నల్లగొండ రూరల్, డిసెంబర్ 6 : రైతులందరూ ఒక్కచోట కూర్చొని పంటల సాగు, ఇతర అంశాలపై చర్చించుకునేందుకు వీలుగా ప్రభుత్వం రైతు వేదికలను నిర్మించి వారికి అండగా నిలుస్తున్నది. ప్రతి ఐదు వేల ఎకరాలను వ్యవసాయ క్లస్టర్గా ఏర్పాటు చేసి రూ.22 లక్షల వ్యయంతో నల్లగొండ మండలంలో ఏడు రైతు వేదికలు నిర్మించింది. అలాగే ఒక్కో వేదికకు 150 కుర్చీలను సైతం అందించింది. వ్యవసాయ ప్రాధాన్యాన్ని చాటేలా.. రైతుల కోసం ప్రభుత్వం చేపడుతున్న పథకాల పట్ల అవగాహన కల్పించేలా గోడలపై చక్కని డిజైన్లతో వీటిని నిర్మించారు.
రైతు వేదికలను ఏఈఓలు పర్యవేక్షిస్తారు. నిత్యం వారు వేదికల వద్దకు వెళ్లి పంటల సాగు, యాజమాన్య పద్ధతులపై తగు సూచనలు చేస్తున్నారు. అదే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సైతం రైతు వేదికలు ఉపయోగపడుతున్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రంలోని కాంటాలు, గన్నీ బ్యాగులకు సైతం రైతు వేదికలు రక్షణగా నిలుస్తున్నాయి.
రైతులకు మెరుగైన వసతులు
రైతు వేదికలు వినియోగంలోకి రావడంతో రైతులకు మేలు జరుగుతుంది. ఒకే చోట రైతులను కూర్చోబెట్టి సాగుపై అవగాహన కల్పిస్తున్నాం. రైతులకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం రైతువేదికలకు కుర్చీలను ఏర్పాటు చేసింది. వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఏఈఓలతో రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.