యాదాద్రి భువనగిరి, జనవరి 23 (నమస్తే తెలంగాణ) ; ఆరు గ్యారెంటీల పథకాల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజా పాలన దరఖాస్తుల ఆన్లైన్ కార్యక్రమం పూర్తయ్యింది. ఉమ్మడి జిల్లాలో వివిధ పథకాల కోసం 53,54,791 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా రూ. 2,500 పథకం కోసం వినతులు పెట్టుకున్నారు. ఆ తర్వాత సబ్సిడీ గ్యాస్, ఫ్రీ కరెంట్, ఇండ్ల కోసం అప్లికేషన్లో టిక్ చేశారు. 11,79,035 దరఖాస్తుల కంప్యూటరైజేషన్ జరిగి వారం గడుస్తున్నా తదుపరి కార్యాచరణపై ఇంకా స్పష్టత రాలేదు.
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఈ మేరకు అధికారంలోకి వచ్చాక ఆయా పథకాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని కోరింది. ఇందుకోసం గత నెల 28వ తేదీన ప్రజా పాలన కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పల్లెలు, పట్టణాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించారు. ఈ నెల 6న దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియగా, వాటిని 17వ తేదీ వరకు ఆన్లైన్ చేశారు. యాదాద్రి జిల్లాలో మొత్తంగా 2,68,790 దరఖాస్తులను కంప్యూట రైజ్డ్ చేశారు. ఒక్కో దరఖాస్తులో కుటుంబలోని నలుగురైదుగురు వ్యక్తులు కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఇందులోనూ ఒకే వ్యక్తి రెండు, మూడు పథకాల కోసం టిక్ చేశారు. దీంతో వివిధ పథకాల కోసం మొత్తంగా 12,06,671 లబ్ధిదారులుగా దరఖాస్తుల్లో పేర్కొన్నారు.
రూ. 2,500 పథకం కోసం మస్తుగా..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చింది. మహిళలకు నెలకు రూ. 2,500 ఇస్తామని వాగ్దానం చేసింది. దీంతో ప్రజాపాలన దరఖాస్తుల్లో అత్యధికంగా 2,32,053 దరఖాస్తులు వచ్చాయి. ఆ తర్వాత సబ్సిడీ గ్యాస్ కోసం 2,30,412, ఫ్రీ కరెంట్ కోసం 2,09,899, ఇండ్ల కోసం 2,06,530, రైతు బంధు కోసం 1,22,084, కౌలు బంధు కోసం 7,316, దివ్యాంగ పింఛన్లకు 8,351, ఇతర పింఛన్లకు 57,299, ఉద్యమ కారులకు 250 గజాల కోసం 2,616 దరఖాస్తులు వచ్చాయి.
క్షేత్రస్థాయి పరిశీలన ఎప్పుడో..?
ఇటీవల దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ పూర్తయ్యింది. ఈ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారని ఇప్పటికే అధికారులు పేర్కొన్నారు. కుటుంబంలో ఎంత మంది ఉన్నారు..? ఏయే పథకానికి దరఖాస్తు చేసుకున్నారు..? అర్హులా కాదా..? ఆస్తులెన్ని..? తదితర అంశాలను పరిశీలిస్తారని తెలిపారు. కానీ ఆన్లైన్ ప్రక్రియ ముగిసి వారం గడుస్తున్నా దీనికి సంబంధించి ఎలాంటి కార్యక్రమం ప్రారంభించలేదు. ఎప్పుడు చేస్తారనే స్పష్టత కూడా లేదు. దీంతో దరఖాస్తులు ఎప్పుడు పరిశీలిస్తారో..? పథకాలను ఎప్పుడు అమలు చేస్తారో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నల్లగొండ, సూర్యాపేటలో ఇలా..
నల్లగొండ జిల్లాలో 5,35,152 దరఖాస్తులను ఆన్లైన్ చేశారు. ఇందులో అత్యధికంగా సబ్సిడీ గ్యాస్ కోసం 4,60,336 దరఖాస్తులు వచ్చాయి. ఆ తర్వాత 2,500 పథకం కోసం 4,58,711, ఇండ్లు 4,41,603, ఫ్రీ కరెంట్ కోసం 3,79,242, రైతు బంధు కోసం 2,60,149 అప్లికేషన్లు వచ్చాయి. సూర్యాపేట జిల్లాలో 3,75,093 దరఖాస్తులను ఆన్లైన్ చేశారు. ఇందులో అత్యధికంగా సబ్సిడీ గ్యాస్ కోసం 3,26,383 అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత 2,500 పథకం కోసం 3,18,053, ఇండ్ల కోసం 3,16,884, ఫ్రీ కరెంట్ కోసం 2,75,272 దరఖాస్తులు వచ్చాయి.