కోదాడ, మే 28 : బక్రీద్ పండుగ త్యాగానికి, దైవభక్తికి ప్రతీక అని కోదాడ పెద్ద మసీదు ఇమామ్ మౌలానా అబ్దుల్ ఖాదీర్ సాహెబ్ అన్నారు. గురువారం కోదాడ సాలార్జంగ్ పేటలోని ఈద్గాలో బక్రీద్ పర్వదినం సందర్భంగా సామూహిక ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి మాట్లాడారు. ప్రవక్త ఇబ్రహీం అల్లాహ్ ఆజ్ఞకు లోబడి తన కుమారుడిని త్యాగం చేయడానికి సిద్ధపడిన సంఘటనను స్మరించుకుంటూ ముస్లింలు బక్రీద్ను జరుపుకుంటారని తెలిపారు. ఈ పండుగ ద్వారా సహనం, సేవాభావం, సోదరభావం పెంపొందుతాయన్నారు. బక్రీద్ సందర్భంగా ప్రత్యేక నమాజ్లు నిర్వహించి దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని ప్రార్థనలు చేస్తారని చెప్పారు.
బలి మాంసాన్ని పేదలు, అనాథలు, బంధుమిత్రులతో పంచుకోవడం ద్వారా సమానత్వ భావన పెరుగుతుందని పేర్కొన్నారు. యువత మానవతా విలువలను అలవర్చుకొని సమాజ సేవలో ముందుండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ పరస్పర గౌరవం, ప్రేమాభిమానాలతో పండుగను జరుపుకోవాలని ఆయన కోరారు. ప్రార్థనల అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక 9వ వార్డు కౌన్సిలర్ చీమ నరేష్ బాబు, నాయకులు షేక్ నయీమ్, శమ్మీ, రహీం, ముస్తఫా, సాదిక్ తో పాటు అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు.

త్యాగానికి, దైవభక్తికి ప్రతీక బక్రీద్ : మౌలానా అబ్దుల్ ఖాద్రి సాహెబ్