మేళ్లచెర్వు, ఏప్రిల్ 3 : సమైక్య పాలనలో ఎంతో మంది ముఖ్యమంత్రులు పరిపాలించినా తెలంగాణను అభివృద్ధి చేయలేదని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, బీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి మెట్టు శ్రీనివాస్ అన్నారు. నాడు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న తెలంగాణ నేడు ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నదని పేర్కొన్నారు. మండల కేంద్రంలో సోమవారం జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డితో కలిసి వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వరాష్ట్రంలో గతం కంటే వంద రెట్ల అభివృద్ధి జరిగిందన్నారు. ఉమ్మడి నల్లొండ జిల్లాలో కాంగ్రెస్ నాయకులకు ఒకరంటే ఒకరికి పడదని, వారు ఎన్ని పొర్లుడు దండాలు పెట్టినా ఓట్లు పడే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. బీజేపీ ప్రజలను వంచిస్తున్నదని విమర్శించారు.
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను మహారాష్ట్ర, కర్ణాటకలో అమలు చేయాలని అక్కడి ప్రజలు ఆయా ప్రభుత్వాలపై ఆందోళన చేపడుతున్నారని తెలిపారు. గతంలో దేశాన్ని పాలించిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. సీఎం కేసీఆర్కు హుజూర్నగర్ నియోజకవర్గంపై, ఎమ్మెల్యే సైదిరెడ్డి మీద ప్రత్యేక అభిమానం ఉన్నదని, అందుకే అధిక నిధులు ఇచ్చారని తెలిపారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో దేశ ప్రజలు సీఎం కేసీఆర్ వైపు చూస్తున్నారని, దేశమంతా ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రావాల్సిన నిధులను ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నదని విమర్శించారు. ప్రజల్లో విషం చిమ్ముతున్న ప్రతిపక్ష పార్టీల మాటలను తిప్పికొట్టాలని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.