వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ దండుగ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జిల్లా రైతులు భగ్గుమన్నారు. రైతాంగానికి మూడు గంటల విద్యుత్ చాలనడం పట్ల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. పలుచోట్ల రేవంత్రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు.
2014కు ముందున్న విద్యుత్ సమస్యలు తీసుకొస్తామని చెప్పకనే కాంగ్రెస్ పార్టీ చెబుతుందని ఈ సందర్భంగా రైతులు, బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. బుధవారం మండల కేంద్రాల్లో, గురువారం నియోజకవర్గాలు, జిల్లా కేంద్రాల్లో నిరసనలకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది.
– నల్లగొండ ప్రతినిధి, జూలై 11 (నమస్తే తెలంగాణ)