రామగిరి, ఆగస్టు 11 : తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను పార్లమెంట్లో చట్టం చేయాలని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు సయ్యద్ హశం అన్నారు. సోమవారం సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో కుల గణన చేపట్టి 56% ఉన్న బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్లు అమలు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగిందన్నారు. పార్లమెంట్లో ఆమోదింపజేసి చట్టం చేయడానికి బీజేపీ నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందని ఆరోపించారు.
మైనార్టీలకు రిజర్వేషన్లు వర్తింపజేస్తున్నారని కుంటి సాకులు చెప్పడం సరికాదన్నారు. ముస్లింలలో దూదేకుల, ఫకీరు, రాయికొట్టే కాశవారు అనేక సంవత్సరాల నుండి బీసీలుగా ఉన్నట్లుత తెలిపారు. బీజేపీ ద్వంద వైఖరి మానుకుని ఇప్పటికైనా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను పార్లమెంట్లో చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు ఎండి.సలీం, పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, పట్టణ కమిటీ సభ్యులు గాదె నరసింహ, దండెంపల్లి సరోజ, అవుట రవీందర్, నాగరాజు, విష్ణుమూర్తి, లక్ష్మణ్, లక్ష్మీపతి, దూదిమెట్ల వెంకన్న, నరసింహ పాల్గొన్నారు.