రాజకీయాల్లో అప్పటి టీఆర్ఎస్… నేటి బీఆర్ఎస్ది ఎప్పటికీ ప్రత్యేక శైలినే. పోరాట రూపం, ఎజెండా సెట్టింగ్, సంస్థాగత కార్యాచరణలోనూ తనదైన ముద్రతో ముందుకు సాగడం పరిపాటి. ఇతర పార్టీలకు అందనంత ఎత్తులో రాజకీయ వ్యూహాన్ని రూపొందించడంలో, సమకాలీన రాజకీయాల్లో సాటి లేదు. ఇదే తరహాలో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు అంతటా హైలెట్గా నిలుస్తున్నాయి. పార్టీ కోసం అహర్నిశలు పాటుపడుతున్న నేతలు, కార్యకర్తలందరినీ ఒక్కచోటకు చేర్చడంతో పండుగ సంబురం కనిపిస్తున్నది. గులాబీ శ్రేణులతోపాటు సానుభూతిపరులు, సంక్షేమ పథకాల లబ్ధిదారులు, అభిమానులు ఊహించని విధంగా కలిసికట్టుగా తరలివస్తుండడంతో నూతనోత్సాహం తొణికిసలాడుతున్నది. కేసీఆర్ సర్కార్తో వ్యవస్థాపరంగా వచ్చిన మార్పులతోపాటు వ్యక్తిగతంగా జరిగిన మేలును అందరూ గొప్పగా చెప్పుకొంటున్నారు. బీఆర్ఎస్ను మరింత బలోపేతం చేసే కార్యాచరణతో సిద్ధమవుతున్నారు. బుధవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలు కొనసాగాయి. భువనగిరి నియోజకవర్గంలోని సంగెంలో బీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి యాదవరెడ్డి, జిల్లా అధ్యక్షుడు కంచర్ల, జడ్పీ చైర్మన్ సందీప్రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాలలో జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపిక, ఎమ్మెల్యే గాదరి కిశోర్, మిర్యాలగూడ పట్టణంలోని నందిపాడులో టీఎస్ఈడబ్ల్యూడీసీ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్రావు, ఆగ్రోస్ చైర్మన్ విజయసింహారెడ్డి, నాగార్జునసాగర్ నియోజకవర్గం హాలియాలో ఎమ్మెల్యే నోముల భగత్, కోదాడ నియోజకవర్గంలోని మోతె మండలం సిరికొండలో బీఆర్ఎస్ ఇన్చార్జి మెట్టు
శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్ పాల్గొని బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.
వలిగొండ, మార్చి 29 : అభివృద్ధే బీఆర్ఎస్ మంత్రమని.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజా క్షేత్రంలోకి తీసుకెళ్లాలని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం మండలంలోని సంగెం గ్రామంలో, సాయంత్రం వలిగొండలో పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శేఖర్రెడ్డి మాట్లాడుతూ పోరాడి సాధించిన తెలంగాణ రాష్ర్టాన్ని అవహేళన చేసిన సీమాంధ్రులకు, ప్రతిపక్ష పార్టీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధితో సమాధానం చెప్పారన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలను పక్క రాష్ర్టాలు, ప్రతిపక్షాలు పాలిస్తున్న రాష్ర్టాలు కాపీ కొడుతున్నాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరం చేసేందుకు కేంద్రం చేస్తున్న కుట్రలు ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు సాగవన్నారు. కార్యకర్తలే పార్టీకి బలమని, పార్టీ మరింత బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. కష్టపడ్డ వారికి తప్పక గుర్తింపు లభిస్తుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికీ తెలియజెప్పాలని బీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ ఒంటేరు యాదవరెడ్డి సూచించారు. రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, దళిత బంధు, పింఛన్లు, మిషన్ భగీరథ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలన్నారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని సూచించారు. అంతకుముందు ప్రొఫెసర్ జయశంకర్ సార్, తెలంగాణ తల్లి చిత్రపటాలకు నివాళులర్పించారు. జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు కొల్పుల అమరేందర్, మండల కన్వీనర్ పనుమటి మమతానరేందర్రెడ్డి, నాయకులు రాజవర్ధన్రెడ్డి, శ్రీనివాస్, వెంకట్రెడ్డి, వెంకట్రెడ్డి, రాంరెడ్డి, రమేశ్, లింగస్వామి, రత్నయ్య, రవీంద్ర, మంజుల, సందీప్, కృష్ణ పాల్గొన్నారు.
‘ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి మంత్రాన్ని బీఆర్ఎస్ శ్రేణులు వివరిస్తూ ప్రజాక్షేత్రాన్ని చైతన్యం చేయాలి. మన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తుండగా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓర్వలేక తెలంగాణ సర్కారుపై కుట్రలు పన్నుతున్నది. ఆ కుట్రలను తిప్పికొట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను ఇంటింటికీ వివరించాలి. పార్టీ బలోపేతానికి ప్రతీ కార్యకర్త మరింత కృషి చేయాలి.’
-వలిగొండ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి