తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎన్ని కుట్రలు ఛేదించామో, అంతకు మించి నేడు రాష్ట్రంపై విషం చిమ్ముతూ కేంద్రం చేస్తున్న కుట్రలను అధిగమిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ముందుకు సాగుతున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచామని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఆ ప్రగతిని ఆపలేరని తెలిపారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారాలకు సూర్యాపేట నియోజకవర్గం నుంచి ఎంపికైన 86 పంచాయతీలకు గురువారం సూర్యాపేటలో మంత్రి అవార్డులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అన్నారు. గ్రామాలు అన్ని రంగాల్లో ఎంతో ప్రగతి సాధించాయని, పల్లెలో తిరిగిన కేంద్ర మంత్రులు అభివృద్ధిని చూసి బిత్తర పోయారని తెలిపారు. పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, నర్సరీలు, ట్రాక్టర్ ట్రాలీలు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ఇలా ఎన్నో కార్యక్రమాలు ఉత్తమ అవార్డులు సాధించడానికి తోడ్పడ్డాయని చెప్పారు.
సూర్యాపేట టౌన్, మార్చి 23 : ఎవరెన్ని కుట్రలు చేసినా అభివృద్ధిని ఆపలేరని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాలనూ ఎవరూ ఊహించని రీతిలో అభివృద్ధి సాధించి యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల సర్వేలు చేశాకే తెలంగాణలో అభివృద్ధి చెందిన గ్రామాలకు ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు ఇవ్వక తప్పలేదని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి జరుగుతుందనడానికి ఉత్తమ అవార్డులే నిదర్శనమని తెలిపారు. జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లాకేంద్రంలోని పాత మిర్చి యార్డులో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారాలను నియోజకవర్గవ్యాప్తంగా 86 గ్రామాలకు మండల స్థాయి ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు అందించి మాట్లాడారు. గ్రామాలాభివృద్ధే దేశాభివృద్ధి అని నమ్మిన వ్యక్తిగా సీఎం కేసీఆర్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషి చేశారని కొనియాడారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి గడపకూ సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. మోదీ మూల రాజకీయాలతో కేంద్ర మంత్రులను సైతం గ్రామాల్లో తిప్పుతూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా నీచ రాజకీయాలకు దిగజారుతున్నారని విమర్శించారు. అయినప్పటికీ మన గ్రామాల అభివృద్ధి చూసి వారంతా బిత్తరపోతున్నారని తెలిపారు. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో 113 గ్రామ పంచాయతీల్లో 86 గ్రామపంచాయతీలు అభివృద్ధిలో నిలవడం సర్పంచుల పనితీరుకు నిదర్శనమని అభినందించారు. జిల్లాలోని 475 గ్రామ పంచాయతీల్లో 343గ్రామ పంచాయతీలు 621 రంగాల్లో ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డులు లభించాయన్నారు. ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, నర్సరీలు, ప్రత్యేక ట్రాక్టర్లు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ఇలా మరెన్నో అద్భుతమైన పథకాలు ఇంతటి అవార్డులు సాధించడానికి మూలమని పేర్కొన్నారు. నేడు అందుకున్న ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డుల్లో బీఆర్ఎస్తో పాటు ఇతర పార్టీల సర్పంచులు ఉన్న గ్రామ పంచాయతీలు ఉండటమే ఇందుకు నిదర్శనమన్నారు. ఇంతటి ఘనత ముమ్మాటికీ సీఎం కేసీఆర్కే దక్కుతుందని, అందుకే ఆయన నాయకత్వం కోసం యావత్ దేశంలోని అన్ని రాష్ర్టాలు ఎదురుచూస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావ్, అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, ఆర్డీఓ రాజేంద్రకుమార్, జడ్పీ సీఈఓ సురేశ్తో పాటు ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.
భువనగిరి కలెక్టరేట్ : ఉత్తమ జాతీయ గ్రామపంచాయతీల ఎంపికలో భాగంగా 9 అంశాల్లో 27 గ్రామపంచాయతీలను అవార్డులకు ఎంపిక చేశారు. మొదటి విభాగం పేదరిక నిర్మూలన జీవనోపాధుల అభివృద్ధికి మొదటి బహుమతి టుప్పల్ మండలంలోని డి మారాపురం, రెండో బహుమతి ఆలేరు మండలంలోని కొలనుపాక, మూడో బహుమతి బీబీనగర్, రెండో విభాగం ఆరోగ్య పంచాయతీ అవార్డుకు మొదటి బహుమతి మోటకొండూరు మండలంలోని ఇకుర్తి, రెండో బహుమతి ఆలేరు మండలంలోని మంతపురి, మూడో బహుమతి తురపల్లి మండలం వాసాలమర్రి, మూడో విభాగం బాలల స్నేహపూరిత పంచాయతీలో మొదటి బహుమతి రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం, రెండో బహుమతి వలిగొండ మండలం పహిల్వాన్పురం, మూడో బహుమతి బీబీనగర్ మండలం నీదితండా, నాలుగో విభాగం నీరు సరిపోయే పంచాయతీ అవార్డుల కింద మొదటి బహుమతి భువనగిరి మండలంలోని నమాజ్పల్లి, రెండో బహుమతి చౌటుప్పల్ మండలం ఎస్ లింగోటం, మూడో బహుమతి గుండాల మండలంలోని గంగాపురం, ఐదో విభాగం పరిశుభ్రమైన పచ్చని పంచాయతీ అవార్డులో మొదటి బహుమతి చౌటుప్పల్ మండలంలోని ఎస్.లింగోటం, రెండో బహుమతి భూదాన్పోచంపల్లి మండలంలోని జలాల్పురం, మూడో బహుమతిని భువనగిరి మండలంలోని వడాయిగూడెం, ఆరో విభాగం స్వయం సమృద్ధి మౌలిక సదుపాయాలు అవార్డుకు మొదటి బహుమతి రామన్నపేట మండలంలోని వెల్లంకి, రెండో బహుమతి రాజపేట మండలంలోని రేణిగుంట, మూడో బహుమతి వలిగొండ మండలంలోని సింగారం, ఏడో విభాగం సామాజిక భద్రత పంచాయతీల్లో మొదటి బహుమతి బీబీనగర్ మండలంలోని అన్నెంపట్ల, రెండో బహుమతి మోటకొండూరు మండలంలోని దిలావర్పూర్, మూడో బహుమతి రాజాపేట మండలంలోని జాల, ఎనిమిదో విభాగం పారదర్శకంగా పాలన పంచాయతీ అవార్డుల్లో మొదటి బహుమతి భువనగిరి మండలం తాజ్పూర్, రెండో బహుమతి భూదాన్ పోచంపల్లి మండలంలోని సాయినగర్, మూడో బహుమతి బొమ్మలరామారం మండలంలోని రామలింగంపల్లి, 9వ విభాగంలో మహిళా స్నేహ పూర్వక పంచాయతీ విభాగంలో మొదటి బహుమతి భూదాన్ పోచంపల్లి మండలంలోనని శివారెడ్డిగూడెం, రెండో బహుమతి బీబీనగర్ మండలంలోని రాఘవాపురం, మూడో బహుమతిని తురపల్లి మండలంలోని మాదాపూర్ గ్రామాలు గెలుపొందాయి.