మునుగోడు, డిసెంబర్ 27 : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీల హాజరును ఇక నుంచి నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ (ఎన్ఎంఎంఎస్)యాప్ ద్వారానే నమోదు చేయనున్నారు. కూలీల నమోదులో పారదర్శకత, జవాబుదారితనం పెంచేందుకు ఈ విధానాన్ని ప్రవేశ పెడుతున్నారు. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేయగా దీనికి అనుకూలంగా రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ మార్గదర్శకాలు జారీ చేశారు. ఇప్పటి వరకు ఉపాధి కూలీల హాజరు నమోదు మ్యానువల్గా జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం కొత్త సాప్ట్వేర్ ఎన్ఐసీ ప్రవేశపెట్టిన తర్వాత ఎన్ఎంఎంఎస్ ద్వారానే కూలీల హాజరు కొనసాగించాలి.
ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉపాధి కూలీల ఆధార్ కార్డును జాబ్ కార్డుతో అప్డేట్ చేసే ప్రకియ కొనసాగుతున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 9,940 మంది కూలీలు పనిచేస్తున్నారు. ఇందులో నల్లగొండలో 3,200 మంది, యాద్రాది భువనగిరిలో 3,700, సూర్యాపేట జిల్లాలో 3,040 మంది ఉన్నారు.
1 జనవరి, 2023 నుంచి యాప్ ద్వారా హాజరును తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధి హామీ పనుల్లో పారదర్శకత పెంచేందుకు యాప్ను ప్రవేశ పెట్టినట్లు అధికారులు తెలుపుతున్నారు. దీంతో కూలీలపై ప్రతిరోజు ఆన్లైన్ పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. గ్రామ స్థాయిలో ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ కంప్యూటర్ సెంటర్ నుంచి యాప్ను రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తర్వాత వర్క్ సైట్లో డిమాండ్ పెట్టిన విధంగా పనికి వచ్చిన సుమారు 20 మంది కూలీల గ్రూపు ఫొట్ను ఉదయం 11 గంటలలోపు మధ్యాహ్నం 2 గంటల లోపు ఎన్ఎంఎంఎస్ యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇదీ నేరుగా కేంద్ర సైట్కు వెళ్తుందని, దీనికి టైమ్ స్టాంప్, జియో ట్యాగింగ్ లింకై ఉంటుందని వివరించారు. యాప్తో కూలీల పేర్లు లింకై అప్లోడ్ అవుతాయని పేర్కొన్నారు.
జనవరి 1 నుంచి కూలీల మ్యానువల్ నమోదును నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా హాజరును వ్యక్తిగత లబ్ధిదారుల పథకం నుంచి మినహాయించారు. ఉపాధి హామీ కూలీల హాజరును వంద శాతం ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా పంపించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను కమిషనర్ ఆదేశించారు. ఉపాధి హామీలో రోజుకు ఎంత మంది కూలీలు పనిచేస్తున్నారు, పనితీరు వంటి అంశాలను నేరుగా ఢిల్లీ స్థాయిలో ్ల అధికారులు పర్యవేక్షించనున్నారు. ఎంత మంది కూలీలు పనిచేశారో ఆ రోజు కూలీల పేర్లు, సంతకాలతో మ్యానువల్ మస్టర్ ఇస్తేనే కూలీ డబ్బులు అందుతాయని ఈజీఎస్ అధికారి తెలిపారు.
జనవరి 1 నుంచి ఆధార్ బేస్ పేమెంట్లు అవుతాయని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. దాని కోసం ఉపాధి కూలీల ఆధార్కార్డులను జాబ్ కార్డుతో అప్డేట్ చేస్తున్నాం. త్వరలోనే ఈ పక్రియ పూర్తవుతుంది. జనవరి 1 నుంచి ఎన్ఎంఎంఎంస్ యాప్ ద్వారానే ఆన్లైన్లో ఉపాధి కూలీల హాజరు నమోదు చేయడం జరుగుతుంది.
– కె. శ్రీనయ్య, ఏపీఓ, మునుగోడు