పదో తరగతి హిందీ పరీక్ష పత్రం లీకేజీ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అడ్డంగా దొరకంతో పోలీసులు విచారణలో ఏ1 నిందితుడిగా తేల్చారు. సీఎం కేసీఆర్ సర్కార్ను అప్రతిష్టపాలు చేసేలా, బీఆర్ఎస్ పార్టీపై బురదచల్లేలా చేసిన కుట్రలో భాగమే లీకేజీ వ్యవహారమన్నది స్పష్టమైంది. కానీ తప్పును కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ నాయకులు నానా హంగామా చేశారు. బండి సంజయ్ అరెస్టును కూడా రాజకీయంగా ఉపయోగించుకునేందుకు యత్నించి అభాసుపాలయ్యారు. సంజయ్ను అరెస్ట్ చేసి బొమ్మలరామారం పోలీస్స్టేషన్కు తరలించగా, బీజేపీ నేతలు, కార్యకర్తలు పీఎస్ ఎదుట కవ్వింపు చర్యలకు దిగారు. స్థానికంగా అంతంతమాత్రంగానే ఉన్న క్యాడర్తో ఏమీ చేయలేక హైదరాబాద్ నుంచి రప్పించి రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు.
మహిళా నేతలను అడ్డం పెట్టుకొని స్టేషన్లోకి చొచ్చుకెళ్లారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు, లీడర్లు సైతం పోలీసుస్టేషన్ ఎదుట నానా యాగి చేసేందుకు పాట్లు పడ్డారు. పోలీసులు ఓపికతో వ్యవహరించి వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సంజయ్ను చాకచాక్యంగా జిల్లా దాటించారు. ఇక మరోవైపు పేపర్ లీకేజీల వ్యవహారంలో బండి సంజయ్ తీరుపై ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజలు భగ్గుమన్నారు. పలుచోట్ల నిరసనలకు దిగారు. దిష్టిబొమ్మలు దహనం చేశారు. బండి సంజయ్ను తక్షణమే బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసి, అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని మంత్రి జగదీశ్రెడ్డి డిమాండ్ చేశారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు కూడా సంజయ్ తీరును తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ సర్కార్ను, బీఆర్ఎస్ పార్టీని అప్రతిష్ట పాలుచేసేందుకు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడడం దుర్మార్గమని మండిపడ్డారు.
బండి సంజయ్ను సస్పెండ్ చేయాల్సిందే
పేపర్ లీకేజీలో బండి సంజయ్ అడ్డంగా దొరికినా బీజేపీ చర్యలు తీసుకోకపోతే ఇది ఆ పార్టీ కలిసి చేసిన కుట్రలానే భావించాల్సి వస్తుంది. రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థుల జీవితాలతో రాక్షస క్రీడకు తెరలేపడం దుర్మార్గం. టీఎస్పీఎస్సీ, ఎస్ఎస్సీ పరీక్షల లీకేజీల నిందితులంతా బీజేపీకి అనుబంధంగా పనిచేస్తున్న వారే. దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి వస్తున్న ఆదరణను తట్టుకోలేక చేస్తున్న కుట్రలే ఇవి. రాష్ట్ర ప్రజలు, మేధావులు, విద్యావంతులు బీజేపీ దుశ్చర్యలను ఖండించాలి.
– రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి
నల్లగొండ ప్రతినిధి/యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 5(నమస్తే తెలంగాణ)/బొమ్మలరామారం : టీఎస్పీఎస్సీ పేపర్ లీక్తో పాటు పదో తరగతి పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారంలోనూ బండి సంజయ్తో పాటు బీజేపీ నేతల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగ నియామకాలు తెలంగాణలో జరుగుతుండడాన్ని జీర్ణించుకోలేని విపక్షాలు, ముఖ్యంగా బీజేపీ నేతలు చేస్తున్న కుట్రలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న విషయం తెలిసిందే. దాంతో పాటు ఏడాదంతా కష్టపడి పరీక్షలకు సిద్ధ్దమైన పదో తరగతి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ చేస్తున్న దుశ్చర్యలు సైతం అందర్ని విస్మయానికి గురిచేస్తున్నాయి. టెన్త్ హిందీ పేపర్ లీకేజీతో సంబంధం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ను వరంగల్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. దీనిని కూడా రాద్ధాంతం చేయాలని బీజేపీ కుయుక్తులు పన్నింది. అయితే వారి ఆటలు సాగనివ్వకుండా పోలీసులు పకడ్బందీగా వ్యవహరించారు. వరంగల్లో హిందీ పేపర్ లీకేజీతో రంగంలోకి దిగిన పోలీసులు బండి సంజయ్ను మంగళవారం అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి బుధవారం తెల్లవారుజామున బొమ్మలరామారం పోలీస్ స్టేషన్కు తరలించారు. దాదాపు ఏడు గంటలపాటు పీఎస్లోనే ఉంచారు. ఉదయం మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్యగౌడ్తోపాటు పలువురు నేతలు బండిని కలిసి పరామర్శించారు. బండి సంజయ్ని కలిసేందుకు అడ్వకేట్లకు కూడా అనుమతించారు. అయితే అక్కడి నుంచి బీజేపీ డ్రామా షురూ చేసింది. పీఎస్ ముందు హంగామా సృష్టించింది. ఆ పార్టీ శ్రేణులు రాష్ట్ర ప్రభుత్వానికి, కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులను కవ్వించేందుకు ప్రయ్నతించాయి. ఈ వ్యవహారంతో సంబంధంలేదని భారత్ మాతాకీ జై, జైశ్రీరాం అంటూ నినాదాలు చేస్తూ మతం రంగు పూసే కుట్ర చేశాయి. పోలీసులు ఎంత శాంతంగా ఉన్నా కావాలని రెచ్చగొట్టేలా వ్యవహరించాయి. పోలీస్ స్టేషన్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నం చేశాయి. దాంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.
కేడర్ లేక హైదరాబాద్ నుంచి రప్పించి
యాదాద్రి జిల్లాలో బీజేపీకి బలం లేదు. కనీసం గ్రామాల్లో కమిటీలు కూడా లేవు. ఇక బొమ్మలరామారంలోనూ ధర్నా చేయడానికి సరపడా కేడర్ కూడా లేదు. దాంతో ఆందోళన చేయడానికి జనం గతి లేకపోవడంతో హైదరాబాద్ నుంచి రప్పించారు. బీజేపీ లీడర్లు, జీహెచ్ఎంసీలోని కార్పొరేటర్లు, ఇతర శ్రేణులను వాహనాల్లో తీసుకొచ్చారు. బొమ్మలరామారం పీఎస్ ముందు హల్చల్ చేయించారు. రోడ్డుపై బైఠాయించేందుకు ప్రయత్నించారు. బ్యాచ్బ్యాచ్లుగా తరలివచ్చి, పదేపదే సీన్ క్రియేట్ చేశారు. మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, కూన శ్రీశైలంగౌడ్, మాజీ ఎంపీ చాడ సురేశ్రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్యామ్సుందర్రావు, ఇతర రాష్ట్ర నేతలు వేర్వేరుగా వచ్చి వాతావరణాన్ని చెడగొట్టాలని చూశారు. దాంతో చేసేదేం లేక పోలీసులు అందర్నీ అరెస్ట్ చేసి మంచాల, బీబీనగర్, తుర్కపల్లి, శామీర్పేట పోలీస్ స్టేషన్లకు తరలించారు.
మహిళలను అడ్డం పెట్టుకొని డ్రామా
పోలీస్ స్టేషన్ వద్ద ఎలాగైనా రచ్చ చేయాలని నిర్ణయించుకున్న బీజేపీ.. ఆ దిశగా వచ్చిన అన్ని అవకాశాలను ఉపయోగించుకునేందుకు ప్రయత్నించింది. హైదరాబాద్ నుంచి రప్పించిన మహిళా నేతలను అడ్డం పెట్టుకొని హైడ్రామా చేయాలని చూసింది. సదరు నేతలతో పదేపదే స్టేషన్ల వద్ద హంగామా చేయించింది. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే.. వారితో వాగ్వాదానికి దిగిన పరిస్థితి కనిపించింది. కేసులు పెడతామని పోలీసులనే బెదిరించారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అరెస్ట్ చేయగానే..మళ్లీ కొంద మందిని రంగంలోకి దింపి రచ్చ చేసేందుకు ప్రయత్నించారు.
రఘునందన్రావు రుసరుస..
పీఎస్కు వచ్చిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు కొద్దిసేపు సీన్ క్రియేట్ చేశారు. వచ్చి రాగానే లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందో తెలుసుకుంటానని అదరగొట్టారు. ఏకంగా లైసెన్స్ గన్ వెంటతెచ్చుకున్నారు. దాంతో అక్కడున్నోళంతా ఆందోళన చెందారు. పోలీసులు ఆయనను అరెస్ట్ చేస్తుండగా .. వారిపైనే రుసరుసలాడారు. పోలీసు అధికారులతో దురుసుగా ప్రవర్తిస్తూ.. వాగ్వాదానికి దిగారు. తప్పని పరిస్థితుల్లో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి.. శామీర్పేట పీఎస్కు తరలించారు.
