాయి తీసుకొని వచ్చి నగరంలోని హయత్నగర్, వనస్థలిపురం పరిసర ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాలకు గంజాయి సరఫరా చేయడం, విక్రయాలకు పాల్పడటం వంటి నేరాలకు పాల్పడుతోంది.
ఈ మేరకు సమాచారం అందుకున్న ఎల్బినగర్ డీటీఎఫ్ బృందం శనవారం నిందితురాలి నివాసంపై దాడులు జరిపారు. ఈ దాడుల్లో రేణుక బాయి ఇంట్లో గంజాయి లభించింది. దీంతో నిందితురాలిని అరెస్టు చేసి, ఆమె వద్ద నుంచి రూ.10లక్షల విలువ చేసే 14.135కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును హయత్నగర్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. నిందితురాలిని పట్టుకున్న బృందంలో ఎల్బీనగర్ సీఐ సత్యనారాయణరావుతో పాటు ఎస్ఐ శంకర్, హెడ్ కానిస్టేబుల్ ఆనంద్, కానిస్టేబుల్ ప్రవీణ్,వెంకటేష్, సునిత తదితరులు ఉన్నారు.
గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను కుత్బుల్లాపూర్ డీటీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 1.052కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. బీహార్కు చెందిన రాజ్కుమార్(20), విజయ్కుమార్(23)లు స్థానికంగా గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నారు. సమాచారం అందుకున్న స్థానిక డీటీఎఫ్ పోలీసులు గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న నిందితులిద్దరిని రెడ్హ్యాండెడ్గా పట్టుకుని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 1.052కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.