భూదాన్ పోచంపల్లి, జనవరి 17 : చైనా మాంజా ప్రాణాల మీదికి తెస్తున్నది. సంక్రాంతి పండుగ సందర్భంగా పతంగుల ఎగురవేసేందుకు కొంత మంది నిషేధిత చైనా మాంజాను వాడారు. అవి రోడ్లు, చెట్లపై వేలాడుతూ మనుషులతోపాటు పశుపక్షాదులను సైతం గాయాలపాలు చేస్తున్నాయి. భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలో బుధవారం చైనా మాంజా తగిలి ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. పోచంపల్లికి చెందిన రంజిత్ కుమార్ స్థానిక విజయదుర్గ రైస్ మిల్లులో హమాలీ కాంట్రాక్టర్గా పని చేస్తున్నాడు.
మధ్యాహ్నం ఇంటి వద్ద భోజనం చేసి తిరిగి రైస్ మిల్కు బైక్పై వెళ్తుండగా మెడకు మాంజా తగిలింది. తీవ్రంగా గాయం కావడంతో స్థానిక ప్రైవేట్ దవాఖానలో చికిత్స తీసుకున్నాడు. అలాగే శివారెడ్డి గూడెం గ్రామానికి చెందిన మేకల సునీతారెడ్డి వీబీకేగా పని చేస్తున్నారు. పని నిమిత్తం వెలుగు ఆఫీస్కు స్కూటీపై వెళ్లి వస్తుండగా చెయ్యి, గొంతుకు మాంజా తగలడంతో తీవ్ర గాయం అయ్యింది. ఆమె హెల్మెట్ ధరించి ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. చైనా మాంజా విక్రయిస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.