చాకచాక్యంగా జిల్లా దాటించిన పోలీసులు
బండి సంజయ్ అరెస్ట్తో బీజేపీ రచ్చ చేస్తుండటంతో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు. బొమ్మలరామారం పీఎస్ నుంచి బండి తరలింపు నేపథ్యంలో పరిసర ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకున్నారు. ముందుగా హైదరాబాద్ వైపు తీసుకెళ్తున్నట్లు అందరినీ డైవర్ట్ చేశారు. ఆ రూట్ను క్లియర్ చేశారు. కానీ హఠాత్తుగా బండి కాన్వాయ్ను తుర్కపల్లి రోడ్డు వైపు మళ్లీంచారు. బండి సంజయ్ను బయటకు తీసుకొచ్చే సమయంలో బీజేపీ శ్రేణులు తీవ్రంగా అడ్డుకునే ప్రయత్నం చేశాయి. పోలీసులు వారిని చెదరగొట్టి.. కాన్వాయ్ను ముందుకు నడిపించారు. అయితే ఎక్కడికి తీసుకెళ్తున్నారనేది స్పష్టత ఇవ్వలేదు. మీడియతోపాటు, లీడర్లకు కూడా సస్పెన్స్గా మారింది. అయితే బండిని భువనగిరి కోర్టులో హాజరు పర్చి, రిమాండ్కు తరలిస్తారని భావించారు. ఆ విధంగానే భువనగిరి పట్టణానికి తీసుకొచ్చినప్పటికీ.. అక్కడ ఆగకుండానే ఆలేరు వైపు కాన్వాయ్ వెళ్లింది. ఆలేరు కోర్టులోనూ హాజరు పర్చకుండా.. నేరుగా హైవే నుంచి జనగాంవైపు కాన్వాయ్ వెళ్లింది. పెంబర్తి వద్ద వరంగల్ పోలీసులకు బండిని అప్పగించారు. ఇదే సమయంలో అక్కడ కాస్త ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. దాంతో పోలీసులు లాఠీచార్జి చేసి బండిని వరంగల్కు తరలించారు.
మేధావుల, విద్యావంతుల విస్మయం
ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడంతో పాటు రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఏకంగా నిరుద్యోగుల, విద్యార్థుల జీవితాలనే ఫణంగా పెడుతూ కుట్రలు చేస్తున్న బీజేపీ నేతల తీరుపై విస్మయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా మేధావులు, విద్యావంతులు, ఉద్యోగార్ధులు బీజేపీ చేష్టలను తీవ్రంగా తప్పుపడుతున్నారు. గతంలో సాధారణంగా పరీక్షల్లో పాస్ కోసమో… లేదంటే పోటీ పరీక్షల్లో అడ్డదారుల్లో ఉద్యోగాలు సంపాదించేందుకో … లీకేజీలు జరగుతుండేవని అభిప్రాయ పడుతున్నారు. కానీ ప్రస్తుతం ఉద్యోగాలు భర్తీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని లీకేజీలకు పాల్పడుతుండడం ఎంతమాత్రం మంచి పరిణామం కాదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడడం సమంజసమా అని ప్రశ్నిస్తున్నారు. ఏకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, అది కూడా ఎంపీ అయి ఉండి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం సహించరాని విషయమని అభిప్రాయపడుతున్నారు. రాజకీయాలను మరింత అథోగతి పాలు చేసేలా బీజేపీ నేతల చర్యలు ఉన్నాయని, వీటిని బాధ్యతాయుతమైన ప్రతి ఒక్క పౌరుడూ ఖండించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి వారిని వారి హోదాతో సంబంధం లేకుండా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
పదో తరగతి పేపర్ల లీకేజీ వ్యవహరంలో బండి సంజయ్ తీరుకు నిరసనగా ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు బండి సంజయ్ దిష్టిబొమ్మలను దహనం చేశాయి. బండికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి.
రాజకీయ దురుద్దేశంతోనే లీకేజీలు : ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్
బీజేపీకి గుణపాఠం తప్పదు : ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
బండి బండారం బట్టబయలైంది : ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
అభివృద్ధిని జీర్ణించుకోలేని బీజేపీ : ఎమ్మెల్యే నోముల భగత్కుమార్
బండి పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దుచేయాలి : ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు
బండి సంజయ్ కాదు..తొండి సంజయ్ : ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి